14, మే 2013, మంగళవారం

ప్రజలకోసం...ఒక్కసారి.....

శేఖర్  కమ్ముల దర్శకత్వం వహించిన "గోదావరి" సినిమా యీ మధ్య వచ్చిన ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.నూటికి నూరు శాతం యేకీభవించక పోవచ్చు కానీ ఆ సినిమాలో అతడు లేవనెత్తిన చాలా అంశాలు  ఆనందింప చేయడమే కాకుండా అలోచింప  జేస్తాయి. ఇంచు మించు ప్రతి ఫ్రేం కూడా చాలా జాగ్రత్తగా  చిత్రీకరించిందే. ఒక విధంగా దానిని యీ మద్య వచ్చిన ఒక దృశ్య కావ్యంగా చెప్పుకోవచ్చు.దాని మీద రివ్యూ రాయాలంటే చాలా పేజీలు పడుతుంది. ఆ సినిమా చూసిన వెంటనే ఐతే ఒక సందేహం నన్ను పట్టి పీడుస్తూ ఉండేది.ఏదో ఒకటి సమాజానికి చేసి చూపించే మంచి ఉద్దేశం ఉన్న హీరో ఆ దిశ  లో మొదటి మెట్టుగా యేదో ఒక రాజకీయ పార్టీ లో చేరదామనుకుంటాడు.ఇక్కడ కూడా దర్శకుడి యొక్క పరిణితి  మనకు కనబడుతుంది.హీరో ఒక రాజకీయ పార్టీ ని అప్రోచ్ అవుతాడు.అక్కడ తను ఇమడలేనని గ్రహించగానే  వేరొక రాజకీయ పార్టీని అప్రోచ్ అవుతాడు.గమనించవలసిన విషయమేమిటంటే రంగుల లోనో లేక పై పై న చిన్న తేడాలు తప్ప పెద్దగా తేడా లేని పార్టేలేనని    అవి రెండూ అని అన్యోపదేశంగా  దర్శకుడు బాగానే చెప్పాడనిపించింది.నిజంగా సిద్దాంతాలుండే పార్టీలైతే హీరో అంత సుళువుగా తన అభిప్రాయం మార్చుకోలేడు. అంతవరకూ చక్కగా దర్శకత్వం చేసిన దర్శకుడు అక్కడే చిన్న తప్పు చేశాడేమోనని సినిమా చూసిన కొత్తలో అనిపిస్తూ ఉండేది.సిద్దాంతాలు పెద్దగా లేని పార్టీల లో ఇమడలేక పోయిన హీరో కాస్తో కూస్తో సిద్దంతాలున్న పార్టీల గురించి ఎందుకు అలోచించ
లేకపోయాడన్నది అప్పట్లో నా మనసులో అర్ధం కాని ప్రశ్న గా ఉండేది.  శేఖర్  కమ్ములకు  మిగిలిన పార్టీల గురించి తెలియకుండా ఉంటుందంటే నమ్మలేము.ఎందుకంటే తను కాలేజ్ లొ చదివేనాటికి కూడా వామ పక్ష విద్యార్ధి సంస్థలు ఉండే ఉంటాయి.తెలిసి కూడా ఉపేక్ష్చించాడంటే వాటికి అంతగా ప్రాధాన్యత యీయవలసిన అవసరం లేదని అతడి భావనేమో అనిపిస్తుంది కూడా.కానీ కొన్ని విధాలుగా నా ప్రశ్నలకు నేనే జవాబులు కూడా వెదుక్కున్నాను. యెందుకంటే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పవలసిన అవసరం కానీ సమయం కానీ శేఖర్ కమ్ముల  గారికి ఉండకపోవచ్చు. ఒక వేళ హీరో ప్రత్యామ్నాయ పార్టీ గురించి మాత్రమే అలోచిస్తే కొన్ని యెర్ర పార్టీలను ఎందుకు అప్రోచ్ కాలేదో అర్ధం కాదు. అసలు ఎర్ర పార్టీలను రాజకీయ పార్టీలు గా ఆయన ఎందుకు గుర్తించ లేదు? అలా చేయడం యాదృచ్చికమా లేదా కావాలనే జరిగిందా? యీ ప్రశ్నలకు నాకున్న పరిమితమైన జ్ఞానంతోనే సమాధానాలు వెదుక్కోవదం ప్రారంబించాను.

తాడికొండ ఆశ్రమ పాఠశాలలో  ( 1975-76) ఉన్నప్పుడు జరిగిన  సమావేశాలలో వక్తలు యెమర్జన్సీ పెట్టినప్పటినుండీ వచ్చిన మార్పులను తెగ పొగుడుతుంటే వినేవాళ్ళం కానీ యేమీ అర్ధం అయ్యేవి కావు.ఆ తరువాత కాలేజ్ కి వచ్చిన తరువాత జనతా పార్టీ అధికారం లోకి రావడం ...వూరిలో పెద్దవాళ్ళ మధ్య జరుగుతున్న చర్చలు ...పేపర్ లో పడిన వార్తలు చూసిన తరువాత నాకు కొంత రాజకీయ పరిజ్ణానం అబ్బిందని అనుకుంటూ ఉండే వాడిని.జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన కొద్ది కాలానికే కాంగ్రెస్స్ రెండు ముక్కలు కావడం(అంతకు ముందొక సారి అయినట్లుగా కూడా ఆ తరువాతే తెలిసింది)..శ్రీమతి ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరిస్తే ఆమె "ఇందిరా కాంగ్రెస్" పేరు మీద కొత్త పార్టీ పెట్టుకోడం జరిగింది. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఆ సమయం లో జరిగిన రాజకీయ కుప్పి గంతులు నాకు చాలా ఆశ్చర్యాన్ని  కలుగ చేస్తూ ఉండేవి.కేంద్రంలో జనతా పార్టీ అధికారంలో ఉండగానే ఆంధ్ర,కర్ణాటక రాష్ట్రాల లో ఇందిరా కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. అనతి కాలంలోనే "జనతా" ప్రయోగం విఫలమై కేంద్రంలో కూడా ఇందిరా కాంగ్రెస్ అధికారానికి చాలా సుళువుగా రాగలిగింది. నాకు జనతా పార్టీ పుట్టుక ..పతనానికి గల కారణాలు అప్పటికే బాగానే అర్ధం అయ్యాయి. ఎందుకంటే దానికేమీ ప్రత్యేక పరిశోధన  యేమీ అవసరం లేదు. అప్పుడప్పుదు న్యూస్ పేపర్ చదివితే చాలు.ఎవరైతే శ్రీమతి గాంధీని పార్టీ నుండి గెంటి  వేసారో  ఆ నాయకులంతా కూడా "అన్యధా శరణం నాస్తి...త్వమేవ శరణం మమ" అంటూ ఆవిడ పాదాల దగ్గర వాలి పోయారు.ఇంత పతనాన్ని చూస్తూ..... దీనికి ప్రత్యామ్నాయం ఉండదా....అని ఆలోచిస్తున్నప్పుడే గోడ మీద రాసిన "జాబ్  ఐనా చూపండి లేదా జైల్ లో ఐనా పెట్టండి " అనే స్లోగన్ మీద జరుప బోయే వూరేగింపుకు అందరినీ వచ్చి విజయవంతం చేయమన్న ఆహ్వానం.నేను ..కొద్ది పాటి స్నేహితులు దాంట్లో పాల్గొన్న తరువాత మొట్ట మొదటి సారిగా ఒక కమ్యూనిస్ట్  పార్టీ కార్యాలయం లోకి అడుగు పెట్టాం.అది తణుకు లోని సీ.పీ.ఐ. కార్యాలయం.ఆ తరువాత అక్కడికి వెళ్ళి చర్చల్లో పాల్గోడం మా దిన చర్య అయి పోయింది.అప్పటికే ముల్క్ రాజ్ ఆనంద్ రాసిన కూలీ  వగైరాలు చదివిన  నన్ను మూల సిద్దాంతాలు బాగానే ఆకర్షించాయి.యీ లోపులో మా వూరిలో నా గురుతుల్యులైన ఆచారి మాష్టారు ఉపాధ్యాయ సంఘాల(యూ.టీ.ఎఫ్) ద్వారా సీ.పీ.ఎం పార్టీ వైపు అడుగేసి సెలవులకి వచ్చిన మమ్మలని ప్రభావితం చేసేవారు.ఆయన ఆహ్వానం మీద మా వూరికి వచ్చి మాతోమాట్లాడిన వారిలో కృష్ణయ్య  ఒకరు.చెప్పేదంతా బాగానే ఉండెది గాని అంతకు కొద్ది కాలం ముందే జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లొ ఒక కమ్యూనిస్ట్ పార్టీ లోక్ దళ్ కు ఒక కమ్యూనిస్ట్  పార్టీ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేసాయో అర్ధం అవలేదు దానికి అప్పటి రెండు పార్టీల నాయకుల దగ్గర నుండీ తృప్తికరమైన సమాధానం రాలేదు. ఎందుకంటే భావ సారూప్యత గల పార్టీలు అంటే ముందు రెండు కమ్యూనిస్ట్ పార్టీలు అవుతాయి కానీ జనతా ..లోక్ దల్ లు కావు.ఇవి రెండూ ఒక అంగీకారానికి వచ్చిన తరువాతే మిగిలిన యే పార్టీ తో ఐనా పెట్టుకొవాలి కదా అనేది నా సందేహం.నా సందేహానికి కేవలం వేద భాష లోనే(సామాన్యులకు అర్ధం కాని భాష) సమాధానం దొరికేది.తరువాతి కాలంలో నా కర్ధమయ్యిందేమిటంటే కనీస విలువలు లేని యీ "చెత్త"వెంట  వెళ్ళిన   తోకలను కూడా చెత్త కంటే హీనంగా ప్రజలు తిరస్కరించారు.అలా పోటీ చేసిన ప్రతి సారీ కూడా పైకి ఐక్యతా మంత్రం వల్లించినా కూడా ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకోడం ఒక అలవాటుగా మారిపోయింది. మొదట్లో మాకు నేర్పిన పాఠాల సారాంశం ఎలా ఉండేదంటే " యీ భారత దేశం  అంతా టాటా...బిర్లాల వంటి బూర్జువాల చేతుల్లో ఉందనీ....వాళ్ళకు   అనుకూలంగానే ప్రభుత్వాలన్నీ వ్యవహరిస్తాయనీ సిద్దాంత రీత్యా రుజువులతో సహా చూపించే వారు.అది నిజమో కాదో వేరొక చర్చ అవుతుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు కూపస్త  మండూకంలా ఉండి పోయిన హిందూ సమాజంలో ప్రజలకు ఉన్న ప్రధాన శత్రువులు టాటాలు ...బిర్లాలు మాత్రమే అన్నట్లుగా  ఉండేది. నెహ్రూ  ఉన్నంత కాలం కాంగ్రెస్ కు యెదో ఒక సిద్దంత బలం ఉండేది.ఆ తరువాత సిద్దాంతాలనేవి కనుమరుగవుతున్న దశ లో ఒక బలమైన సిద్దంతం
కల పార్టీ బలమైన ప్రత్యామ్నాయంగా తయారవ్వ వలసిన సమయంలో రెండు ముక్కలయ్యి ఆ తరువాత అనంతంగా ముక్కలొవ్వుతూనే ఉంది.నాయకత్వ స్థానంలో కూర్చుని యెన్నైనా సిద్దాంతాలు చెప్పవచ్చు...కానీ సామాన్యుడి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళంతా ఒకళ్ళ నొకళ్ళు ఎందుకు
తిట్టుకుంటున్నారో...చంపుకుంటున్నారో అర్ధం కాని స్థితి.ఇప్పుడైతే గోడల మీద రాసే వాళ్ళు కూడా వాళ్ళకు కరువైపొయ్యారు కానీ 20 సంవత్సరాల క్రితం గోడల నిండా రాతలే.ఇప్పుడు ఆటోల వెనకాల ..కార్ల వెనకాల బైబిల్ సూక్తులెలా కనబడుతున్నాయో ఆ రోజుల్లో అన్ని స్లోగన్స్...మరిన్ని విద్యార్థి సంఘాల పేర్ల తో ఉండేవి.వీటన్నిటి మధ్య ఉండే తేడాలేమిటో యెవరైనా వివరించగలరా అనిపించేది.కొండంత శత్రువు ని యెదిరించడానికి మనకున్న బలం వేలెడంత.మరలా దానిని పది ముక్కలు చేస్తే లాభం ఎవరికుంటుందోనన్న చిన్న అలోచన నా లాంటి సామాన్యుడికుంటుంది గాని నాయకత్వ స్థానాల్లో ఉన్న మేధావులకి ఉండదేమో.
మొన్ననే మనందరినీ వీడిన చావెజ్ పార్టీ పేరు లో ఎక్కడా "కమ్యూనిస్ట్" అని ఉండదు.కానీ కాస్ట్రో చివరి వరకూ అతడిని అక్కున చేర్చుకునే ఉన్నాడు.ఇద్దరూ కలసి ళాటిన్ అమెరికా లో విపరీతమైన ప్రభావం చూపగలిగారన్నది నిర్వివాదాంశం.
నేను చదివిన అత్యుత్తమ సమీక్షలలో "రాగో"నవల మీద బాలగోపాల్ రాసింది ఒకటి.సోషలిజం అనేది కొన్ని పోరాటాలు చేసేసి అపేస్తే వచ్చేది  కాదని ఆయన అన్ని రుజువులతో చూపించాడు.అది కేవలం రాజకీయాధి కారం వలన వచ్చేది కాదు.అదొక జీవిత విధానం.రేసు లోకి లాగి ప్రజలను నిరంతరం పరుగులు పెట్టేలా చేస్తున్న పెట్టుబడిదారీ విధానానికి అదొక ప్రత్యామ్నయం. ఆది ఇప్పటి పరిస్థితులకి పనికి వస్తుందో రాదో అనేది ఇక్కడ చర్చనీయాంశం  కాదు.బ్రతకాలంటే  ఖచ్చితంగా రేసు లో ఉండాల్సిందే అని మాత్రమే నమ్ముతున్న నేటి యువతకు పదిమందీ కలసి పదిమంది కోసం అన్న సిద్దాంతం ఒకటి ఉందన్న సంగతి కూడా తెలియనంత దూరంగా వీళ్ళు జరిగిపొయ్యారు.  ఈ  ఘనత నిస్సంశయంగా    భారత దేశపు కమ్యూనిస్ట్ పార్టీలదే. మిగిలిన సిద్దంతాలు లేని పార్టీలతో రాజకీయాధికారాన్ని పంచుకోడానికి సిద్దపడిన కమ్యూనిస్ట్ పార్టీలు వాటిలో వేటితోనూ కలసి బలమైన సామాజిక  ఉద్యమాలు నిర్మించిన దాఖలాలు లేవు.భూస్వాముల భూములు లాక్కొని పేదలకు పంచవలసిన ప్రభుత్వం దానికి పూర్తి వ్యతిరేకంగా పేదల భూములను పెట్టుబడిదారులకి పంచిపెడుతుంటే కమ్యూనిస్ట్ లు చేసిన ఉద్యమాలు ఎన్ని? ప్రభుత్వం ఎలెక్ట్రిసిటీ చార్జ్ లు పెంచింది. నిజమే దాని ముందు జరిగిన విషయాలేమిటి? ఆర్ధిక నేరగాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు చేసిన పోరాటాలేమిటి?  తన కుటుంబాన్ని పోషించుకోడానికి అడవికి వచ్చి డ్యూటీ చేసుకుంటున్న కానిస్టేబుల్ చేసిన ద్రోహం ఎక్కువో ..లేక పేద రైతుల భూములు పెట్టుబడి దారులకు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించి వేల కోట్లు దిగ మింగిన వాళ్ళు చేసిన ద్రోహం ఎక్కువో అడవిలో అన్నలకు తెలియదా...కానిస్టేబుల్ అడవిలో దొరుకుతాడు కాబట్టి వర్గ శత్రువు.  మేము చదువుకున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తే. అప్పటికి మా కాలేజ్ లో స్టూడెంట్స్ ఫెడరేషన్ బలంగా ఉండేది. ఒక మంచి మా స్నేహితుల గ్రూప్ దానిని నడిపిస్తూ ఉండేది.  ఒక రోజు బయట నుండి ఒక యువకుడు మా కోసం వచ్చాడు.
"బ్రదర్...మిమ్మలని ఒక రిక్వెస్ట్ చేయడం కోసం వచ్చాను..."నసిగాడు.
"చెప్పండి ఫరవాలేదు" అభయం ఇచ్చేసాను
"మీ హాస్టల్ కుర్రాడొకడు మా సిస్టర్ ను రోజూ టీజ్  చేస్తున్నాడు..మొన్నొక రోజు సినిమా హాల్ లో వోణీ  కూడా పట్టుకుని లాగాడు"
" అలాగా...మరేం చేద్దాం"నవ్వుతూ అడిగాను.
"మీరు కొంచెం హెల్ప్ చేయాలి"
"అంటే మా వాడిని మేమే కొట్టాలా..."
" మాకేమి చేయాలో తెలియడం లేదు...మీ కాలేజ్ అంతా బాగా కలసి ఉంటారని టౌన్ లో అందరూ అంటుంటారు"
"చూడండి...మేము మా వాడిని ఏమీ చెయ్యం కానీ....తప్పు చేస్తున్నాడు  కాబట్టి వాడిమీద మీరేమన్నా యాక్షన్ తీసుకుంటే మేమేమీ వాడి తరుపున ఇన్వాల్వ్ కాము."
ఆ యువకుడు ఆ హింట్ చాలన్నట్లుగా ఆనందంగా వెళ్ళిపొయ్యాడు.కొద్ది రోజులకు చిరిగిన చొక్కాతో ,రక్తం వోడుస్తూ హాస్టల్ లోకి వస్తున్న మా హాస్టల్ మేట్ ని మేము చూసాం.టౌన్ లో నుండి వచ్చిన యువకుడు మాత్రం మా అభిమానిగా ఉండి మా మీటింగ్ లకి క్రమం తప్పకుండా వచ్చే వాడు.అప్పటి మా పరిణితి తక్కువే కానీ సిద్దాంతాల రచ్చ కంటే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే చూసే వాళ్ళం.ఉద్యమాలు ఉన్న చోట కులాలు ఉండవు. మతాలు ఉండవు.కేవలం వోట్ల సంపాదనే పరమావధి గా ఉండే పార్టీలకు సిద్దాంతాలున్నా వాటిని అమలులో పెట్టదానికి యీ వోట్ల సంపాదనే ప్రధాన అవరోధంగా ఉంటుంది.ఉదాహరణకు అన్ని పార్టీల మేనిఫిస్టోలు చూదంది. ఖచ్చితంగా అన్నిటిలోనూ "సెక్యులరిజం" పాటిస్తామని ఉంటుంది.దానర్ధం పూర్తి మత స్వేచ్చ ఉంటుందని.ఆచరణలో యేమి జరుగుతుందో అందరూ చూస్తున్నారు.నీ చేతిలో ఒక 20 వోట్లు వుంటే చాలు...నీ స్వేచ్చకు యెవడూ అడ్డం రాడు. నీవు రోడ్ తవ్వేసి పందిళ్ళు వేయొచ్చు...రోడ్ బ్లాక్ చేసి నీ ఫొటోలు  ఉన్న ఫ్లెక్షీలు నాలుగు తగిలించి నీవే నాయకుడవై పోవచ్చు.అంతే కాదు నీ చొరవను బట్టి నీకు కార్పొరేటర్ దగ్గరనుండి ఆ పై వరకూ యే పదవైనా దక్కే అవకాశం వస్తుంది. ఇదంతా యెలా జరుగుతుందని యెవడూ ఆశ్చర్య  పోవడం లేదు.ఇదంతా చాలా సహజమేనన్న రీతి లో వెల్లి పోతున్నారు.అంటే చట్టం మీద నమ్మకం గౌరవం ఉన్న వాడి మీద చట్టం మీద ఏ మాత్రం గౌరవం లేని వాడు పెత్తనం చేస్తున్నాడు. సిద్దాంత రాజకీయాలు లేని చోట వచ్చే  పరిణామం ఇదే.దీనికి కారణం ఒక ప్రత్యామ్నాయ సిద్దాంతం ..విధానాలు కల పార్టీ ఒక్కటీ లేక పోవడం కాదా.విశాఖపట్నం లో ఒక చిన్న నామినేటెడ్ పదవి పొందిన ఒక నాయకుడి వూరేగింపు వలన ట్రాఫిక్ జాం అయి ఎంత మంది విద్యార్థులు ఎగ్జాం   హాల్ కు వెళ్ళ లేకపొయ్యారో అన్ని పేపర్లూ రాసాయి. సోషలిజం అనేది ఒక సుదూర స్వప్నం కానీ ఇప్పటి మన బ్రతుకులు కాస్త స్థిమితంగా బ్రతడానికి అవసరమైన ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా కరువైపోయారు.రాజకీయ పార్టీల జిమ్మిక్కులు ప్రజలకు అర్ధం కాక కాదు....ప్రత్యామ్నాయం లేక మాత్రమే వోపిక పడుతున్నారు. మా పక్కనున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యుల పార్టీ యేమిటో ఎవరూ స్పష్టంగా చెప్ప లేరు.ఢిల్లీలో  ఒక ప్రుభుత్వ అధికార అతిధి గృహంలో ఒక దళిత అధికారిపై మన శాసన సభ్యుడు చేయి చేసుకుంటాడు. కానీ కేసు ఉండదు.దళిత సంఘాల ఉద్యమాలు ఉండవు. పైపై ముసుగులు వేరు కానీ లో లోపల వీళ్ళంతా ఒకటే. ఒక బలమైన ప్రత్యామ్నాయ సిద్దాంతం కలిగిన పార్టీ ఎదురైనప్పుడు వీళ్ళంతా యేకమైపోతారనడానికి చరిత్ర లో ఎన్నో దాఖలాలు ఉన్నాయ్.

ఇక్కద ప్రధానమైన విషయం ఇంకొకటేమిటంటే యీ మధ్య కాలంలో కావాలనే అధికార వర్గాలు ..తమకున్న విశ్వాస  పాత్రమైన మీడియా ..ప్రజలకు మిగిలిన ఒకే ఒక్క కళా రూపమైన సినిమా రంగం మొత్తం కలసి చాలా తెలివిగా జనాన్ని మోసగిస్తూనే ఉన్నారు.ఒక ప్రత్యామ్నాయ  జీవిత విధానాన్ని సూచించే వాటినన్నిటినీ తెలివిగా ఉపేక్షిస్తారు.అసలు అటువంటిదేదీ లేదన్నట్లుగానే ఉంటారు. రోజూ టీవీ చూస్తున్న వారికి రాష్ట్రంలో కేవలం నాలుగు రాజకీయ పార్టీలు మాత్రమే ఉన్నట్లుగా అనిపిస్తుంది.అనేకానేక నేరాల మీద జైల్ లో మగ్గుతున్న వారు స్థాపించిన పార్టీల  నుండి కూడా ప్రాతినిధ్యం  ఉంటుంది కానీ ఎన్నో ఉద్యమాలు నిర్మించి ఎన్నెన్నో త్యాగాలు చేసిన పార్టీల నుండి యే ప్రాధాన్యం ఉందదు. "దూకుడు సినిమాకు అవార్డుల పంటలు పండుతాయి.....పిల్ల జమీందార్...వోనమాలు లాంటి సినిమాలు చర్చకు కూడా నోచుకోవు. అంతే కాదు "గమ్యం "లాంటి సినిమా తీసి మానవత్వం...సేవా దృక్ఫధమే ప్రేమకు పరమావధి అంటూ ప్రేమకు ప్రత్యమ్నాయ నిర్వచనాన్ని ఇచ్చిన దర్శకుడు క్రిష్ ను కూడా చచ్చినట్లు తన దారి మార్చుకుని వ్యాపార సినిమాలు తీయవలసిన ఆగత్యం కల్పించింది యీ వ్యాపార ప్రపంచం.
"అయ్య...క్రిష్ గారూ...మీకొక మనవి...దయుంచి మీరు మనుషుల తరుపునే ఉండండి.."
నేను అంతిమంగా కూడా మరొక్క సారి చేసే విన్నపం ఇదే. టాటా ..భిర్లాల దోపిడీ గురించి నాకు తెలియదు కానీ ......సిద్దంతాల చర్చలతో ముక్కలు ముక్కలైన కమ్యూనిస్ట్ పార్టీల వలన సమాజానికి   జరిగిన నష్టమే ఎక్కువని నా అభిప్రాయం.  సిద్దాంతాల వాదోపవాదాల కంటే ముందు అసలు యే సిద్దాంతమూ లేని వాళ్ళ పని పడదాం.ఏ సిద్దంతమూ లేకుండా.....ఉద్యమాల నేపద్యాలు లేకుండా ...అడ్డదారిలో సంపదించిన డబ్బుతో నాలుగు ఫ్లెక్సీలు తగిలించుకుని నాయకులుగా చెలమణి అవుదామనుకుంటున్న హీనుల చేతుల్లో మన జీవితాలను...మన వారసుల జీవితాలను పెట్టొద్దు. నేరగాళ్ళు అని తెలిసి కూడా వాళ్ళిచ్చే  ఎంగుల మెతుకుల కోసం వెంపర్లాడుతూ రెండు మూడు కులాల లేదా మతాల వోట్ల లెక్కలతో ఏదోలా అధికారంలోకి వచ్చేటందుకు సిద్దపడుతున్న శునకాలను తిప్పి తిప్పి కొడదాం.కనీసం   చచ్చేటంత  వరకూ బ్రతకనిచ్చే యేర్పాట్లు చేసుకుందాం.లేదంతే రోజూ చావాలి."ఏదో ఒక తప్పు చేయకుండా యీ సమాజంలో బ్రతకలేము కాబట్టి తప్పు చేసిన వాడిని శిక్షించడం  ఎందుకులే" అన్న సూత్రీకరణ సమాజాన్ని మింగేయకుండా కాపాడండి.కాస్తో కూస్తో సిద్దాంతాలున్న వాళ్ళు...నిజాయితీ పరులు కలిసి ముందుకు వస్తే వారి వెంట నడవడానికి జనం సిద్దంగా ఉన్నారు. ఎందుకంటే భారత  ప్రజలు యే పార్టీని  నమ్మని స్థితిలో ఇప్పుడున్నట్లుగా ఎప్పుడూ లేరు.అప్పుడు నిజాయితీ పరులే లేరన్నుట్లుగా ప్రజలని వంచిస్తున్న మీడియాను తుంగలో తొక్కేద్దాం.