5, మే 2012, శనివారం

నమ్మకం కలిగించు....జగమంతా వెలుగు నింపు..


టూ వీలర్ వెనక్కు తిప్పాను.ఎందుకో మా శ్రీమతికి చెప్పలేదు. రైతు బజార్ నుండి 200 మీటర్ల దూరం వచ్చి ఉంటాం.సంచుల నిండా కూరగాయలు కొనేసాం.ఐనా వెనక్కు ఎందుకు తిప్పానో మా శ్రీమతి కి అర్ధం కాలేదు.టూ వీలర్ పార్క్ చేసి తిన్నగా అంతకు ముందు కూరగాయలు కొన్న ఒక షాప్ దగ్గరికి నడిచి జేబు లో నుండి రెండు రూపాయల నాణెం తీసి అతనికి ఇచ్చాను.ఆ రైతు ముఖం లో ఆనందం.

" ఓస్ యీ మాత్రానికేనా....తరువాత వచ్చినప్పుడు ఇచ్చేసి ఉండే వాళ్ళం కదా.."
శ్రీమతి మెత్తగా విసుక్కుంది.


జరిగిన దాని గురించి పెద్దగా వివరించనవసరం లేదు సింపుల్ గా చెప్పాలంటే ఆ రైతు దగ్గర కూర గాయలు కొన్నప్పుడు 2 రూపాయల చిల్లర తక్కువ వచ్చింది.
" అన్నీ కొనుక్కున్న తరువాత యీయండి బాబూ" రైతుకు బేరం వదలడం ఇష్టం లేదు. అది జరిగిన తరువాత కూర గాయలైతే కొనేసాం కానీ ఆ 2 రూపాయలూ ఇవ్వడం మరిచి పొయ్యాం.


ఆలోచిస్తే యెవరికైనా సరే నిజంగానే తరువాత ఇవ్వొచ్చు అనే అనిపిస్తుంది. కానీ ఒక వేళ అది మనం మరిచిపోతే .......


అది ఆ రైతుకు పెద్ద నష్టం కాక పోవచ్చు కానీ అటువంటి సంఘటనలు రెండు మూడు జరిగితే ఆ రైతుకు మనుషుల మీద నమ్మకం పోతుంది.అతడు తోటి వారిని నమ్మడం మానేస్తాడు. అంటే తనుండే సమాజం మీద నమ్మకం పోతుంది. మనుషుల్లో ఎక్కువ మంది మోసగాళ్ళే అన్న నమ్మకం అతడిలో పెరిగి పోవచ్చు. చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎలాగూ మోసగాళ్ళే గనుక తను కూడా ఎంతో కొంత మోసం చేయడం లో తప్పేముంది అనే ఆలోచన కూడా అతడిలో కలగొచ్చు.అంతా మోసగాళ్ళే కాబట్టి ఎలక్షన్లలో తనకు ఎక్కువ ఎవరి వల్లనైతే లాభం కనబడితే వాళ్ళకే ఓటెయ్యొచ్చు. ఆ విధంగా కొంత మంది అయోగ్యులు కూడా ప్రభువులుగా మారే క్రమానికి ఇతడు కూడా తన వంతు  సాయం చేసిన వాడవ్వొచ్చు.
పైదంతా చదివిన వారికి ఇదంతా చాదస్తంగా అనిపించొచ్చు. నాకు కూడా అలాగే అనిపించేదేమో  యీ మద్య కాలంలో జరిగిన  కొన్ని పరిణామాలు...నిన్న ట్రైన్ లో నడిచిన సంబాషణ జరగక పోతే. 


సంఘటన దగ్గరికి వస్తే గనుల మాఫియా లో అరోపణలు ఎదుర్కొంటున్న పక్క రాష్ట్రానికి ఒక మాజీ మంత్రివర్యుల వారి శిష్య గణం లొ ప్రముఖుడు (యీయన కూడా ఒక మాజీ మంత్రి వర్యులే) ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో 50000 పై చిలుకు  ఓట్ల ఆధిక్యతతో తిరిగి ఎన్నికయ్యారు. దీనిని అంత తేలికగా ఎలా తీసుకొంటున్నారో నాకు అర్దం కాదు.  


నిన్న ట్రైన్ లో యెక్కి కూర్చున్న కొంత సేపటికి నా ఎదురుగా కూర్చున్న ఒక పెద్దాయన చదవడానికి తన దగ్గరున్న డైలీ న్యూస్ పేపర్ ఇవ్వ బోయాడు.
"వద్దులెండి..నేను ఇంట్లో ____ పేపర్ చదివేసాను" సున్నితంగా తిరస్కరించాను. పైగా నేను చదుతున్న పుస్తకం కూడా  అప్పటికి చేతిలోనే ఉంది.
"అయ్యో ..నీవు చదివిన పేపర్ లో చాలా విషయాలకు కౌంటర్ దీంట్లో ఉంటుంది బాబూ" ఆయన వదిలేలా కనిపించలేదు. పుస్తకం మూసేసాను. 


"నేను పేపర్ వార్తల కోసమే చదువుతాను..ప్రచారాల కోసం కౌంటర్ల కోసం చదవనండీ..."


నేను కూడా ఒకప్పుడు అలాగే చదివే వాడిని బాబూ....కానీ యీ మద్య పేపర్లు చదువుతుంటే ప్రపంచం మొత్తం మోసం తోనే నిండి ఉందనిపిస్తోంది ...అందుకే సరదాగా అన్నీ చదివేస్తున్నాను."


" మరి మీరు రేపు ఎలక్షన్ల లో ఓటు వేయాలంటే యేంచేస్తారు" నాకు కూడా ఆయనతో మాట్లాడడం సరదాగానే అనిపించింది.


" యేముంది బాబూ...నిలబడ్డ వాళ్ళలో యెవరు తక్కువ మోసగాడైతే వాడికి వేస్తాను" 


ఆయన మాటల్లో నిజాయితీ ఐతే ఉంది.కానీ మోసగాళ్ళు రాజకీయ వ్యవస్థ జనం ఊహల్లోకి కూడా రావడం లేదన్న వాస్తవం నాలో ఎందుకో భయొత్పాతాన్ని కలగజేస్తోంది. ఒక వేళ ఇదే మొత్తం సమాజం యొక్క రాజకీయ ..తాత్విక చింతనగా మారితే...ఆలోచించదానికే భయంగా అనిపించింది. నేను పెద్దగా యేమీ చేయలేక పోయినప్పటికీ నా చుట్టూ ఉన్న వాళ్ళలో తిరిగి తోటి  మనుషుల మీద నమ్మకం కుదురుకొనడానికి యేమి చేస్తే బాగుంటుందో అలోచుస్తూ నా స్టేషన్ లో దిగాను.