15, ఏప్రిల్ 2011, శుక్రవారం

నీ ( మన) కేం కావాలి......

" సార్ ....నందూ ని ఉదయమే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు ..."

నా ప్రాజెక్ట్ సైట్ కి రాగానే కాంట్రాక్టర్ దగ్గర పని చేసే సూపర్వైజర్ చెప్పాడు.

" అరె ..నిన్నంతా బాగానే ఉన్నాడుగా.. సరే ..ఎలా ఉన్నాడో కనుక్కుని చెప్పండి" అంటూ జీప్ ఎక్కాను.కానీ రెండు కిలోమీటర్లు వెళ్లక ముందే ఫోన్ వచ్చింది....ముందు నమ్మ లేక పొయ్యాను..

" అసలెలా జరిగింది? "

"ఏమో సార్ నిన్న రాత్రి కూడా నైట్ వర్క్ చేసాడు..పని చేస్తుండగా కడుపు నెప్పి వచ్చి వాళ్ళ క్యాంపు కి వెళ్లి పొయ్యాడు.."

" ఎలా ..ఆ రాత్రి ఎవరు డ్రాప్ చేసారు...?'

" నడిచే వెళ్ళాడు సార్ "

" అంత చీకటిలో ఇంచు మించు రెండు కిలో మీటర్లు ఆ కడుపు నెప్పితో ఒక్కడూ నడిచి వెళ్ళాడా....మరి రాత్రి వర్క్ చేయించిన సూపర్వైజర్ ఏమయ్యాడు?"

" అతడు రానని ముందే చెప్పాడు సార్ "

జరిగింది నెమ్మదిగా అర్ధం అవ్వ సాగింది ..ఒక బాధ్యత వహించే వ్యక్తీ లేకుండానే వాళ్ళని తెల్ల వారే సరికి కాంక్రీట్ వర్క్ కి రెడీ చేయడం కోసం రాత్రి పనికి పురమాయించారు...పగలంతా మండే ఎండలో కస్టపడి కూడా అదనపు పని చేయడం వలన వచ్చే డబ్బు కోసం రాత్రి పనికి సిద్ద పడి ఉంటాడు. మొత్తానికి రాత్రి ఆరోగ్యం లో తేడా వచ్చి ఆకస్మికంగా చనిపొయ్యాడు.

మిగిలిన గ్రూప్ లో వాళ్ళను వివరాలు కనుక్కున్నాను ...మెదడు లో నరాలు చిట్లి రక్తం బయటకు స్రవిస్తున్నట్లు గా అనిపించింది. అతడు కుటుంబం లో ఒక్కడే కొడుకు. ఆరుగురు అక్కా చెల్లెళ్ళు. నలుగురికి తన శ్రమ తోనే పెళ్ళిళ్ళు చేసాడు. తనకి కూడా ఈ మద్యనే పెళ్లి అయ్యింది. భార్య గర్భవతి. ఐదవ తోబుట్టువు కి కూడా పెళ్లి కుదిరింది. కట్నం ఇచ్చేసాడు కానీ పెళ్లి ఖర్చులకే ఇంకా పైకం పూర్తిగా సమకూరక రెండు రోజుల ముందే వూరు వెళ్ళిపో వలసిన వాడు కొద్దిగా అదనపు పని చేసుకుని డబ్బు చేత పట్టుకుని వెళ్దామని ఉండి పని చేసుకుంటుండగా......అసలైన ఇంకొక విషయం ఏమిటంటే అతడు మూడు నాలుగు రోజుల నుండీ కడుపు నెప్పితో బాధ పడుతూనే పనికి వస్తున్నాడు. ఫైనల్ గా తెలిసిందేమిటంటే అపెండిక్స్ బ్లాస్ట్ అయ్యి బాడీ ఆంతా విషపూరితమై చని పొయ్యాడు. అంబులెన్సు లో శవం కదలి పోగానే నిలబడ లేక కుర్చీలో కూల బడ్డాను. టీ తెచ్చి ఇచ్చారు...తాగాలని పించ లేదు. కళ్ళ లో ఉబికి వస్తున్న నీటిని ఆపుకోడం కష్టంగా ఉంది.

ఒక సంవత్సరం నుండీ మా బ్రిడ్జెస్ లో సెంటేరింగ్, బార్ బెండింగ్ చేయడానికి జార్ఖండ్ నుండి వచ్చిన గ్రూప్ లో తన పనితనంతో అందరి మన్నన పొంది వర్కర్ స్థాయి నుండి నెమ్మదిగా పైకి ఎదిగిన వాడు. అసలు ఆ గ్రూప్ ను చూసి చాలా ఆశ్చర్య పోతూ ఉండే వాడిని. కొత్తగా వేస్తున్న ట్రాక్ పక్కన ఒక పూరి పాకలో ఉంటారు. దానికి తలుపులు గట్రా ఏమీ ఉండవు. వేళకి ఏదో తినేస్తూ అలా పని చేస్తూ ఉంటారు. కాస్త సంపాదించు కోగానే ఊరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. హిందీ చాలా స్పష్టంగా మాట్లాడ గలగడం వలన కావొచ్చు వాళ్ళంతా నాతో కబుర్లు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు.కదిలిస్తే చాలు వాళ్ళ వూరి విశేషాలు యెంత ఆనందంగా చెబుతారంటే వాళ్ళ ముఖాల్లో వెలుగు నిండి పోతూ ఉంటుంది.

వాళ్ళను చూస్తే నేను ఎప్పుడో చూసిన " బాగ్ బహాదూర్ ' అనే సినిమా గుర్తుకు వస్తూ వుంటుంది. ఒక గ్రామీణ యువకుడు బొంబాయి లో పని చేస్తూ ఉంటాడు. ఉండేది బొంబాయి లో అయినా మనసు ఆలోచనలు మాత్రం అతడి గ్రామం చుట్టూనే తిరుగుతూ ఉంటాయ్. అందులోనూ ఆ గ్రామంలో జరిగే చిన్న పండగ మీదే అతడి మనసు లగ్నమై ఉంటుంది. ఆ పండుగ రోజుల్లో అతడి పులి వేషమే ఆ గ్రామానికి పెద్ద వినోదం. అతడి పులి వేషాన్ని చూడడానికి విరగ బడి వచ్చే ఆ జనాన్ని చూస్తె కలిగే ఆనందమే అతడి మిగిలిన సంవత్సరానికి ఊపిరి పోస్తుందన వచ్చు. రోజులన్నీఒకేలా ఉండవు కాబట్టి అభివృద్ధి అనేది ఆపలేనిది కాబట్టి ఆ వూరికి కూడా ఒక సంవత్సరం పండగకు ఒక సర్కస్ కంపెనీ వస్తుంది. అందరూ దాన్ని చూడడానికి విరగబడతారు కానీ ఇతడి పులి వేషాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సర్కస్ కంపెనీ లో నిజం పులి ఉంటుంది. ఒక సారి ఈ యువకుడికి ఆ సర్కస్ మేనేజర్ నా దగ్గర నిజమైన పులే ఉండగా నీ పులి వేషాన్ని ఎవడు చూస్తాడని అంటూ ఎద్దేవా చేస్తాడు. కానీ ఇతదికున్న ఆలోచనా ప్రపంచంలో ఆ గ్రామానికి ఇతడే పులి . రెండో పులి ఉండటానికి వీల్లేదు. ఒక రోజు ఎవరూ చూడకుండా ఆ పులి డెన్ లోకి దూరి దానిని చాలెంజ్ చేస్తాడు. మిగిలినదేమీ దర్శకుడు మనకు చూపించడు కానీ పులి తన పని ముగించి నాలుకతో మూతి నాక్కుంటూ వచ్చి దాని కనువుగా పడుకోడం చూపిస్తాడు.
ఈ సినిమా మీద వివరంగా మరొక్క సారి రాస్తాను ఎందుకంటే అది అంత చిన్న విషయం కాదు. ఆ సినిమా గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడనిపిస్తోంది దానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ ఇవ్వడం యెంత సరైన నిర్ణయమో..(దానికి పందోనిమిమిది వందల తొంబై ఒకటి లో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ వచ్చింది)

కానీ ఇక్కడ సందర్భం ఏమిటంటే ప్రతి మనిషి శారీరకంగా జీవన అవసరాల కోసం ఎక్కడ ఎలాంటి పనైనా చేయనీ ..కానీ అతడి మానసిక ప్రపంచం మాత్రం అతడి సాస్కృతిక పునాడులున్న చోటే తిరుగుతూ ఉంటుంది. జీవితావసరాల కోసం ఉన్న ప్రాంతం యొక్క సంస్కృతి లో పూర్తిగా ఇమడలేక ..తన పునాదులకు సుదూరంగా ఉంటూ కాలం గడిపే వీరిలో నిరతరంగా అంతర్లీనంగా సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ పరిస్థితులు కొంత భిన్నంగా మారుతున్నప్పుడు కూడా వీరు తిరిగి తమ పునాదుల వైపుకు చూడడానికి ,రావడానికి ధైర్యం చేయలేరు.....దానికి చాలా కారణాలు ఉంటాయి. వీరు అందుకొంటున్న ఆర్ధిక ఫలాలు వీరిని నిరంతరంగా ఊరిస్తూ ఉంటాయి.అందులోనూ అమెరికా లాంటి చోట ఉండే వాళ్ళలో నిరంతరంగా ఈ సాంస్కృతిక పునాడులకి , ఆర్ధిక ఫలాల మధ్య నిరంతర మానసిక ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడొక చిన్న వెసులు బాటు ఏమిటంటే నగరాల్లో పుట్టి కేవలం ఆ కల్చర్ కే అలవాటు పడిన వారికి పెద్దగా సాంస్కృతిక పునాదులు ఉండవు కాబట్టి వాళ్లకు ఎక్కడున్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ గ్రామీణ ప్రాంతాల లో పెరిగి ఒక బలమైన కుటుంబ , సాంస్కృతిక పునాదులు ఉన్నవాళ్ళకి మాత్రమె ఈ ఇబ్బంది ఉంటుంది .
అభివృద్ధి అనేది ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల బట్టి చూడకూడదు.అవన్నీ నిజాలే కానీ ఆ అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి ....అన్నదే ముఖ్యమైన ప్రశ్న. ఒక పక్క ఐపియల్ ధగ ధగలు మరొక పక్క విద్యుత్ కొరతతో చీకట్లో విల విల లాడుతున్న గ్రామాలు. ఒక పక్క రైతుల ఆత్మ హత్యలు ,ఒక పక్క రోజు రోజుకీ మార్కెట్ లోకి దిగుతున్న లక్సరీ మోడల్ కారులు , నాలుగు వేల కోట్ల ముఖేష్ అంబానీ గారి భవంతి ....ఫుట్ పాత్ ల మీద తలదాచుకొనే లక్షల జనం.....దీనిని మనం నిజమైన అభివ్రుది అని అందామా....
ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. చట్ట బద్దత కు న్యాయ బద్దత కు మధ్య వుండే తేడా ను చాలా మంది అర్ధం చేసుకోరు. ప్రస్తుతానికి టాక్స్ కట్టి సంపాదించేదంతా చట్ట బద్దమైనదే. కానీ న్యాయ బద్దమైనదో కాదో మీ అందరికీ తెలుసు.రాను రాను ఈ రెండిటి మద్య తేడా పెరిగిపోతోంది. మహానుభావుడు " అన్నా హజారే " దీక్షకు కూర్చుని చేసింది చాలా అద్భుతమైన పనే కానీ తన ఉద్యమాన్ని చట్టం నుండి తప్పించుకొనే వాళ్ళతో బాటు చట్టం యొక్క లొసుగుల మీద కూడా గురి పెట్ట వలసి ఉంది.

ఈ సందర్భంలో నేనొక చిన్న ఉదాహరణ ఇస్తాను. అనుకోకుండా ఒక దూరపు బంధువు నా వయస్సాయనతో కలసి ప్రయాణం చేస్తూ...నాకు కుందేల్లంటే చాలా ఇష్టం అన్నాను. అప్పటికే వాటిని పెంచుతూ ఉండడం వలన అవి చూసే అమాయకపు చూపులు ....వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేను ఆ మాట అన్నాను . ఆయన కూడా....."నాకు కూడా చాలా ఇష్టం ..వాటి ముఖాన్ని కాస్సేపు నీళ్ళలో ముంచి ఉంచేస్తే త్వరగా చస్తుంది.హ్యాపీ గా వండుకుని తినొచ్చు...." నా ఫీలింగ్స్ గురించి వేరే చెప్పనవసరం లేదనుకుంటా...
ఒకప్పటి సమాజానికీ ఇప్పటి సమాజానికీ ...మా ఇద్దరి ఆలోచనల మధ్య ఉండే తేడా ఉంది. అందరితో కలసి ఆనందంగా ఉంటూ ..కష్ట పడుతూ ఫలాలను కూడా ..ఇంచు మించు గా అందరికీ అందించాలనే తపన తో ఉండే వాళ్ళు ఎక్కువగానే ఉండే వారు. అలా ఉండ గలగడమే గొప్పగా భావించేవారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు గల కారణాలను వివరించే ముందు నా చిన్న నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకోవడం చాలా అవసరం. మా నాన్న గారి చిన్నక్క వాళ్ళది పెద్ద కుటుంబం. మా మామయ్య చాలా కష్ట జీవి. వాళ్లకు తొమ్మిది మంది సంతానం. ఇల్లంతా ఆ రోజుల్లో పిల్లా పాపలతో కల కల లాడుతూ ఉండేది. మధ్య తరగతి రైతాంగ కుటుంబం కాబట్టి దేనికీ లోటు కనబడేది కాదు. నేను సెలవుల్లో అక్కడ ఉన్నప్పుడు మా మూడవ బావకు అంటే వారి మూడవ అబ్బాయికి ఒక దూరపు బంధువు ఒక పెళ్లి సంబంధం తీసుకుని వచ్చాడు. కొంత సేపు విన్న తరువాత మా మావయ్య ....... " ఏరా....మొన్న మనోళ్ళ పెళ్లి లోనే మీ పిల్లను చూసాను...కళ గా ఉందిరా...ఎవరిదో సంబంధం ఎందుకురా....నీ కూతురిని మా ఇంటికి పంపడం ఇష్టమా.... కాదా చెప్పు." అనగానే ఆ పేద రైతుకు నోట మాట రాలేదు. మరలా మా మామయ్యే " మీ అక్కయ్య తో(అంటే మా అత్తయ్యే) అన్నీ మాట్లాడి..పంతులు గారికి కబురు పంపు.." అనేసి తువాలు భుజాన వేసుకుని పొలం వెళ్లి పొయ్యాడు. ఆనాడు నాకు ఆ సంఘటన పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ .....ఈ రోజు అటువంటి సంఘటనల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. ఆ ఉదాత్తత ....నిస్వార్డం....నిజంగా ఎదురైతే...కన్నీళ్లు ఆపుకోవడం కష్టం అవుతుందేమో.....

మనిషి లో ఆలోచనలు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తనదిగానే అనిపిస్తుంది...ఆలోచనలకు...ఆచరణకు మధ్య దూరం పెరుగుతున్నప్పుడు మాత్రమె ఆత్మ న్యూనత కు లోనవ్వుతాడు.అది పైకి కనిపించ కుండా ఉండేందుకే తను కూడా ఒక పెద్ద గ్రూప్ లోనే ఉన్నానని తనకు తానూ నమ్మించు కొనడానికి కొన్ని మార్గాలు వెతుక్కుంటాడు.అందులో ప్రధానమైనదే ఈ నాడు చాలా పాపులర్ అవుతున్న కులాల వారీ పిక్నిక్ లు. ఆడంబరాలే ఆదర్సమై విరాజిల్లుతున్న వినూత్న ప్రదర్శనా స్థలాలు.అక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి .బాగా మిక్స్ అయ్యే వుంటాయి. హాస్టల్ తాలూకు సెప్టిక్ ట్యాంక్ లీక్ ఐన వాసనలో హైడ్రోజెన్ సల్ఫిడ్ గ్యాస్ కలిసినట్లు. ఒక్క సారి అందరి ముఖాల లోకి పరికించి చూడండి ...ఎక్కడైనా ఆప్యాయత...అనురాగం...వాత్సల్యం...లాంటి ఫీలింగ్స్ ఉంటాయేమో......నిజంగా ఈ విధమైన జీవితం అందరికీ ఆనందాన్నిస్తుందా...ఖచ్చితంగా ఇవ్వదు. మరెందుకు.....అంటే వేరే ఏమీ...కాదు..సరైన,బలమైన ఆల్టర్నేటివ్ కనబడడం లేదు కాబట్టి.అది ఒక్క రోజులో నిర్మాణం అవ్వదు. ఉదాహరణకు మా శ్రీమతి ని ఏదైనా పెళ్లి ఫంక్షన్ కు సింపుల్ గా ఉండే కాటన్ చీర ,మెళ్ళో ఒక సింపుల్ చైన్ తో రమ్మంటాను . కానీ ధైర్యం చేయదు. తనను తప్పు పట్టనవసరం లేదు. ఎందుకంటే లోకం రీతికి భిన్నంగా వెళ్ళడానికి ధైర్యం ఒక్క సారిగా రాదు. అదే మేము ఒక పదిమంది దగ్గర బంధువులం కలసి ఈ నిర్ణయం తీసుకుని అమలు చేయొచ్చు. ఒక్క సారి అలోచించి చూడండి. ఆడంబరాలు ఉండవు. అప్పుడు పెద్దగా డబ్బు సంపాదించే అవసరం ఉండదు. సంపాదించే వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు. అందరూ శాంతి గా ఉండే జీవితాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నప్పుడు అందుకు భిన్నంగా ఉండే వాళ్ళు సమాజంనుండి వేరై పోతారు..మార్పు ఒక్క రోజులో రాదు..కానీ ప్రయత్నం మాత్రం ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి కదా...
అసలు నాకు ఇంకో ఆలోచన కూడా వస్తోంది.ఇప్పుడు కాలేజ్ లలో ఉండే అమ్మాయిలలో అధిక శాతం ..ఆకస్మాత్తుగా ..మాకు కార్లలో ..తిప్పే వాళ్ళు ...ఖరీదైన రెస్టారెంట్స్ లో తిప్పే వాళ్ళు వద్దు..వాళ్ళ ముఖాలు కూడా చూడం...హజారే వెంట తిరగ గలిగే వాళ్ళు..( కనీసం మిగులు సమయాల్లో ) , జే.పీ.ని ఆదర్శం చేసుకో గలిగిన వాళ్ళ తోనే మా స్నేహం..అని నిర్ణయాలు తీసుకున్నారనుకోండి..ఇక చూడండి నా సామి రంగా....కొంత మంది ప్రభుడ్డులు మహాత్ముని లా కొల్లాయి (చిన్న పంచె లాంటిది) కట్టుకుని కాలేజ్ లకు వచ్చేస్తారేమో...

మా నాన్న గారు నాకు ఎనిమిదవ తరగతి లో ఉండగా అనుకుంటా క్లిక్ -౩ కెమెరా కొని ఇచ్చారు. అప్పట్లో అది కొంత ఖరీదైన అలవాటే కానీ వ్యూ ఫైండర్ లో నుండి ప్రకృతి ని చూడడం అలవాటై పోయింది. మేము ఉన్న ప్రాంతమైన రాజవొమ్మంగి గ్రామం లోఉంటున్న ఉద్యోగస్తుల కుటుంబాలు అన్నీ కలసి పిక్నిక్ లకు వెళ్తుండే వాళ్ళం. ఇప్పుడున్నటువంటి పిక్నిక్ లు కాదు. అందరూ కలసి అక్కడే వంట వండు కోవాలి. ఆడ మగ తేడా లేకుండా ఎవరికి వచ్చిన పని వారు చేయాలి. కులాల ఆలోచనే లేదు. చక్కగా కలసి పోగలగడమే ప్రధాన అర్హత . ఒక సమిష్టి భావనతో ఆనందంగా ఎలా ఉండొచ్చు అనేది ఆ రోజుల్లో నాకు తెలిసింది. నాకు లైబ్రరీ లో గంటల తరబడి గడుపుతూ పుస్తకాలతో స్నేహం చేయగలిగితే జీవితంలో యెంత ఆనందంగా (చాలా తక్కువ ఖర్చు తో ) ఉండొచ్చో అర్దమైనదీ కూడా అక్కడే. ఈ నాటికీ నా ఈ అలవాట్లనే మా పిల్లలకి కూడా సంక్రమింప చేయడం వలననే మేము ఆర్ధికంగా కూడా ఏ భారం లేకుండా , తృప్తిగా గడుపుతున్న విషయాన్ని నా స్నేహితులు ఇప్పుడు గ్రహిస్తున్నారు.
కాబట్టి దిశా నిర్దేశం అనేది చాలా ముఖ్యం. మనం మధ్య తరగతి లో ఉన్నప్పుడు మన ఆలోచనలు దానికి అనుగుణంగా ఉండేటట్టు చేసుక్డం వలన జీవితం చాలా తేలిగ్గా గడపొచ్చు అనేది నా అభిప్రాయం. పేపర్లో ఏదైనా లక్సరీ కార్ తాలూకు యాడ్ చూసి పిల్లలు దాని గురించి చర్చిస్తున్నప్పుడు మనం వారిని తెలివిగా వారించడం మానేసి మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి పోయి ఇంకా ఏమేమి ఉంటే కారులో మరింత బాగుంటుందో చెబితే .....పాపం పిల్లలు ....అవే కలలు కంటారు. అలా కాకుండా ఒక మంచి పుస్తకం గురించి..ఒక గొప్ప చారిత్రిక సంఘటన గురించి...ఒక గొప్ప నాయకుడి యొక్క చారిత్రక పాత్ర గురించి ..ఆ స్థానానికి అతడు ఎదిగిన తీరు గురించి...మనం పిల్లలకు చెప్పగలిగితే వచ్చే ఫలితాలు ఖచ్చితంగా చాలా మెరుగ్గా ఉంటాయని చెప్పగలను. అంతేకాదు వూరి చివరలో ఉన్న పొలాల పచ్చదనం లో ఉన్న అందం ...దానిని చూడడం వలన వచ్చే ఆనందం మనం మన పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పడంలో సఫలీక్రుతులమవుతున్నామా.. ... ఎక్కడెక్కడి వాటి గురించో అనవసరంగా చెప్పేస్తూ ఉంటాం. ఆర్ధిక వనరులు పెరగడం వలన ఈ మధ్య కాలంలో బయటకు టూర్లకు వెళ్ళాలన్న కాన్సెప్ట్ పెరిగిన మాట వాస్తవమే కానీ అక్కడకు వెళ్లి మంచి మంచి ఫోటోస్ తీసుకుని మన చుట్టు పక్కల వాళ్లకు ప్రదర్శించడం లో చూపెడుతున్న తాపత్రయం ఆయా ప్రదేశాల యొక్క విసిష్థత అర్ధం చేసుకోడంలో చూపించ గలిగితే మన యాత్రలకు అర్ధం ఉంటుంది. అందం అనేది మన మనసులో ఉంటుంది కానీ ,బయట కాదు అనే విషయం చాలా మందికి ఈ నాటికీ అర్ధం కాదు. కాబట్టి ఈ మానసిక సౌదర్యాన్ని పెంచే సాధనాలైన బుక్ రీడింగ్ , సంగీతం వినడం ( సినిమా సంగీతం కాకుండా..) , సామాజిక సేవా కార్య క్రమాల్లో పాల్గొనడం లాంటివి అలవాటు చేస్తే..చాలు ....వీటిల్లో ఉండే ఆనందం ..తృప్తి మన మీదే కాకుండా మన పిల్లల మీద కూడా ఆర్ధిక పరమైన ఒత్తిడులు లేకుండా చేయగలుగుతుంది. దానితో జీవితం చాలా వరకూ సాఫీ గా సాగి పోతుంది. మధ్య తరగతి లో ఉండి ..వేరే వేరే పిచ్చి కలల సాఫల్యం కోసం డబ్బు అవసరమై ...దాని కోసం ఒత్తిడులకు లోనయ్యే బదులు ఈ విధమైన జీవితం మంచిది కదా....
నా మట్టుకు నాకు ....ఆకలి లేకుండా స్టార్ హోటల్ లోతిన్న భోజనం కంటే ఆకలిగా ఉన్నప్పుడు ..ఇంట్లో వేడి వేడి అన్నం లో మాగాయి పచ్చడి లో గానుగు నూనె వేసుకుని తినడమే ...చాలా ఆనందాన్నిస్తుంది. అంతే కాదు ఎక్కడికో బోలెడంత ఖర్చు పెట్టుకుని తిరగడంలో కొంత ఆనందాన్ని పొంది ఉండ వచ్చు కానీ నేను కడుతున్న బ్రిడ్జ్ చెక్ చేసుకుంటూ ....ఆ బ్రిడ్జ్ లో నుండి పారుతున్న నీట్లో ఆనందంగా ఈదుతున్న చేప పిల్లలను చూస్తూ చాలా ఆనందిస్తుంటాను. అలాగే నీరెండలో నేను వేయిస్తున్న ఫార్మేషన్ కు అటు ఇటు ఉండే తోటల పచ్చదనాన్ని ...వాటి మీద వాలే పిట్టలు చేసే ధ్వనులను ఆస్వాదిస్తుంటాను.
ఇది చదివిన నా మిత్రులు కొంత మంది ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అనుకుంటారని నేను అనుకోడంలో తప్పేమీ...లేదేమో....

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

మా వూరి సత్రం...నిన్న ,నేడు,.....రేపు.


అదేమీ కాశీ మజిలీ కధల లోని రాత్రి పూట బస , తిండి ఉచితంగా ఏర్పాటు చేసే సత్రమేమీ కాదు. రోజుల్లో ఎవరో ఒక పెద్దాయన వూరి మీదున్న అభిమానంతో ఒక చిన్న భవనం , దానికి బయట చిన్న అరుగులు దాని మీద తాటి ఆకు కప్పు ఏర్పాటు చేసాడు. భవనం చుట్టూ ప్రహరీ గోడ కూడా ఉన్నది. నా చిన్నప్పుడు కాంపౌండ్ లో పెద్ద నుయ్యి కూడా ఉండేది. దాన్ని ఎప్పుడో కప్పి పెట్టడం జరిగింది.
ఏది ఏమైనా దాని గత చరిత్ర ఘన మైనది అని చెప్పలేము. నాకు ఊహ తెలిసిన తరువాత అక్కడ చిన్నదైనప్పటికీ గుర్తుండిపోయే మీటింగ్ ఒకటి జరిగింది. మా వూరి లో ఆనాటి పెద్దలు శ్రమతో సాధించిన పశువుల ఆస్పత్రి ప్రారంభోత్సవం రోజున దానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నాటి మంత్రి వర్యులు అయిన శ్రీ బత్తిన సుబ్బారావు గారు ఇచ్చిన చక్కని ఉత్తేజ భరితమైన స్పీచ్ నాకు ఇప్పటికీ గుర్తుండి పోయింది. అది తప్పితే అది ఎప్పుడు కూడా మంచి పనులకి ఉపయోగ పడిన దాఖలాలు లేవు. గోడలకే కనుక నోరు ఉంటే చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చి ఉండేవి. నా విద్యాభ్యాసం నాటి రోజులలోనే దానిని ఏదో విధంగా ఉపయోగం లోనికి తేవాలనే ఆశ, ఆశయం ఉండేవి. నా విద్యాభ్యాసం నాటి రోజులలోనే దానిని ఏదో విధంగా ఉపయోగం లోనికి తేవాలనే ఆశ, ఆశయం ఉండేవి.
మా సుపుత్రుడు పెట్టగా నేను బ్రేక్స్ తో నైనా ఈ మద్య ఒక సినిమా చూడడం జరిగింది. దాంట్లో హీరో కిక్ కోసం దొంగతనాలు చేసి ఆ డబ్బుతో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. నిజ జీవితంలో ఇది కొంత వరకూ కరెక్టే . చాలా కాలం క్రితం నేను ఎందుకో ఒక పిల్లల హాస్పిటల్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తూ నేను నెమ్మదిగా వెనుక వైపు ఉన్న లాంజ్ లోకి వెళ్లాను. అక్కడ ఒక చిన్న ఓపెన్ షెడ్ లాంటిది ఉన్నది. అక్కడ కూడా కొంత మంది పిల్లలను పెట్టుకుని వైద్యం కోసం చూస్తున్నారు. వాళ్ళ వైపు చూస్తూ ఉంటె నాకు అర్ధమైన విషయం ఏమిటంటే ఆర్ధిక వెసు
లు బాటు లేకుండా ఉంది ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు వాళ్ళంతా అని. వారిలో ఒకావిడ తన చిన్న బిడ్డను ఒక బల్ల మీద పడుకో బెట్టి ఆ ముఖం లోకి చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ బయట రావలిసిన వారి కోసం అనుకుంటా అస్తమానూ బయటకు ఆత్రుతగా చూస్తోంది. ఆలస్యం ఐతే ఆ బిడ్డ దక్కదేమోనన్న దైన్యం ఆ ముఖంలో ఎలా ప్రస్ఫుటంగా కనబడుతుందంటే హృదయం ఉన్న వారు ఎవరన్నా సరే ద్రవించి పోక మానరు. నేను అటునుండి వస్తున్న నర్స్ ను వివరాలు అడిగాను. ఆవిడ భర్త ఏదో చిన్న గుడిలో అర్చకత్వం చేస్తూ ఉంటాడు. బిడ్డకు బాగుండక పొతే ఎవరో అయ్య రికమండేషన్ తో హాస్పిటల్ లో ఉచిత వైద్యం కోసం అడ్మిట్ చేసాడు. మందుల కోసం ఉదయాన్ననగా వెళ్ళాడు. ఇక్కడ పరిస్థితి చేయి జారి పోతోంది. మందులకు యెంత అవుతుందని అడిగాను . ఆవిడ చెప్పింది. నిజంగానే పెద్ద మొత్తం ఏమీ కాదు. వెంటనే జేబులో నుండి తీసి ఇచ్చాను. ఆ ఇద్దరి కాళ్ళ లోని భావాలు నాకు ఒక లాంటి కిక్ ఇచ్చ్చాయేమో అనిపిస్తుంటుంది. నేను ఆ తరువాత చాలా సార్లు పదిమందికీ పనికి వచ్చే పని చేసి నప్పుడు వచ్చే కిక్ గురించి చెబుతూ ఉంటాను. ఇదంతా ఎందుకు చేబున్నానో క్రింద ఉన్న ఒక్క పేరా చదివి దాంట్లో నేను ఉటంకించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇందులో నేను రాసిన విషయం చేరేలా పాతకులు చేస్తారని నా చిన్న ఆ.
పైన చెప్పిన సదరు సత్రం ఎవరో మహానుభావుడు ఆనాటి అవసరాల కోసం నిర్మాణం చేసి ఉండవచ్చు. కానీ గ్రామం నడిబొడ్డున మెయిన్ రోడ్ పక్కన ఇది ప్రస్తుతం నిరుపయోగంగా పది ఉన్నది. ఈ స్థలం మీద పూర్తి హక్కులు కీర్తి శేషులు శ్రీ మార్ని పాపన్న గారి కుటంబీకులవని నాకు ఈ మద్యనే తెలిసింది. వారి కు
మారులు శ్రీ మార్ని నారాయణ మూర్తి గారు చాలా కాలం క్రితమే కాలం చేయగా శ్రీ మార్ని గనేస్వర రావు గారు ఈ మద్యనే కాలం చేసారు. వారిరువురి సంతానం పూనుకొని వారి పెద్దల పేరు మీద ఒక చిరస్మరణీయ మైన నిర్మాణం అంటే ఒక చిన్న కమ్యూనిటీ హాల్ అంటే అది యోగ లాంటి అన్ని మంచి పనులకీ ఉపయోగ పడే విధంగా చేస్తే బాగుటుందని నా విన్నపం. నేను రైల్వే ప్రాజెక్ట్ చేస్తున్న ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల కోసం వారి కోరిక పై నేను డిజైన్ చేసిన ఒక చిన్న కమ్యునిటీ భవనం యొక్క నమూనాను పక్కన ఇవ్వడం జరిగింది. విజ్ఞులందరూ నిరుపయోగంగా ఉన్న పై సత్రాన్ని ,ఈ కమ్యునిటీ భవనాన్ని పోల్చి చూసుకోవచ్చు. చాలా మందితో మంచి సంబంధాలు మైంటైన్ చేసే శ్రీమతి మాధవి ఈ మెయిల్ మిగిలిన కుటుంబీకులకు చేరవేయగలదని ఆశిస్తున్నాను.
ఇంకొక విషయం ఏమిటంటే రాజమండ్రి పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రామంలో రోడ్ పక్కన ఈ నిర్మాణమే జరిగితే ఇది సమీప గ్రామ ప్రజల మీద కూడా చక్కని ప్రభ్హావం చూపే అవకాశం ఉంటుంది అలాగే పదిమంది కోసం పదిమందితో కలసి పని చేయడంలో ఉన్న కిక్ చాలా మందికి ఈ విధంగా తెలియ చేయాలని నా ఆశ.