14, మే 2012, సోమవారం

పాముల్ని వదిలేద్దామా......


జీప్ అప్పటి వరకూ స్పీడ్ గా వచ్చింది. ట్రైన్ కు ఇంకా సరిపడినంత టైం ఉంది. ఫరవాలేదులే అనుకంటూ ఉన్నాను. సరిగ్గా కంచరపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఆగింది. అప్పుడప్పుడు అక్కడ ట్రాఫిక్ జాం అవ్వడం మామూలే కాబట్టి నేను ముందు పెద్దగా పట్టించుకోలేదు....కానీ ఎంత సేపటికీ ట్రాఫిక్ కదలడం లేదు. నేను ఇంకా కొన్ని జిరాక్స్ లు తీసుకోవలసినవి ఉన్నాయని గుర్తుకు వచ్చి కంగారు మొదలైంది. డ్రైవర్ ను చూడమన్నాను.
"ముందంతా మొత్తం ఆగి పోయి ఉంది సార్ అన్నాడు"


ఏమి చేయాలో పాలుబోవడం లేదు.దిగి ముందుకు నడిచినా ఎంత దూరంలో ఆటో దొరుకుతుందో తెలియదు.
ఏ కారణం చేతో తెలియదు కానీ ట్రాఫిక్ నెమ్మదిగా కదలడం ప్రారంభం అయ్యింది.ఊపిరి పీల్చుకున్నాను. బ్రిడ్జ్ ప్రారంభానికి వచ్చిన తరువాత ఆ ట్రాఫిక్ జాం కు కారణం కళ్ళారా చూసిన తరువాత కోపంతో ఒంట్లో నరాలన్నీ ఒకే సారి బిగుసుకు పోయినట్లయ్యింది.మొత్తం ట్రాఫిక్ అంతా సగం రోడ్ లో నుండి వెళ్ళుతోంది. మిగిలిన సగంలో రాత్రి అక్కడ పక్కనే ఉన్న మందిరం తాలూకు "పరస" (ఉత్తరాంధ్ర లో "తిరునాళ్ళు" అనే పదానికి బదులుగా వాడేది) సందర్భంగా నిర్వహించిన ప్రోగ్రాం తాలూకు వేదిక మిగిలిన సగాన్ని ఆక్రమించి ఉంది.ఎవ్వరూ ఇదేమిటి అని అడగడం లేదు. అలానే సర్దుకుని ఆ సగం రోడ్ లో నుండి సాగిపోతూనే ఉన్నారు. ఆ నడిచి పోతున్న శవాలలో నేనూ ఒకడినైనందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి ...ఈ ట్రైన్ మిస్ ఐతే వేరే ట్రైన్ లేదు. తప్పనిసరిగా  గా రాంచీ వెళ్ళాల్సిన పరిస్థితి. మా అమ్మాయిని అక్కడ నుండి ఢిల్లీ తీసుకుని వెళ్ళాలి.చాలా కాలం క్రితం "విపుల" మాస పత్రిక లో చదివిన కధ గుర్తుకు వచ్చింది.శవాలను కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఒక వ్యక్తి తన కష్టమర్ కు బ్రతికి ఉన్న మనుషులను సప్లై చేసేస్తాడు. దానికి అతగాడి ఇచ్చిన రీజనింగ్ కూడా ఇదే. కళ్ళ ముందే జరుగుతున్న అత్యంత చిన్న  అవకతవకలను కూడా  పట్టించుకోలేని వీళ్ళను మనుషులుగా చూడడానికి అవసరమైన కారణాన్ని  చూపమంటాడు.


ప్రతి వీధి లోనూ జులాయి (లంపెన్) యువత ఉండడం సహజం. ఇంతకు ముందు వీళ్ళను ఎందుకూ పనికి రాని వారి గానే చూసే వారు. కానీ మారిన పరిస్థితులలో వీళ్ళే మన రాజకీయ వారసులుగా మారుతున్నారు. రోడ్ అంతా బ్లాక్ చేసి వేదిక వేసి దాని మీద ఏదో ఒక అసహ్య కరమైన ప్రోగ్రాం కండక్ట్ చేసే అంత బుద్ది హీనత  కాస్తంత జ్ఞానం ఉన్న వాళ్ళెవరికీ ఉండదు కదా....మరి అలాంటి ప్రోగ్రాం లు జరగక పోతే మన నాయకులకు ఫ్లెక్సీ లు తగిలించే చాన్స్ ఎక్కడ వస్తుంది? కాబట్టి ఒక వీధిలో కేవలం పది మంది ఆ లంపెన్ గ్ర్రూప్ ఉంటే చాలు కొన్ని వేల మంది తిరిగే రోడ్ ను బ్లాక్ చేయగలుగుతున్నారు.అంటే అన్ని వేలమందికీ వాళ్ళు అసౌకర్యం కలిగించగలుగుతున్నారు.జనం మాత్రం ఆల్టెర్నేటివ్ రోడ్  ఎక్కడ ఉందో వెదుక్కుంటూ తల వంచుకుని పోతూనే ఉంటారు.


ట్రైన్ ఐతే ఎక్కాను గానీ నా అలోచనా స్రవంతి ఆగలేదు. నాలుగు రోజుల ముందు కూడా  అనుకోకుండా ఇలాంటి ప్రోగ్రాం జరుగుతుండగా మా వాహనం స్లో అయ్యింది. వేదిక మీద యాంకర్ కు ఒంటి మీద స్పృహ ఉందా అన్న రీతిలో వాగుతుంది.జనం నుండి అనుకున్న స్పందన రాలేదు.


" అబ్బే......మీ వీధి లో కుర్రాళ్ళకు ఓపిక లేదండీ..."


అడ్డమైన బూతు డైలాగ్ లూ మాట్లాడుకుంటూ జనాలు ఆనందిస్తున్నారు. ఇదంతా ఒక గుడి ముందు ఆ అమ్మ వారి పరస సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ ప్రోగ్రాం. వేదిక చుట్టూ నాయకుల ఫ్లెక్సీలు ...మాకు అరగంట పైగా లేట్ ..మాకే కాదు ఆ రోజు  గోపాలపట్నం నుండి ఎన్.యే.డీ జంక్షన్ వరకూ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికీ అదే లేట్.
" ఆ వెనుక గ్రౌండ్ లో పెట్టుకో వచ్చు కదా ....యీ ట్రాఫిక్ సమస్యలు ఉండవు ....."


" ఊరుకోండి సార్...ఎక్కడో పెడితే ..యీ ఫ్లెక్సీ లు అన్నిటినీ ఎవరు చూస్తారు....ఇంకా ఇక్క్డ బెటర్ సార్...మొన్న అనకాపల్లి...యలమంచిలి మధ్య  సగం హై వే ని బ్లాక్ చేసి ..10000 వాట్ స్పీకర్స్ తో ప్రోగ్రాం పెట్టారు...ఆ రోజు హై వే లో ప్రయాణం చేసిన  వాళ్ళ ఖర్మ .....అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది సార్... " మా డ్రైవర్ నా విసుగుదలను పలచన చేయడానికి ప్రయత్నించాడు.


" మరి...అదే రోజు..అదే రోడ్ మీద యెవరైనా మినిష్టర్ లాంటి వాళ్ళు వస్తే...?"


మా డ్రైవర్ నన్ను చాలా జాలిగా చూసాడు.


"భలేవారు సార్...వాళ్ళకు పైసా ఖర్చవకుండా పోగైన జనం దొరికినట్లే కదా... ....
ఒక్కొక్క చోట ఉండే అది కొద్ది మంది వలన ఇంత మందికి బాధ....అంటే అతి కొద్ది మంది ఆర్గనైజెడ్ జనం పాములై చీమల్లాంటి జనాన్ని ప్రతి స్థాయి లోనూ పీడిస్తూనే ఉన్నారు. కాక పోతే యీ పాములు బయట నుండి రావడం లేదు. ఈ చీమల నుండే పుడుతున్నాయి.




యీ పాములు పరిమాణం దృష్ట్యా చిన్నవే.కానీ అత్యంత ప్రమాదం. ఎందుకంటే చీమల నుండి వేరు చేయడం కష్టం.మనకున్న అన్ని కళా రూపాలనూ తొక్కేసి చానల్స్ వాళ్ళు సృష్టిస్తున్న వికృత కళా రూపాలను మన సమాజమ్మీద రుద్దడానికి మార్గం సుగమం చేస్తానికి ఈ పాములు.  వీటి వెనుక ఉన్న పెద్ద పాములు డైరక్ట్ రంగం లోకి రాకుండా ఈ చిన్న పాములని వాడుకొంటాయి అంటే వీళ్ళు చెప్పిందే వేదం.....వీళ్ళు ప్రదర్సించేదే కళ అని జనం అంటే చీమలు నమ్మాల్సిన స్థితిలోకి సమాజాన్ని నెట్టడం కోసం పెద్ద పాములు వెనుక నుండి చేయవలసింది అంతా చేస్తారు.జనానికి ఒక ఆల్టెర్నేటివ్ అలోచనా విధానం లేకుండా చేస్తాయి. రంగులు వేరుగా ఉన్న ఈ పాములు ఒక దానికొకటి అల్టెర్నేటివ్ గా చూపించుకొంటుంటాయ్. చీమలు సహజంగానే ప్రస్తుతానికి వేరే గతి లేక వాటినే ప్రస్తుతం నమ్ముతారు కానీ యెల్లకాలం అలా నడవదని చరిత్ర చూస్తున్న అందరికీ తెలుసు.అలా రక రకాలుగా ఆలోచించుకొంటూ ప్రయాణం పూర్తి చేసి ఇంటికి వచ్చి 15 రోజులయ్యిందో లేదో తెలియదు కానీ పేపర్లో వార్త.......


విసుర్లు....వేళాకోళాలు.....సామెతలు ఇవన్నీ ప్రతి నాగరిక సమాజపు సంస్కృతి లోనూ అంతర్భాగంగా ఉంటాయి.అవి ఎంత విస్తృతంగా ఉంటే అంతగా ఆ సమాజంలో ప్రజాస్వామిక విలువలు వేళ్ళూనుకున్నాయని భావిస్తారు. చర్చిల్...  బెర్నార్డ్ షా ల మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు.... మొదలైన వాటిని బ్రిటిష్ పౌరులు వారి సమాజ శైలికి ఉదాహరణగా చాలా గొప్పగా చూపించుకొంటారు. ఎదుటివారిని నొప్పించని వేళాకోళాలు అందరికీ ఆహ్లాదకరంగానే ఉంటాయి.....మరీ మూర్ఖులైతే తప్ప...కాబట్టే ఆనాటి మన ప్రజాస్వామిక విలువల యొక్క ఔన్నత్యాన్ని భావి తరాల వారికి చూపించడానికి ఎన్.సీ.యీ.ఆర్.టీ. వారు ఆ నాటి నాయకుల విశాల దృక్పధాన్ని పరిచయం చేయడానికి ఆనాటి మేటి కార్టూనిష్ట్ వేసిన కార్టూన్ ని ఒక టెక్స్ట్ బుక్ లో వేసినందుకు పార్లమెంట్ లో ఒక పార్టీ వారు రేపిన దుమారం సభ్య సమాజం లో ఉన్న వారందరినీ విస్తు పోయేలా చేయడమే కాకుండా అధికార పక్షం వారు కూడా ఓట్లు జారి పోకుండా ఎదుటి వారిని మించి పోయి చేసిన  ప్రకటనలూ .......... అందులోనూ చర్చించవలసిన అన్ని సమస్యలనూ పక్కన పెట్టి దీనినే ప్రధాన సమస్యగా పార్లమెంట్ ను నడిపిన తీరు........చీమల ఆలోచనలన్నీ చంపేయడానికి .........అసలు చీమలు ఆలోచనే చేయకుండా ఉండడానికి చేస్తున్న కృషి లా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆలోచించే చీమలు దండుగా కదుల్తాయా....లేకుంటే పాముల బుసల మధ్య..జీవచ్చవాలులా బ్రతికేస్తాయో చూద్దాం....నేనైతే బ్రతకలేనేమో అనిపిస్తుంది.