28, ఆగస్టు 2012, మంగళవారం

అరచెయ్యి కాలక ముందే.....

“యీ అమ్మాయే సార్…కొత్తగా జాయిన్ అయ్యింది..మీరే ట్రైనింగ్ ఇవ్వాలి”
సైట్ కు వెళ్ళగానే మా కాంట్రాక్టర్స్ కొత్తగా వచ్చిన ఆ అమ్మాయిని పరిచయం చేసారు. కొత్త గాబట్టి కొంచెం బెదురుగానే చూస్తోంది.
“ పేరేంటమ్మా..?”
“శాంతి  ..సార్”
“డిప్లొమా ఎప్పుడు పూర్తి చేసావు?”
“ఈ యేడే సార్”
రెండు రోజులకు బాగానే అలవాటయ్యింది. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటీ అడిగి తెలుసుకోడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయికి సంబందించిన కొన్ని విషయాలు కూడా తెలిసి కొంత ఆశ్చర్యం వేసింది.
ఆ అమ్మాయి ఆ ప్రాంతానికి  సంబందించినదే. మేము  ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే సరికి అక్కడొక  రైల్వే గేట్  ఉండేది. యార్డ్ కు దగ్గరలో ఉండడం వలనో లేక అక్కడ రైల్వే లైన్ లో వాలు ఎక్కువగా ఉండడం వలనో తెలియదు కానీ అక్కడొక సారి గేట్ పడిందంటే కనీసం 20 నిముషాల వరకు గేట్ తెరిచే వారు కాదు. కాబట్టి ప్రతి బస్ కూడా గేట్ పడగానే ఆ టైం కనీసం ఉండడానికి మానసికంగా తయారైపొయ్యే వారు. ఆ విధంగా అక్కడొక చిన్న మార్కెట్ ప్లేస్ తయారయ్యింది. అక్కడ ముఖ్యంగా ఆ ప్రాంతంలో తయారయ్యే మామిడి తాండ్ర అమ్మడం నేను చూస్తుండే వాడిని. ఆ గేట్ కు అటూ ఇటూ చాలా షాప్స్ ఉండేవి. మా ప్రాజెక్ట్  పూర్తి కాకుండానే అక్కడ ఫ్లై ఓవర్  నిర్మించడం జరిగింది. ఆ తరువాత నెమ్మదిగా ఒక్కక్కటిగా అక్కడున్న షాప్స్ అన్నీ ఖాళీ అయిపొయ్యాయి. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఆ అమ్మాయి కుటుంబానిదే అక్కడున్న వాటిలో మొదటి షాప్ అని ఆ అమ్మాయి ద్వారా తెలిసింది. అంతే కాదు  ఇంజనీరింగ్ లో  జాయిన్ అవ్వ వలసిన ఆ అమ్మాయి కూడా చదువు ఆపి యీ ఉద్యోగం లో చేరిపోయింది. నిర్వాసితులవ్వడం అంటే ఏమిటో దగ్గర నుండి చూసాను. డైరెక్ట్ గా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నిర్వాసితులయ్యే వాళ్ళకు ప్రభుత్వం నుండి  ఎంతో కొంత పరిహారం వస్తుంది  కానీ ఈ విధంగా నిర్వాసితు లయ్యే వాళ్ళకు యేముంటుంది?
నా ఉద్యోగం లోని జీత భత్యాల ను పక్కన బెడితే మిగిలిన చాలా విషయాలలో అదృష్ట వంతుడి గానే భావించుకుంటాను.  సమాజం లోని అన్ని పొరలలోని జీవితాలను….దగ్గర నుండి చూసే అదృష్టం కలగ చేసింది . దుర్భర దారిద్ర్యం ప్రజలని ఎంత బలహీనులను చేస్తుందో….ఆ బలహీనతల ను నాయకులు యెలా కాష్ చేకుంటారో నేను చదివిన వార్తల వలన కాకుండా  నేను చూసిన జీవితాల వలన కూడా తెలుసు కోగలిగాను.
ప్రొద్దుటి నుండీ రాత్రి వరకూ కోళ్ళ ఫారలలో కుక్కినట్టు ఏ.సీ.రూం లలో కుక్కి చెప్పే చదువులు చదివేసి ……. మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లలో సీట్స్ తెచ్చేసుకొని  ఆ తరువాత రక రకాల పరీక్షల ద్వారా పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కాలేజ్ లలో చదివేసి కార్పొరేట్ లీడర్లై పోతున్న వారికి…..సెలవుల్లో కూడా అమ్మ కో నాన్నకో ..ఆసరాగా ఉండడం కోసం ట్రైన్ లోనో …వేరొక చొటో మామిడి కాయలు అమ్ముతూనో లేక యెదో పని దొరికితే చాలు అనుకుంటూ పని లోకి వచ్చే వారినీ ఏక సమయంలో చూడగలిగాను.

ఒక సంఘటన ఇప్పటికీ మరీచి పోలేను. ఒక రోజు రీన్ ఫోర్స్మ్రెంట్ చెక్ చేయడం కోసం ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడి కాంక్రీట్ వర్క్ చూస్తున్నాను. అనుకోకుండా   ఇసుక మోస్తున్న కుర్రవాడిని చూసాను. గిల్లితే పాలు కారడం అంటే ఆ కుర్రాడిని చూస్తే తెలుస్తుంది.
“ యేరా బాబూ…స్కూల్ లేదా…” మామూలుగానే అడిగాను.
“ సెలవులు సార్”
సెలవుల గురించి కలలు గనే స్తోమత ఆ కుర్రాడికి లేదని అర్ధమయ్యింది. ఆ తరువాత కొద్ది రోజుల పాటు ఆ కుర్రాడిని రోజూ ఆ బ్రిడ్జ్  దగ్గర పని చేయడం చూసాను. ఛూసి చిన్నగా నవ్వ గానే సిగ్గుపడుతూ ఉండే వాడు.

 ఆ రోజు కూడా రోజూ లాగే ట్రైన్ దిగి స్టేషన్ బయటకు వచ్చాను. జీప్ రెడీ గానే ఉంది. ఎక్కే ముందు చూసాను….వెనుక సీట్లో ఆ కుర్రాడు ఉన్నాడు.
“యీ కుర్రాడు… వేరే బ్రిడ్జ్ దగ్గర పని చేస్తున్నాడు కదా..ఇటెందుకు తీసుకొచ్చావ్?”
డ్రైవర్ ను అడిగాను.
“ వాడిని హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి సార్”
“ యేమయ్యింది”
“…..చైన్ లో వాడి వేళ్ళు ఉండిపోయాయి సార్”
అప్పుడు చూసాను వేళ్ళ వైపు. ఇంత లావు గుడ్డలు చుట్టి ఉన్నాయి.
“యెంత సేపయ్యింది?” గట్టిగా అరిచాను
“ అరగంట దాకా అయ్యుంటుంది సార్”
“ ముందు హాస్పిటల్ కు చావొచ్చు కదా…”ఉక్రోషం వచ్చేస్తోంది.
“మీరు చూస్తే కాని  కాంక్రీట్ స్టార్ట్ అవదు కదా అని ముందు మిమ్మల్ని తీసుకు రమ్మన్నారండి”
ఆ కుర్రాడి ముఖంలొకి చూడడానికి భయం లాంటిది వేసింది. అరగంటనుండీ ఆ బాధను దిగమింగుకుంటున్న అతడి ముఖాన్ని యెలా చూడాలో అర్ధం కాలేదు. అతడి దగ్గర నుండి యే శబ్దమూ రావడం లేదు . పైకి యేడవడానికి కూదా భయం.

యీ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆ నాటి మన ముఖ్య మంత్రి వర్యులు హెలికాప్టర్ దుర్ఘటన లో చని పోవడం …..చనిపోయినట్టు  కన్ ఫర్మ్ కాగానే ఒక గంట కూడా ఓపిక పట్ట లేని విధంగా యువ రాజా వారు సిమ్హాసనం అధిష్టించడానికి పడిన కంగారు….అది దక్కక పోయే సరికి యేదోలా తాపత్రయపడుతూ వెలువరిస్తున్న రాజకీయ తాపం…..అన్నీ పక్క పక్కనే చూసాను.నిజం చెప్పాలంటే ఆ తరువాతే నాకు కొన్ని విషయాల మీద ఆసక్తి పెరిగింది. నాకొచ్చిన సందేహాల గురించి చెప్పాలంటే ఒక రోజున నేను మా కేంప్ ఆఫీస్ దగ్గర మేస్తున్న కోళ్ళను చూస్తుండగా కలిగిన సందేహాన్నే ముందుగా చెప్పుకోవాలి. ఒక కోడి పుంజు ఒక చిన్న పుల్ల ముక్కను పట్టుకుని కిందకూ మీదకూ ఎగరేస్తూ మిగిలిన పెట్టలను ఆకర్షించడానికి  ప్రయత్నిస్తుంది.ఆ పుల్లముక్కను పెద్ద కీటకంగా చూపించడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది.నెమ్మదిగా దాని చుట్టూ నాలుగైదు కోడి పెట్టలు చేరాయి. ఇది  ఆ పుల్లముక్క మాట వదిలేసి వాటితో రొమన్స్ మొదలు పెట్టింది. ఇక్కడ నాకు కలిగిన సందేహమే చాలా ముఖ్యమైనది కూడా. అదేమిటంటే ఆ చుట్టూ చేరిన కోడి పెట్టలకు అది పుల్లేనని తెలిసే ఉంటుందని.తండ్రి చనిపోయిన వెంటనే ఆ పదవి కోసం శత విధాలా ప్రయత్నించి అది దక్క లేదన్న ఉక్రోషంతో సొంత కుంపటి పెట్టుకొని వూరూరా తిరుగుతూ నేను పైన చెప్పిన విధంగానే (కోడి పుంజు తరహాలో) ప్రజలను ఆకర్షించడానికి నానా పాట్లూ  పడుతున్న ఆ పుత్ర రత్నం సెలవిచ్చేదేమంటే తన తండ్రి గారి హయాంలో ప్రారంభించిన సంక్షేమ పధకాలు యీ ప్రభుత్వం  నిర్వీర్య పరుస్తోందని …కాబట్టి తన నెత్తి మీద కిరీటం పెట్టేస్తే అవన్నీ యధావిధిగా కొనసాగిస్తానని. ఆది పదే పదే విన్న తరువాత నాకనిపించింది అసలు యీ సంక్షేమ పధకాల అసలు రంగు యేమై ఉంటుందా అని.కొన్ని ఉదాహరణలు చూద్దాం. యీ మధ్యే పేపర్లో చూసేంత వరకూ యెవరికీ తట్టని విషయం యేమిటంటే పేదవారికీ వెనుకపడిన వర్గాల వారికీ ప్రభుత్వమే  ఫీజులు కట్టి  చాలావరకూ రాజకీయ నాయకులకు సంబందించిన  ఇంజనీరింగ్ కాలేజ్ లలో చదివించడం కంటే ప్రభుత్వమే  తన కాలేజ్ లు పెంచుకోడం మంచిదని  మన నాయకులకి తెలియదా….ఎవరి సంక్షేమం కోసం యీ ఫీజుల పధకం మొదలయ్యిందో బుర్రలో గుంజున్న వాడికల్లా అర్ధం అవుతుంది. ఇంత మంది ఇంజనీర్లకు  ఉద్యోగాలు ఉన్నాయా…లేనప్పుడు ప్రజల సొమ్ము ఎవరికి ఉపయోగ పడినట్లు…..పోనీ వీళ్ళకు విదేశాల్లో  ఉద్యోగం వచ్చే స్థాయిలో యీ ప్రైవేట్ కాలేజ్ లు విద్యా బోధన చేస్తాయా……మరి ఇలాంటి పధకాలు నిరుపయోగమని ప్రతి పక్షాలు ఎందుకు అనవు….కొన్ని కాలేజ్ లు వాళ్ళవి కూడా ఉంటాయి కాబట్టి. ఓక్క సారి ఏదైనా గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ కాలేజ్ లలో ఉచితంగా చదివిన విద్యార్ధులలో ఎంత మంది ఉద్యోగాల లో ఉన్నారో….కానీ వాళ్ళ ఫీజులు ప్రజల డబ్బులతో కట్ట బడ్డాయి.మార్కెట్ ఎకానమీ గురించి తెలియక పోయినా ….ఇది ఎవరి సంక్షేమం కోసం పెట్టారో సులభంగానే అర్ధమవుతుంది. కానీ  మనందరిదీ కోడిపెట్టల జాతి కదా……ఎవరి స్వార్ధం వారిదే…..కాని మనలోని స్వార్ధం వలన వచ్చిన  ఫలితాన్ని కొంత మందే అనుభవిస్తున్నారు..….దుష్ఫలితాన్ని  మాత్రం కోట్లాది మంది అనుభవిస్తూనే ఉన్నారు.
మనమంతాకోడిపెట్టలమే నని నాయకులు ఎలా భావిస్తారో ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దాం. సామాన్య ప్రజానీకానికి తెలియక పోవచ్చు కానీ ఛంద్ర బాబు లాంటి  నాయకుడికి  వాన్ పిక్   ఒప్పందం గురించి  తెలియకుండా  ఉంటుందంటే ఎవరైనా నమ్మగలరా..? ఒక వేళ తెలియదంటే ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగుతాడా..? మరి అన్నీ అయిన తరువాత ఇప్పుడు పాద యాత్ర చేయడంలో ఉన్న అర్ధం ఏమిటో ….
చానల్స్ లో అనేకానేక విషయాల గురించి గంటల కొద్దీ రాజకీయ పార్టీల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా  గమనిస్తే అవన్నీ ఎవరో మహారాజు గారి భార్యల మధ్య జరిగే ఆధి పత్య పోరు లా ఉంటుంది . 1999 నుండీ నేను వైజాగ్  లోనే ఉన్నాను.మేము వెళ్ళిన  కొత్తలో  వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకున్న ఒక కాంగ్రెస్ నాయకుడిని తీసుకుని మా దగ్గర బంధువు మా ఇంటికి వచ్చాడు,వైజాగ్  లోనే అప్పుడు ఉన్న ఒక కింగ్ మేకర్ గారి రికమండేషన్ కోసం. వచ్చినాయనను  ఎందుకో కాజువల్ గానే అడిగాను.
“ఇప్పుడు భారత దేశంలోనే ఉన్న నాయకులందరి లోకీ వరల్డ్ బేంక్ కు ఐకాన్ గా చంద్ర బాబు గారున్నారు……కాబట్టి  ఆయనకు అల్టర్నేటివ్ మీ పార్టీ  యేమి చెబుతుంది?..నిజంగా చెప్పాలంటే వామ పక్షాలే ప్రపంచీకరణను వ్యతిరేకిస్తున్నాయ్…..మరి మీరు వాళ్ళతో జతగట్టి…ఎలెక్షన్ ల లోకి వెళ్తారా….”
“ మీరడిగిన ప్రశ్నలకు సమాధానాలు మా నాయకులకు తెలియవండి బాబూ…..”
కానీ నిజం చెప్పాలంటే  పెద్ద నాయకులకు అప్పటికే కోడి పుంజు ..పెట్టల గేం ఆడడం అలవాటై పోయింది. వాళ్ళకు అన్నీ తెలుసు. 1982 లో విజయవాడ లో కృష్ణా  నదీ తీరాన జరిగిన సీ.పీ.యెం. పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి సభలు జరిగాయి. అప్పటికే ఆ నగర కార్పొరేషన్ కమ్యూనిస్ట్ పార్టీల చేతులలో ఉంది. ఖమ్మం  జిల్లాలో చాలా లోకల్ బాడీ లకు వామ పక్షాల అభ్యర్ధులు యెన్నికయ్యారు. కాంగ్రెస్ పరిపాలన….ముఖ్య మంత్రుల మార్పిడి తో జనం ఆ పార్టీ మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఇది సహజంగానే కొంతమందికి మింగుడు పడ లేదు. అందులో ముఖ్యులు ఆనాటికీ….యీనాటికీ కూడా అత్యధిక సర్క్యులేషన్ కలిగిన  “యీనాడు” పత్రికాధిపతి…శ్రీ రామోజీ రావు.

..అధికార వర్గం అనేది ఒక ప్రత్యేక వర్గం అనీ….దాంట్లో వ్యాపార, పారిశ్రామిక,భూస్వామ్య వర్గాలకు చెందిన వారు మాత్రమే తిష్ఠ వేసుకుని ఉంటారనీ….ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీరి  ప్రయోజనాలు  మాత్రం చెక్కు చెదరవనీ… సామాన్య ప్రజలు గ్రహించడానికి టైం పడుతుంది. కొత్తగా పుట్టుకొచ్చి కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు అధికార బలంతో సాధించడం  లాంటివి జరిగినప్పుడు జరుగుతున్న ఘర్షణలు మాత్రమే పేపర్ల కెక్కుతాయన్న విషయం చాలా మంది విద్యావంతులకు కూడా అర్ధం కాదు. దిగజారుడు తనం పెరిగి పోయింది కాబట్టి కులాల ఈక్వేషన్స్ తీసి కొంత మందిని నాయకులుగా మారుస్తున్నా కూడా అంతిమంగా ఆర్ఢిక ప్రయోజనాలే   నిర్ణాయక పాత్ర వహిస్తాయని అర్ధం కాని జనం మొత్తం 3 రూపాయలతో పేపర్ చదివేసి మహాజ్ఞానుల్లా ఏదో ఒక పార్టీ  కి తలను తాకట్టు నిజాలను గ్రహించక కొట్టుకొంటూ ఉంటారు. దీంట్లో మీడియా కుట్ర కూడా తక్కువేమీ కాదు. ఏ పత్రిక తిరగేసినా ఎవరో ఒకరి మీద బురద జల్లుడే. నిజాలను వెలికి తీయడం మంచిదే…కానీ అసలు సమాజంలో మంచి అనేది ఎప్పుడూ…ఎక్కడా లేదనే విధంగా రాయడం వలన ప్రజలకు పూర్తిగా వ్యవస్థ  మీద నమ్మకం పోతుంది. ఒక విధంగా అధికార వర్గాలకు కావలిసింది కూడా ఇదే. అయోమయ స్థితిలో ప్రజలను ఉంచడం వలన ఉద్యమాలు వచ్చే ప్రమాదం నుండి తప్పించు కోవచ్చు. 
నాకు గుర్తున్న రెండు సంఘటనలను ఇక్కడ ఉటంకిస్తాను. దానిని  బట్టి కడుపు కాలిన సామాన్య జనం చేస్తున్న ఉద్యమాలకు,అధికార పంపకంలో వారి వారి మధ్యన తగువులు వచ్చి చేసే ఉద్యమాలకు ఉండే  ప్రతి చర్య ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 90 దశకం  ప్రారంభంలో అనుకుంటా నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసారు. చిలికి చిలికి పెద్దదై రైల్ రోకోకు దిగారు. కాల్పులు జరిగి నలుగురు కార్మికులు చనిపోయారు. ఆ తరువాత కొద్ది కాలానికి తెలుగు దేశం పార్టీ రెండు ముక్కలుగా చీలి నప్పుడు రాజమండ్రి  లో ఎం.ఎల్.యే గారి ( అప్పుడు ఆయన రామా రావు గారి వెంట ఉన్నారు) అనుయూయులు పదిమంది కూడా ఉండరు ..కానీ ఎక్స్ ప్రెస్స్ రైళ్ళను యే ఆటంకం లేకుండా ఆపేయగలిగారు.రెండు చోట్లా జరిగింది రైల్ రోకోనే….కాన నాయకత్వం వేరు….ఉద్యమ లక్షణాలు వేరు. అందుకనే రాజు గారి భార్యల మధ్య జరిగే  కలహాలు మన కున్న ప్రధాన సమస్య కాదు. రాజు గారిని…వారి వంధిమాగతులను……వారి కొమ్ము కాసే వాళ్ళను…కాపలాకాసే కుక్కలను  తరిమి కొడితేనే అందరం సుఖపడతాం.