4, జులై 2011, సోమవారం

చెక్ బిఫోర్ హెల్ప్.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి పలాస వెళ్ళే ఈ ఎం యు బయలు దేరింది . బయలుదేరే స్టేషన్ లో అయితేనే సీట్ దొరికేబళ్ళల్లో ఆ బండి కూడా ఒకటి. మర్రిపాలెం తరువాత దాంట్లో నిలబడడానికి కూడా చోటు ఉండదు. ప్రతి రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఆ బండి ఎక్కడం నాకు అలవాటే. ఇద్దరు కూర్చునే సీట్లో కూర్చుని న్యూస్ పేపర్ తిరగెయ్యడం మొదలు పెట్టాను. బండి మర్రిపాలెం వచ్చింది. జనం పెట్టెల్లో కూరుకోడం ప్రారంభం అయ్యింది. అప్పటికే నాపక్కన ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు. ఒక వ్యక్తి సుమారుగా ముప్పై సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. నుదుటిమీద బొట్టు పెట్టు కున్నాడు...ముఖానికి ఫేస్ పౌడర్ కూడా రాసినట్టు తెలుస్తూనే ఉంది. సరే అతని ముఖంతో నాకేమీసంబంధం లేదు కానీ బోగీ లోకి ఎక్కీ ఎక్కకుండానే నా సీట్ దగ్గరకు వచ్చి " ఇది ముగ్గురు కూర్చునే సీట్ కదా ...జరగండి.." అన్నాడు.
అనుమానమొచ్చి ఒక్క సారి సీట్ వంక చూసుకున్నాను. ఇద్దరు కూర్చునే సీటే. నాకు ఎందుకో అతని దబాయింపుధోరణి నచ్చ లేదు.
"చూడండి..ఇది ఇద్దరు కూర్చునే సీటే.." అన్నాను.
అతడు ప్రయత్నం మానలేదు ." ఐతే నే ఎదుటి సీట్లో ముగ్గురు ఉన్నారుగా.." అన్నాడు.
"మిస్టర్ అది వాళ్ళ ఇష్టం..నేను జరగను" భీష్మించేసాను.
అతడు సణుగుడు మొదలు పెట్టాడు. " అంతేనండి జనాల్లో హెల్ప్ చేసే స్వభావమే ఉండట్లేదండీ..మీరేకూర్చోండి..హాయిగా కూర్చోండి.."
నేను పట్టించు కోలేదు.
పక్కనున్న కుర్రవాడిని అడిగాను నెమ్మదిగా " ఎక్కడ దిగుతావమ్మా..."
"పక్కనే సార్ ..కొత్తవలసలో దిగిపోతాను.."
నెమ్మదిగా నాకే వినబడేటంత నెమ్మదిగా అన్నాడు.
బండి సింహాచలం స్టేషన్ కు వచ్చింది.
ఒక ముసలి దంపతులు ఎక్కారు.
పక్కకు జరిగి " మీరిద్దరూ కొంచెం సర్దుకు కూర్చోండి ..పక్క స్టేషన్ లో ఈ కుర్రాడు దిగిపోతాడు ..అప్పుడు మీరురిలాక్సేడ్ గా కూర్చోచ్చు .. " అన్నాను.
వాళ్ళిద్దరూ బోల్డు సంతోష పడి పొయ్యారు.
"ఒరేయ్..ఎవరికి సహాయం చెయ్యాలో చూసుకొని చెయ్యడం నేర్చుకోండి ..అంకుల్ ని చూసి " అని
ఎదుటి సీట్లో కూర్చున్నావిడ పిల్లలకు చెప్పడం నేను దిగేటప్పుడు
విన్నాను.
ఆ మధ్య వచ్చిన "వేదం " సినిమా లొ బ్రహ్మానందానికి ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఒక వేశ్య అడిగిన ప్రశ్నకు అతడు సమాజానికి చేస్తున్న సహాయాల గురించి వివరిస్తాడు. " హాస్పిటల్ లొ ఆపిల్ పంచడం.... " ఇంకా అలాంటివి. నిజంగా చెప్పాలంటే ఆ పాత్ర చాలా సజీవ పాత్రే. మా వీధిలొ మా అపార్ట్మెంట్ దగ్గరే ఒక ఆటో స్టాండ్ ఉంది. వాళ్ళు దసరా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఒక సారి నేను సెల్లార్ లొ బండి తీస్తుండగా ఒక పక్కనె భారీ యెత్తున జరుగుతున్న వంట యేర్పాట్లను చూసి ఆశ్చర్య పొయ్యాను. చాలా భారీ యెర్పాట్లే. వాచ్ మన్ ని పిలిచి అడిగాను.
"సార్....అన్న సంతర్పణ వంటలు ....ఆటో స్టాండ్ వాళ్ళవే ...యేదో మన సెంటర్ వాల్లే కదా అని" నీళ్ళు నమిలాడు.
నా సందేహం అతడికి అర్దం కాలేదని నాకు అర్దమయ్యింది.
" మరి యీ బిర్యానీ వాసనలు యేమిటి?"
అప్పుడె ఆ స్టాండ్ లొ ఆటో అతడొకదు అక్కడికి వచ్చి నా ధర్మ సందేహాన్ని తీర్చాడు.
"సారూ పాత రోజులు కావు మరి.. యీ మాత్రం లేక పొతె సంతర్పనకు జనం రారు ..జనం రాకపొతే..ఇంతా చేసి...మరి ఉపయోగం యేటి?"
పక్కనే అంటించి ఉన్న పోస్టర్ లొ నుండి స్పాన్సర్ చేసిన నాయకుడి ముఖం నన్ను చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. వాడు యీ పెట్టుబడి యెందుకు పెడుతున్నాడో నాకైతే తెలుసు. కానీ యీ ఆటొ వాళ్ళకు వాళ్ళు అన్నార్తులకు హెల్ప్ చేస్తున్నారో ...లేక ఆ నాయకుడికి పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారో అర్దమయ్యేదెప్పుడో తెలియడం లేదు.
1996 లొ అనుకుంటా.. కోనసీమ లొ భయంకరమైన తుఫాన్ వచ్చింది. మొత్తం కోనసీమ అంత అతాకుతలమై పోయినత్లుగా వార్తలు అన్నిట్లోనూ వచ్చాయి. ఆ రొజుల్లోనే మా రైల్వే ప్రోజెక్ట్ కు ఇండియా లోనే ఉత్తమమైన ప్రోజెక్ట్ గా అవార్డ్ వచ్చి 100000 రూపాయల నగదు బహుమతి కూడా ప్రకటించారు. డానికి విజయవాద లోని వస్త్ర వ్యాపారులు కూదా తమ వంతు సహాయ సహకారాలు అందజేయడంతో ఒక లారీ నిండా దుప్పట్లు వగైరాలు నింపుకొని కోనసీమ లోనే ఉన్న మా బంధువుల వూరికి వెళ్ళాం. మెము అక్కడికి వెళ్ళిన తరువాత అర్దం చేసుకున్నదేమిటంటే అక్కడ మొత్తం వ్యవసాయ పనులు ఆగిపొయ్యాయి. మొత్తం పని చెయవలసిన కూలీలంతా రోద్ మీదే హాయిగా వేచి ఉండి అందుకుంటున్న సామగ్రి విలువ వాళ్ళకు వచ్చే దినసరి వేతనం కంటే యెక్కువ గా ఉంటోంది. అప్పుడె నాకు ఒక సత్యం అర్దమైంది. యే సహాయం కూడా సామాజికోత్పత్తికి దోహద పడేలా ఉండాలి. ఉత్పత్తి యొక్క ఫలితం యెవరి జేబుల్లోకి వెళ్తుందనేది వేరే కోణం లో ఆలోచించవలసిన విషయం. భారతదేశం లోని రాజకీయవాదులకు అభివ్రుద్ది పధకాలకంటే కూడా సంక్షేమ పధకాలంటేనే మోజు యెందుకో నాకు ఒక స్పష్టమైన ఆలోచననిచ్చింది. ఒకడు కాలు పోయి అంగవిహీనత్వంతో రోడ్ పక్కన అడుక్కుంటుంటే నిజంగా వాడిని బాగు చేయాలుకునే వాడు వాడికి మిగిలిన రెండు చేతులతో చేయగల పనిని చూపిస్తాడు. వాడిని అడుక్కునే వాడి కిందే చూడాలనుకునే వాడు వాడికి 10 రూపాయలు దానం చేసి పోతాడు. అభివ్రుద్దికి..సంక్షెమానికి గల తెడా చాలా సూక్ష్మమైంది. ఇది అర్దం చెసుకోలేని వాళ్ళు పిల్లల పెంపకంలో కూడా పొరబాట్లు చేసే అవకాశాలు చాలా యెక్కువ.
మితిమీరిన నిబద్దతను కూదా ఒక విధమైన అర్దం లేని సహాయం క్రిందే పరిగణించవచ్చు. ఏ విషయమైనా జీవితంలో తక్షణ ఫలితాలనివ్వవు. యీ రొజు నీవు నాటిన విత్తనం యే ఫలితాన్నిస్తుందో తెలుసుకుంటానికి ఖచ్చితంగా కొంత వెచి చూడవలసి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభిద్దాం. నాకు తెలిసిన ఒక అమ్మాయి భయంకరమైన పిసినారితనం తో బ్రతికే కుటుంబంలో పుట్టి పెరిగింది. కొన్ని పరిస్థితులు తారుమారు కావడం వలన అనుకోకుండా ఆ అమ్మాయి ఒక ధనిక రైతు కుటుంబానికి కోడలయ్యింది. అదంతా తన భర్త ..అత్తవారి సౌహార్ద్రత వల్లనే జరిగిందని తను మనసారా నమ్మింది. అది నిజం కాదని తెలిసిన నాలాంటి వాళ్ళు ఆ అమ్మాయి దృఖ్పధాన్ని మార్చడానికి విఫల యత్నం చేసాం. తరువాత తన ఖర్మ అని వదిలేసాం. ఆ అమ్మాయి ఎంతో దూరం నుండి మేము వచ్చినప్పుడు కూడా తన భర్త శృంగార జీవితానికి భంగం వాటిల్లుతుందని 9.00 గంటలు కాక ముందే మమ్మల్ని నిర్మొహమాటంగా పొమ్మనేది, త్వరగా పడుకోవాలనే వంకతో.
అప్పట్లొనే నేనొక విషయాన్ని గమనించాను. వాళ్ళకున్న మిగులులో చాలా భాగం ఆయన ఖర్చులుకే పొయ్యేది. అది నాకేదో అసంబద్దంగానే అనిపించి చెప్పి చూసాను కూడా. అప్పుడప్పుడు కొనే చీరలను చూసుకుని మాత్రం యీవిడ మురిసిపొయ్యెది కానీ యీ అసంబద్ద పంపిణీ గురించి అలోచించేది కాదు. ఆఖరికి సంతానం చదువుల గురించి ఖర్చు చెయవలసిన డబ్బు కూడా తన భర్త ఖర్చుల కోసం వాడుకున్నప్పుడు కూడా ఆమె ప్రతిఘటించలేదు. యీ వాతావరణం మొత్తానికి సంతానంలో యే విధమైన దృఖ్పధాన్ని పెంచాయంటే మన సుఖాన్ని గురించి మనం అలోచించుకోవాలి కాని అది మొత్తం మీద కుటుంబానికి ఎలాంటి నస్టాన్ని కలుగచేస్తుందనేది పట్టించుకోవడమే మానేసారు.
మన దేశ పరిస్థితికి యీ ఆలోచనకు కొంత సారూప్యత కనిపిస్తుంది. మితిమీరిన విశ్వాసంతో చేసే సహాయాలు కూడా చాలా వరకూ ఇలాంటి ఫలితాలనే ఇస్తాయ్. సహాయం చేసే లక్షణమే కరువవుతున్న యీ రోజుల్లో (పైన చెప్పిన "వేదం" సినిమా లోని బ్రహ్మానందాన్ని పోలిన రాజకీయ వాదులను లెక్కలోకి తీసుకోకూడదు). అందువలన సహాయం చేస్తున్నది సరైన పనికే అని నిర్ధారించు కోడం చాలా అవసరం. ఆడిగారు కదా అని అందరికీ "వినాయక చవితి" "దసరా" పందిళ్ళకు చందాలిచ్చి వాళ్ళు వేసిన పందిళ్ళ వల్ల ట్రాఫిక్ కదలక తిట్టుకొనే జనాన్ని చాలా మందిని ఇక్కడ చూస్తూ ఉంటాను.
మనకు కొన్ని విశ్వాసాలుండవచ్చు. అందరికీ అవే ఉండాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుందని చాలామందికి తెలియదు. అలాగే యెవరి జీవితమైనా (కుటుంబ,వ్యక్తిగత) వారి వారి భౌతిక పరిస్థితుల వలన యేర్పడిన అలోచనల వలనే వస్తాయన్న వాస్తవాన్ని విస్మరించి తనకున్న విశ్వాసాలకు భిన్నంగా నదిచే వారి మీద దుమ్మెత్తి పోయడానికి కూడా యీ " హెల్ప్' లేదా "గైడింగ్" అనే పదాలను బాగా వాడుకొంటుంటారు. నేను పైన చెప్పిన అమ్మాయి ఇంటికే ఒక సారి చుట్టపు చూపుగా వెళ్ళాను. ఆ ఇంట్లోకి ప్రవెశించడం తోనే ఆవిడ ఆకస్మాత్తుగా
" యేంటి పక్కింట్లోనికి చూసుకుంతూ వస్తున్నావ్?" అని అడిగింది.
నెను కొన్ని సంగతులు అప్పటికే విని ఉండడం వలన యాదాలాపంగానే అడిగాను
"యెందుకలా అడుగుతున్నావు?"అన్నాను
"యెమీ..లేదు..మా ఇంటికి వచ్చే వాళ్ళంతా ..ఆ ఇంటి వైపు చూసుకుంటూ వస్తారులే.." వేళాకోళంగా అన్నది.
" యీ విషయాన్ని మీ అన్నా ..తమ్ముళ్ళకు కూడా చెప్పి హెచ్చరించినట్లున్నావ్?" కొంచెం కోపంగానే అన్నాను.
"అవును బాబూ...లేకపోతే ...అందరికీ పెళ్ళిల్ళు కానక్కరలేదా..."
నాకు కోపం నసాళ్ళాన్నంటింది
" ఆవిడను నేను చూడ లేదు....కానీ నాకంతా తెలుసు. బుద్ది లేని తలిదంద్రులు వాళ్ళ అవసరం కోసం కని ...ఒక వెధవకు అంట గట్టి చేయిదులుపుకున్నారు...కట్టుకున్న వెధవ..వెనుకా ముందూ అలోచించుకోకుండా తీర్చుకున్న వాంచల వలన ..ముగ్గురు పిల్లలు పుట్టారు....వాడి వలన పైసా ఆదాయం లేదు. కన్న పాపానికి ఆ పసి పిల్లలను యేదోలా బ్రతికించుకోవాలి. కానీ ఆమెకు వేరే దారి తెలియదు. ఆవిడ చేస్తున్న పని మంచిది కాకపోవచ్చు.. పెద్దలు సంపాదించి ఇచ్చింది తింటూ ఖాళీగా కూర్చుని..గంటల తరబడి చీరల గురించి ..నగల గురించి సొల్లు చెప్పుకొనే బదులు నీలాంటి ఆడవాళ్ళు ఆమె మీద రాళ్ళు వేసే బదులు ఆవిడకు యెదైనా దారి చూపించండి. అసలు నా దృష్టిలో ఆవిడ మీలో చాలా మంది కంటే పతివ్రతే..."
ఆవిడకు పెద్దగా పట్టలేదు...అది వేరే విషయం.
చాలా సార్లు మనం చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా పెద్ద విషయాల గురించి మాట్లాడతాము. ఎంతో మందికి ఇబ్బంది కలిగించే పని కొంత మంది వలన అవుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంటాం. నేను పైన చెప్పిన ట్రైన్ లోనే ఒక సారి ప్రయాణం మొదలుపెట్టాను. నేను కూర్చున్న కంపార్ట్మెంట్ అంతా ఒకే చోటికి వెళ్ళే ప్రయాణీకులతో నిండి ఉంది. అంతవరకూ ఇబ్బంది లేదు కానీ ట్రైన్ బయలుదేరక ముందే ఒకతను " హలో...మైక్ ..టెస్టింగ్" అంటూ మైక్ ఆన్ చేసాడు. నాకేదో అనుమానం తోస్తూనే ఉంది. అయినా నాకెందుకులే అనుకుంటూ పేపర్ లో దూరి పొయ్యాను. ట్రైన్ బయలు దేరింది. మైక్ పట్టుకున్న వేరే అతడు తెలుగు లాంటి భాషలో ఉపన్యాసం మొదలు పెట్టాడు. అది తెలుగే కానీ బాగా అలవాటు పడితే కాని దానిని అర్ధం చేసుకోవడం కష్టమే. ఆయన ఒక మతం గురించి ఉపన్యాసం మొదలుపెట్టాడు. భరించడం కష్టంగానే ఉంది. నాకైతే ఏ మతం పట్లా ప్రత్యేకించి ద్వేషం ..అభిమానం లేవు. కానీ ఒక పబ్లిక్ ప్లేస్ లో అనేక మతస్తుల మద్య ...ఒకే మతస్తుల గోల ఏంటి ..నా పక్కన కూర్చున్న అతడిని అడిగాను
" చూడు బాబూ మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?"
" దేవుని సేవకు..." క్లుప్తంగా చెప్పాడు.
" ఇది దేవుని సేవా..?"
అతడు కోపంగా చూసాడు.
నేను లేచి మైక్ పట్టుకున్న అతడి దగ్గరికి వెళ్లి సౌమ్యంగా చెప్పాను.
" మీరు మైక్ కట్టేయండి"
"మీరవరండీ ..అడగడానికి...ఇంట మంది లో మీ ఒక్కరికే డిస్టర్ బెంసా ..."
ముగింపుని అతడే కొని తెచ్చుకున్నాడు.
జనం అంతా అప్పటి వరకూ ఉగ్గ బెట్టుకుని చూస్తున్న వాళ్ళ కందరికీ ఈ సమాధానం కారం రాసి నట్లుగా అనిపించింది..
ఆ తరువాత వాళ్ళు మైక్ కట్టక తప్ప లేదు.
సమాజం లో మనం చేయగలిగింది మనం చేస్తే చాలు చాలా ఉపయోగం చేసినట్లే. అన్నదానాలు..ఇతరత్రాలు..పేపర్లో వేయించుకొనే దురద ఉన్న వాళ్లకి ...రాజకీయాల్లోకి వెళ్ళాలను కొనే బ్రోకర్ గాళ్ళకి పనికి వస్తాయి.
కొన్ని కొన్ని సహాయాలు ఎవరికి....... ఎందుకు......అనేది చేసే వాళ్లకు కూడా ఒక అంచనా ఉండదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు నేను గత కొద్ది కాలంగా మా ప్రాజెక్ట్ నడుస్తున్న ఏరియా లో జరుగుతున్న "పనికి ఆహార "పధకాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఉదయం పది గంటలకు పని లోకి వెళ్ళిన శ్రామికులు మధ్యాహ్నం తిరక్కుండానే ఇళ్ళకు వచ్చేస్తుంటారు. కనీసం ఇచ్చిన జీతానికి పని చేయించు కోలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ఈ పధకం పెట్టింది ఎందుకో అర్ధం కాదు. పైగా ఆ సీజన్ లో వ్యవసాయ పనులు కూడా బాగానే ఉంటాయి. రైతులకు పనివాళ్ళు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా కనబడుతాయి. ఒకటి పూర్తి శ్రమను వినియోగించుకోకుండానే వాళ్ళ కోసం ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నాం. అదే సమయం లో శ్రామికులు లేక వ్యవసాయ ఉత్పత్తి దెబ్బ తింటోంది. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే ఈ పనికి ఆహార పధకం స్కీం నడుస్తున్న రోజుల్లో వైన్ షాప్స్ ఫుల్ కలక్షన్లతో ఉంటాయి. అంటే మొత్తానికి మొత్తానికి ప్రజా ధనం ఎక్కడకు ప్రవహిస్తుందో అర్ధం అవుతుంది. కేవలం సంక్షేమ పధకాలకు జనాలు అలవాటు పడేలా చేస్తున్నారు. ఎవరైనా పూనుకొని ప్రభుత్వాలు అభివృద్ధి పధకాలకు యెంత ఖర్చు చేస్తున్నారు...సంక్షేమ పధకాలకు యెంత ఖర్చు పెడుతున్నాయి..లాంటి లెక్కలు తీసి ఈ విధంగా జరుగుతూ ఉంటే చివరికి నష్ట పోయే దెవరు? లాంటి విషయాలు ప్రజలకు అర్ధం అయ్యే విధంగా లెక్కలు తయారు చేస్తే బాగుంటుంది. అసలు ప్రతి సంవత్సరం ఎక్షైజ్ ఆదాయం ఎందుకిలా పెరిగిపోతుంది....ప్రజల ఆదాయ వనరులు పెద్దగా పెరగకుండా అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. చదువుకున్న వాళ్ళు..చదువుకుంటున్న వాళ్ళు ఇలాంటి విషయాల మీద ప్రజలను చైతన్య వంతులని చేస్తే వాళ్ళ వంతు కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించి నట్లవుతుంది అంతే గాని ఐ పీ ఎల్ మాచ్ స్టాటిస్టిక్స్ ..కాదు ఈనాడు కావలిసింది.

మనం సహాయం చేయడం వలన ఏదైనా సమస్య సంపూర్ణంగా సమసి పోతుందా లేదా అని కూడా చూసుకొంటూ ఉండాలి. ఉదాహరణకు ఒక మేన్ హోల్ చోక్ అయ్యి ఆ చెత్తంతా రోడ్ మీదకు పొర్లు తున్నప్పుడు కేవలం దానిని మాత్రం శుభ్రం చేస్తే లాభం ఉండదు. ఆ మేన్ హోల్ ఎందుకు చోక్ అయ్యిందో చూసి దానిని నిర్మూలించే వరకూ ఆ సమస్య పరిష్కారం కాదన్న వాస్తవాన్ని నీవు చాలా ముందుగానే గ్రహించడం చాలా అవసరం. లేదంటే నీ శ్రమ చాలా వేస్ట్ అవుతుంది. వీధి గూండాలుగా ఉన్న వాళ్ళు ,బ్రోకర్ గా ఉన్నవాళ్ళు ..కొంత ఖాళీ టైం ఉండి నెమ్మదిగా రాజకీయ వాదులుగా మారి పదవులు వెలగ పెట్టి అతి లగ్సరీ జీవితం అనుభవిస్తున్నప్పుడు మనకేమీ చీమ కుట్టినట్టుగా అనిపించదు. పేపర్లో స్విస్ బాంక్ ఖాతాలను చూసి ఆవేశం తెచ్చేసు కుంటాం. వాటికి వ్యతిరేకంగా ఏదైనా ర్యాలీ జరిగితే వెళ్ళం. వాటంతట అవే జరగాలని ఆశిస్తూ ఉంటాం. మన యొక్క ఉదాసీనత వలనే స్విస్ బాంక్ లోకి ఈ ధన ప్రవాహం జరిగిందనేది వాస్తవం కాదా..? అంటే పోరాటం మన ఉదాసీనత మీద కూడా చెయ్యాలి కాదా..కానీ ఇక్కడితో ఆగకండి. అసలు ఇంత ఉదాసీనత ఏర్పడటానికి వెనుక ఉన్న మన సాంస్క్రతిక ,తాత్విక మూలాలు ఏమిటి? ఒక్క సారి మన పురాణ గాధలు చూడండి. మనం చేసిన ప్రతి తప్పు పనినీ ఏదోలా సమర్ధించుకోనే అవకాశాలు కోకొల్లలు. మన తాత్విక మూలాలు అర్ధం చేసుకుని వ్యాఖ్యానించిన ఆనాటి మేధావులని విదేశీ తొత్తులుగా చూసాం. క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నుండి నేటి వరకూ ఉన్న ఆలోచనలన్నిటినీ మనం పొరలుగా మన దగ్గరే ఉంచేసుకుంటాం. అవసరమైనప్పుడు ఏ పొర మనకు వీలుగా ఉంటుందో ఆ పొర లోకి ఇమిడి పోతాం. పెళ్లి రోజు వచ్చిందనుకోండి. ఉదయాన్నే దేవుడి గుడికి వెళ్తాం. ఎందుకైనా మంచిదని ఎవరికీ కోపం తెప్పించ కుండా ఇద్దరు ముగ్గురి దేవుళ్ళ గుళ్ళకి వెళ్తాం. ఏ విషయం మీదా పరి పూర్ణమైన నమ్మకం ఉండదు. మాకు బంధువులైన కుటుంబాలు కొన్ని ఉన్నాయ్. వాటిలో ఆడవాళ్ళను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు రెండే పనులు చేస్తారు. ఒకటి పేకాట ఆడతారు. లేకుంటే సాయి బాబా భజనలు చేస్తారు. మధ్యలో మరే ఏక్టివిటీస్ ఉండవు. ఎన్ని పొరల అంతరం..... ప్రతి మనిషి లోనూ లేదా సమాజం లోనూ మెటీరియలిస్టిక్ , ఐడియలిస్టిక్ భావజాలం ఏదో కొంత శాతం కలిసే ఉంటాయి..కానీ ఆ విభజన రేఖ చాలా స్పష్టంగా కనబడుతుంది....కానీ ఇక్కడ ఈ పొరల మాయ వలన ఆ రేఖలో ఉన్న గజిబిజి మరెక్కడా ఉండదేమో..ఇదంతా ఎందుకు రాయవలసి వస్తుందంటే నీవు దేనినైనా గెంటే అవసరం ఉన్నప్పుడు నీ క్రింద నేల గట్టిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నీవు అప్లయ్ చేసిన ఫోర్స్ ఎటువైపు వెల్లుతున్నదనేది నీకే అర్ధం కాదు. ఉదాహరణకు నల్ల డబ్బు కి వ్యతిరేకంగా చాలా మంది ఉద్యమాలు మొదలుపెడుతున్నారు. నీకు సరైన దృక్పధం లేక పోతే ఒక సామాజిక కార్య కర్త వెనుక వెళ్ళడం మానేసి ....యోగా నేర్పడానికి ఒకే క్లాసు లో ముందు వరసకు వెనుక వరసకు వేరు వేరు రేట్లు పెట్టి ఇంకా రక రకాలుగా ఆనతి కాలంలో వేల కోట్ల రూపాయలు సంపాదించిన బాబా వెనుక వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇక్కడొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. శారీరక ఆరోగ్యానికి యోగా చెయ్యడం మంచిది. కానీ మొత్తమ్మీద ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. అది స్పష్టంగా ఉండే నీ తాత్విక దృక్పధం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనవసరమైన పొరలన్నీ తొలగించి..నీకు..నీ కుటంబానికి ... ప్రస్తుత సమాజం లో అధిక శాతం మందికి ఉపయోగ పడగలిగే భావజాలాన్ని పెంచే పొరలను మాత్రమే ఉంచుకొవాలి. పురాణాల ప్రభావం వలన మన హేతుబద్ద  అలోచన లొ కూడా కొన్ని కొన్ని సార్లు బ్లాక్స్ యేర్పడతాయి. చిన్న ఉదాహరణ చూద్దాం. సినిమా లలో ఒక హీరోయిన్ ను విలన్ టీజ్ చేస్తుంటే మనకు సహజంగానే అతడి మీద కోపం వస్తుంది.  కానీ అదే పనిని హీరో చేస్తే మనకు ఆ కోపం రాదు. యెందుకంటే  మనం మానసికంగా హీరో పక్షంలో ఉంటాం. అంటే ఒకే పనిని ఇరువురు వ్యక్తులు చేస్తే వారిరువురి మీదా మనకు ఒకే రక మైన ఫీలింగ్స్ రావడం లేదు. సమాజంలో కూడా యిది అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది. మనం ఒక విషయాన్ని ,సపోర్ట్   చేసేటప్పుదు కానీ ...వ్యతిరేకించేటప్పుదు కానీ యీ బ్లాక్స్ లేకుండా చూసు కోవడం చాలా ముఖ్యం.
అదే మాదిరిగా మనం హెల్ప్..అనో..సానుభూతి అనో మనం చేసే  కొన్ని అలోచనలు తరతరాల నుండీ స్త్రీ జాతికి శాపం  అయ్యి కూర్చుంటుంటే దానిని దిశ మర్చే విధంగా యెవరూ చూడడం లేదు. యేదో ఒక సాధారణ సినిమా ను తీసుకుందాం. దానిలో కధ ప్రకారం ఒక అమ్మాయి మీద యెవడో వెధవ  అఘాయిత్యం చేయబోతాడు. ఆ అమ్మాయి తనను రక్షించు కొనే ప్రయత్నం లో అతడి ప్రయత్నాన్ని తీవ్ర స్థాయి  లోనే ప్రతిఘటిస్తుంది. షరా మామ్మూలుగా హీరో రంగ ప్రవేశం చేసి వాడిని తన్ని తగిలేస్తాడు. ఆ అమ్మాయి  కృతజ్ఞతగా "నా మానాన్ని కాపాడావు..థాంక్స్ " లాంటి డైలాగ్స్ చెబుతుంది. మనం వినేసి ఆనందించేస్తాం. ఇక్కడ గమనించవలసిన విషయం యేమిటంటే ప్రతిఘటించే  ప్రయత్నంలో ఆ అమ్మాయి ఒళ్ళంతా గాయాలైనా పెద్దగా అఘాయిత్యం జరగలేదనే మనం భావిస్తాం.  కానీ దురదృష్ట వశాత్తూ ఆ ఒక్క శరీర   భాగం మీద అఘాయిత్యం జరగ్గానే సర్వస్వం కోల్పోయినట్లుగా ఆ అమ్మాయి..సమాజం....భావించేసి సహాయానికి కంకణం కట్టుకుని తయారైపోతారు. అసలు "శీలం"... "మానం" అనే పదాలకు అర్దం తీసిన వాళ్ళని వురి తీసినా తప్పు లేదని నా అభిప్రాయం. మానం అనేది ఒక వస్తువు గా చేసి కొల్పోతే తిరిగి పొందలేమన్న వికృత అలోచన మీద మరింత విస్తృత చర్చ జరిగితే బాగుంటుంది.