28, ఆగస్టు 2013, బుధవారం

శ్రవణానందకరం........

"పుండాకోరెదవా.... .నీకు దీంట్లో దూరవలసిన పనేట్రా...."

గట్టిగా తిట్లు వినబడుతున్నాయి.......ఆడగొంతు....జనం మాత్రం బాగా మూగి ఉన్నారు. ముందు అంత పట్టించుకోలేదు...కానీ ఆ తిట్ల ప్రవాహంలో నుండి రెండు మూడు నాకు శ్రవణానందకరంగా వినబడ్డాయ్.

" ఒరేయ్ ...మా ఆయన బ్రతికున్నప్పుడు  మీ బాబు చేసిన ఎదవ పనులన్నీ పూసగుచ్చినట్టు చెప్పేవోడ్రా....అసలు మీ తాత ఇంజన్ లో బొగ్గేసే  ఉద్యోగం చేసే నాటినుండీ మీ బాబు బొగ్గు దొంగతనాలకు మరిగేడంట...."

మా రైల్వే మాటలు వినబడేసరికి నా క్యూరియాసిటీ మరీ పెరిగి పోయింది.మా అపార్ట్మెంట్ కు వెనకంతా ఎక్కువగా స్లమ్మ్  లాగే ఉంటుంది. అలా అని పూర్తిగా స్లమ్మ్  అని చెప్పలేం గానీ బాగా దిగువ మద్య తరగతి వారు ఉండే ఏరియా అని చెప్పవచ్చు.అక్కడొక మినీ బజార్ కూడా ఉండడంతో చిన్న చిన్న అవసరాల కోసం అటు వెళ్తూ ఉంటాం. అక్కడొక నెట్ సెంటర్ కూడా ఉండడంతో ప్రింటింగ్ పనుల కోసం ఆ రోడ్ లో చాలా సార్లు వెళ్తూ ఉంటాను.యీ రోజు కూడా అదే పని  మీద బయలు దేరే సరికి యీ సీను కనబడింది.జనాల మద్య ఉండే ఖాళీలలో నుండి చూసాను. ఒక పెద్దావిడ ...ఒక 35 సంవత్సరాల యువకుడిని పట్టుకుని ఝాడించేస్తోంది. కారణమేమిటని అక్కడే ఉన్న తెలిసిన ముఖాన్ని అడిగాను.

"ఇక్కడొక వీధి కుళాయి ఉంది కదా సార్...యీ మూడు వీధుల నుండీ ఆడాళ్ళంతా యీ కుళాయి దగ్గరకే రావాలి. కార్పొరేషన్ వాళ్ళు యీ మూడు వీధులలో ఆ చివర ఉండే వాళ్ళకు అందు బాటులో ఉండేందుకు వేరే కుళాయి వేయదానికి ప్రపోజల్ పెట్టి దీనినుండే డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు.  కానీ యీ చివర ఉండే వాళ్ళనేదేమిటంతే ఇప్పటికే దీంట్లో పెద్దగా ప్రెజర్ లేదు....కాబట్టి మైన్ లైన్ నుండి డైరక్ట్ గా వేరే డిస్ట్రిబ్యూషన్ తీసుకోమనీ...."

"మరి ఆ పెద్దావిద అతగాడి మీద ఎందుకు విరుచుకు పడుతోంది?"

" ఆడు మాజీ కార్పొరేటర్ పైడితల్లి కొడుకు అప్పల్నాయుడు సారూ.....యీడి బాబు రైల్వే యార్డ్ లో దొంగ తనాలు చేసి చేసి ...బాగానే గడించాడు.ఎంత తాగినా కూడా బాగానే మిగిల్చాడు. అదృష్టం కలిసొచ్చి ఒక టెర్మ్ కార్పొరేటరై పొయ్యాడు. ఆఖరుకి మాత్రం లారీ కింద పడి కుక్క చావు చచ్చాడనుకోండి. యీడు అంటే యీ అప్పల్నాయుడు గాడు బాబు కంటే ఎదవ.నలుగురు చంచా గాళ్ళను వెంటేసుకొని పెద్ద లీడర్ లా ఫీలౌతాడు.మా యీదిలోనే యీ వినాయకుడి గుడి ఉంది...ఎప్పట్నుండో దీన్ని మైంటైన్  చేస్తున్న కమిటీ ఉంది....ఇంకా ఎంతో మంది చదువుకున్నోళ్ళు ..పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ గా ఉంటారు కాబట్టి బయట ఎప్పుడో గాని కనబడరు. దాంతో యీ యెదవే పెద్ద లీడర్ననుకుంటాడు."

చిన్న విషయం అదిగినందుకు ఎంత కధ చెప్పడ్రా బాబూ అనుకున్నాను. కానీ ఆ పెద్దావిడ మా రైల్వే కి సంబందించినదవటంతో కాస్సేపు ఆవిడ మాట్లాడేది విందామనుకున్నాను.

" ఒరేయ్....మా తగువులు మేము తీర్చుకోగలం....సగం రోజులు జైల్లో గడిపే నీలాంటి దగుల్బాజీ యెదవల పెద్దరికం మాకక్కర లేదు. అవసరమైతే ఇక్కడ ..అక్కడ కూడా నీళ్ళు వచ్చే విధంగా చేయగలిగిన ఇంజనీర్ బాబులు ఉంటారు. వాళ్ళని బ్రతిమాలుకుంటే పనవుద్ది గాని ఇందులో నీవు చేసేదేముందిరా....దీంట్లో తల దూర్చేసి పెద్ద లీడర్ వైపోదామనుకుంటున్నావేమో......అసలు నీ మీదున్న కేసులన్నిటికీ శిక్ష  పడితే నీవు ఇంకో జనమెత్తినా ఆ శిక్ష  పూర్తవదు. 

ఆయన ఇక్కడ రైల్వే  యూనియన్ సెక్రటరీ కింద ఉన్నప్పుడు  చాలా సార్లు అనే వారు...నీ బాబు లాంటి దొంగ నాయాళ్ళు లేక పోతే రైలు పట్టాలు బంగారపువి వేయొచ్చని. ఆయన నిజాయితీగా ఉద్యోగం చేసి....ఆ మాయదారి జబ్బుతో పొయ్యారు గానీ లేక పోతే నీ బతుకంతా ఇంకా బాగా బయటపెట్టేద్దుం. నా కొడుకులిద్దరూ కష్టపడి చదువుకొని నాన్న లాగే దూరంగా ఐనా నిజాయితీ గా బ్రతుకుతున్నారు. మా ఖర్మ కాలి నీలాంటి పనీ పాటా లేని పోరంబోకు ఎదవలు లీడర్ల లా వెలిగిపోతున్నారు.........అవునొరే మొన్నేదో పార్క్ స్థలాన్ని  కబ్జా చేయబోతే నిన్ను తీసుకెళ్ళి పోలీసులు స్టేషన్ లో పెడితే మన మెయిన్  రోడ్ వెడల్పు చేయాలని  పోలీస్ స్టేషన్ లొ నిరాహార దీక్ష చేసావంట...జనం ముఖమ్మీద ఉమ్మేస్తారని సిగ్గన్నా లేదురా....పైగా బెయిలిప్పిస్తే రాబోయే ఎలక్షన్ లో మీ వెనుకే ఉంటానని మన ఎమ్మెల్యే కి కూడా కబురు పంపావంట...ఒరెయ్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మన ఏరియా లో దొంగలెక్కువైపోతే నీలాంటెదవ  గెలుస్తాడు..నా నమ్మకం ఏటంటే ఇంకా నా లాంటి వాళ్ళు ..పైనున్న మా ఆయన లాంటి వాళ్ళే యెక్కువున్నారని "

ఆ ఝురి ఇంకా సాగుతూనే ఉంది. ఒక నిజాయితీ పరుడి జీవితాన్ని పంచుకొన్న ఆ పెద్దావిడ  నేరస్థులే  నాయకత్వ స్థానాలలోకి  ప్రాకటం జీర్ణించుకో  లేక తన ఆక్రోశాన్ని అలా వెలిబుస్తూనే ఉంది. నేను మాత్రం మాయాబజార్ లో ఘటోత్కచుడిలా

"ఆహా...ఎంత శ్రవణానందకరముగా...ఉన్నాయి" అనుకుంటూ ఒక రకమైన తాదాత్మ్యం లోకి వెళ్ళి పొయ్యాను.  అంతే కాదు రాష్ట్రమంతా వినబడేటంత సౌండ్ సిష్టం సంపాదించి మొత్తం అంతా కాక పోయినా  కనీసం సీమాంధ్ర ప్రజలకన్నా వినిపించాలనే కోరిక కలుగుతోంది.....ఎందుచేతో.....