30, డిసెంబర్ 2013, సోమవారం

ఒక నగర వాసి జీవితంలో ఒక రోజు



సమయం
చేసిన పని
తన దృష్టిలో చేసిన పని తాలూకు ఫలితం
పుణ్యం వచ్చేవి
పాపం తెచ్చేవి
ఉ.06.30
రైతు బజార్ కు కూరగాయల కోసం బయలు దేరాడు. ఆ రోజు  గురు వారం అన్న సంగతి గుర్తుకు వచ్చి సాయి బాబా గుడి వైపుకి తిరిగాడు. అప్పటికే జనం వచ్చేశారు. పార్క్ చేసే స్థలం లేదు . ఫరావాలేదనుకుంటూ నాలుగు వాహనాలకడ్డంగా తన బండి పార్క్ చేసేశాడు. గుడి లో పెద్ద క్యూ ఉంది. ఎవరూ పట్టించుకోరనుకుంటూ లైన్ పట్టించుకోకుండా ముందుకు సాగి పొయ్యాడు. ఇద్దరు ముగ్గురు కేకలు వేసారు కానీ వినబడనట్లు వెళ్లి సాయిబాబా విగ్రహం ముందు సాష్టాంగ పడి పొయ్యాడు . బయటకు వచ్చేసరికి తన బండి అడ్డు రావడం వలన బయటకు తీయలేక నలుగురు వాహనదారులు ఎదురు చూస్తున్నారు.


ఏదో పుణ్యం ఇంతకు ముందు చేసాను కాబట్టే ఇంత సులభంగా దర్శనం దొరికింది.
ఎవరి ప్రాప్తం వారిది.....అందరి సంగతీ పట్టించుకుంటే మన పనులెలా ......?
ఉ.08.00

తెచ్చిన విభూతి తయారై కూర్చున్న పిల్లలిద్దరి ముఖాన రుద్దాడు . “ఏమిటి నాన్నా .....టైం చూడు ..ఇవాళ టెస్ట్ కూడా ఉంది “ అన్న కొడుకు తో  “ఫరవాలేదురా నేను తీసుకు వెళ్తానుగా” అంటూ రాంగ్ రూట్ లో ఇద్దరిని గుద్దినంత పని చేసి ఎలాగైనా కుమారుడిని టైం లో కాలేజ్ లో పడేసాడు.



ఈ సంవత్సరం ఒక్క సారీ మిస్ కాకుండా ప్రతి గురువారం సాయిబాబా గుడి కి వస్తానని మొక్కుకున్నాక ....మిగిలినివన్నీ స్వామే చూసుకుంటాడు.
రోడ్డన్నాక ఎవడికీ టచ్ కాకుండా డ్రైవ్ చేయకుండా ఉంటాడా...
?ఎప్పుడూ కరెక్ట్ రూట్ లోనే వెళ్తాడా ......
ఉ.08.30

రైల్వే స్టేషన్ కు బయలు  దేరాడు. రోడ్ కడ్డంగా వేసిన వినాయక చవితి పందిరి లో కెళ్ళి విగ్రహానికి నమస్కారం చేసి బయటకు వచ్చాడు .
తృప్తిగా ఫీలయ్యాడు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినప్పటికీ ...

ఉ.08.50

లోకల్ ట్రైన్ ప్లాట్ఫార్మ్ మీదకు వచ్చింది. పెద్ద రష్ లేదు కానీ దిగేవారిని తోసుకుంటూ లోపలికి దూరిపోయాడు. పక్క వాడి దగ్గర పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టాడు . సహజం గానే ప్రయాణీకుల వాగ్యుద్ధం  ప్రారంభమయ్యింది. “అసలు ఈ పొలిటీషియన్స్ లో నిజాయితీ ఎక్కడుందండీ.....అందరినీ ఉరి తీసేయాలండీ ....
నక్సలైట్ లు మాత్రం కాంట్రాక్టర్ ల దగ్గర నుండి చందాలు దండుకోవడమే కదండీ .....” దిగవలసిన స్టేషన్ వచ్చే వరకూ వాగుతూనే ఉన్నాడు .

ఎన్నెన్ని కుంభకోణాలు .....2G....బొగ్గు...లేదంటే దేశం ఎక్కడో ఉండేది ......ఆ మాత్రం గట్టిగా చెప్పాలి ....

సా 5.00
....ట్రైన్ టైం అయి పోతోంది....ఈ రీ స్త్రక్చరింగ్ ఎప్పుడు అవుతుందో...హాపీ గా గవర్నమెంట్ జీప్ దొరికిపోతుంది .....పిల్లల ఆటో ఖర్చు కూడా సేవ్ అవుతుంది.
గవర్నమెంట్ జీప్ వాడని ఆఫీసర్ భూమ్మీద ఉంటాడా ...?
పాపం ఎంత మాత్రమూ కాదు
సా 7.00
“నాన్నా.....పరీక్షల టైం లో ఈ మైకుల గోల చాలా ఎక్కువగా ఉంది....నేను ..గౌతమ్ ...ఇంకా నలుగురం కలసి ఆ పందిరి లో వాళ్లకు సౌండ్ తగ్గించమని చెప్పొస్తాం...” అన్న కొడుకి మాటలకు ఉలిక్కి పడ్డాడు. “ఒరేయ్ ...ఈ ఏరియా అంతా వాళ్ళ వాళ్ళే .....నీవు బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని చదువుకో.......”


మంచి ఇంజనీర్ అవ్వ వలసిన వాడిని అనవసర గొడవలలోకి ఎలా పంపిస్తాం.


రా 8.00
ఆటో ఆగింది . అమ్మాయి దిగింది . “అదేమిటమ్మా....
లేటయ్యి పోయింది .”నిర్భయ సంస్మరణార్ధం కాండిల్స్ టో ఊరేగింపు జరిపాం ....నాన్నా....పైగా పూర్తిగా ప్రెస్ కవరేజ్ ఉంది .పేస్ బుక్ లో ఉన్న  మా కాలేజ్ పేజ్ లో అన్ని ఫోటోస్ అప్ లోడ్ చేస్తారంట .
పిల్లలకు ఆ మాత్రం సోషల్ అవేర్నెస్ ఉండక పొతే ఎలా....

23, డిసెంబర్ 2013, సోమవారం

చట్టానికి మేము అతీతులమ్మరి ..... కాకపోతే అది అమెరికా ...

నేను ఒక సారి ఏదో ఆలోచిస్తూ నా టూ వీలర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా జరిగింది ఆ సంఘటన . చాలా స్పీడ్ గా పక్క వీధి నుండి వచ్చిన ఒక టూ వీలర్ యువకుడు రాంగ్ టర్న్ తీసుకుని నన్ను ఢీ కొట్టినంత పని చేసాడు . నేను నెమ్మదిగా డ్రైవ్ చేయడం వలన అదృష్టం కొద్దీ నాకేమీ కాలేదు కానీ ఈ ఆకస్మాత్తు సంఘటన నన్ను చాలా ఉలికి పాటు కు గురి చేసింది . ఆ ఉలికి పాటులో నా నోటి నుండి కాస్త పరుషమైన పదజాలమే బయటకు వచ్చింది . నిజంగా చెప్పాలంటే ఆ ఉలికిపాటు వలన కాస్త గట్టిగానే తిట్టేసిన మాట వాస్తవం . మా మద్య వాదోప వాదం పెరిగింది. సహజంగానే చోద్యం చూసే జనం మా చుట్టూ చేరారు . అతగాడు తను చేసిన పని లోని తప్పుని ..... అంటే పబ్లిక్ ను తప్పుదారి పట్టించడం కోసం నేను తిట్టిన తిట్లనే హైలైట్ చేస్తాడు కానీ అంతకు ముందు నన్ను అంతగా కలవరబాటుకి గురి చేసిన అతగాడి పొరబాటు గురించి మాట్లాడే ఛాన్స్ నాకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు . చోద్యం చూసే జనమే కాబట్టి అంత లోతుల్లోకి వెళ్ళరన్న అతగాడి నమ్మకాన్ని కూడా జనం నిజం చేస్తూ జనం మా ఇద్దరినీ వేరుజేయడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పొయ్యారు . 

అటువంటిదే మరలా ఇన్నాళ్ళకి మన మీడియా లో మరలా చూస్తున్నాను . మన  IFS అధికారిణి ని అమెరికా వారు చాలా చిన్న చూపు చూసారన్న వార్త మొత్తం పత్రికలన్నీ ఊదరగొట్టేసాయి. అది నిజం అనే దాంట్లో ఆక్షేపణ అయితే ఏమీ లేదు కానీ అంతకు ముందు ఆమె చేసిన చట్ట ఉల్లంఘన గురించి మాత్రం ఎవరూ రాయలేదు. ఆమేమీ సామాన్యురాలేమీ కాదు . ఒక IFS అధికారిణి. ఏ దేశంలో అయితే తను భాద్యత లు నిర్వర్తిస్తుందో ఆ దేశ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన భాద్యత ఆమెదే . కానీ మన మీడియా వారికి వార్తను సరుకుగా మార్చుకోగల తెలివితేటలు ఎక్కువే కాబట్టి ఆమె నేరం కాస్తా వెనక్కు పోయింది . మన అదృష్టం కొద్దీ నిన్న ..... ఈ రోజు మాత్రం కొన్ని పత్రికల్లో ఆదర్స్ హౌసింగ్ లో ఆమెకున్న అక్రమంగా పొందిన ఫ్లాట్ ..... అంతకు ముందు ఆవిడ తండ్రి గారి అధికారిక బలం వలన ఆవిడ కు ఒనగూరిన undue advantage గురించి వార్తలు వచ్చాయి. "ఇది అందరూ చేసేదే...... దీన్ని పెద్ద విషయం చేసేస్తున్నారు" అని నెమ్మదిగా దీన్ని పలచన చేసే ప్రయత్నం కూడా మొదలయ్యింది . అసలే ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి పాపం ...... దీన్ని ఎలా వాడుకోవచ్చో అని రాజకీయ పార్టీలు కూడా తర్జనభర్జనలు పడిపోతున్నాయ్ పాపం .


25, నవంబర్ 2013, సోమవారం

నిర్జన వారధి గానే వదిలేద్దామా



                        “అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి?”అనే ప్రశ్న తోనే మనం ప్రారంభిద్దాం. అసలు పుస్తకాలే చదివేవాళ్ళు కరువైపోతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకాన్ని ఎంత మంది చదువుతారో తెలియదు. అసలీ పుస్తకాన్ని ఎందుకు చదవాలి ?

                             దానికి ఒక్కటే సమాధానం. ఒక ఉదాత్త చరిత్రను ......మానవీయతను దర్శింఛి మీకు తెలియకుండానే మీ కళ్ళలో నుండి అది ఆనందమో .....దుఖమో తెలియని స్థితిలో కారుతున్న నీళ్ళను కూడా పట్టించుకోలేని అనుభూతిని మీరు కోరుకుంటే ఈ పుస్తకాన్ని చదివి తీరవలసిందే . సమాజ పరిణామం ఆగదు. కానీ ఆ రోజుల్లో మాకు దొరికింది ......ఈనాటి యువకులకి దొరకనిది ఒక్కటే ......“ఉత్తేజం”. భిన్న ఆలోచనలే లేని చోట నిజమైన  ఘర్షణ ఉండే అవకాశమే లేదు. భిన్న ఆలోచనల.....సిద్దాంతాల ఘర్షణ ఉన్న సమాజం లో పుట్టేదే నిజమైన ఉత్తేజం తప్ప మిగిలినదంతా రాజు గారి భార్యలు .....ఉంపుడుగత్తెల ఆంతరంగిక పోరాటమే తప్ప మరేమీ కాదు.

                               స్వాతంత్ర్య పోరాటానికి ఒక బాలిక గా ఉన్నప్పుడే అంతగా ఎందుకు స్పందించాలి.... నిజంగా ఆమెకు జన్మనిచ్చిన తలిదండ్రుల పెంపకం ఎంత గొప్పది....బాల్య వితంతువుకి వివాహం చేసినా  ఆమెను పోరాట మార్గంలోకి అనుమతించిన ఆ మహనీయులకి .....నారాయణ కాలేజ్ గాని..... చైతన్య కాలేజ్ గానీ ఇంటర్నల్ గా పెట్టే పరీక్షలలో మార్కులు తక్కువ రాగానే గాభరా పడిపోయే ఈ నాటి తలిదండ్రుల మైన మాకూ ఎంత తేడా .......

                               గూండాలను తరిమి తరిమి కొట్టిన ఆ మహనీయురాలి జ్ఞాపకాలలోని విజయవాడ ను కుల రక్కసి కరాళ నృత్యంచేస్తున్న నేటి విజయవాడ ను పోల్చి చూస్తే చాలు మన రాజకీయ పార్టీలు .....మీడియా... ప్రజలను ముందుకు తీసుకు వెళ్తున్నాయో ....వెనుకకు తీసుకు వెళ్తున్నాయో చెప్పడానికి . అసలు అభ్యుదయం  అంటే ఏమిటో తిరోగమనం అంటే ఏమిటో తెలియకుండా పిల్లలను పెంచేస్తున్న మాకూ ....తన తరువాతి రెండు తరాలవారిలో  కూడా అత్యున్నత చైతన్యం నింప గలిగిన ఆ నిత్య యౌవ్వనరాలు తో పోలిస్తే మేమేప్పుడో వృద్దులమై పోయాం. వోట్లు రాల్చగలిగే గూండాల ...ఫాక్షనిస్టుల విగ్రహాల మాటున జాతీయ నాయకుల విగ్రహాలు దాక్కుంటుంటే  చూసి కూడా టీవీ రియల్ కోసం....ఆఫీస్ టైం కోసం .....పిల్లల కాలేజ్ టైం అయిపోతుందని ........క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం పరుగులు తీస్తున్నాం . ఆ తరువాత కూడా ఇంకా టైం ఉందనుకుంటే ముందుగానే టికెట్స్ రిజర్వు చేయించుకుని తిరుపతి ...షిర్డీ యాత్రలకు వెళ్తాం తప్ప .....పరలోక సుఖాలకు కర్చీఫ్ వేసుకుంటాం తప్ప......ఎంతో అవసరమైతే తప్ప వోటు వేయడానికి కూడా బయటకు రాలేము. ఎలా వస్తాం..... రోడ్ మీద మెత్తగా జారిపోయే కార్లను కలర్ టీవీలో అందులోనూ పక్కన మాంచి అమ్మాయి కూర్చుంటే డ్రైవ్ చేస్తుంటే ఉండే మజా ను చూపిస్తుంటే ఆనందంగా కలలలోకి జారిపోతూ బ్రతికేస్తున్నాం. ఎప్పుడో విద్యార్ధి దశలో “వీరులార.....వీరులార.....ఎర్రజెండ....యోధులార .....” అని పాడుకున్న రోజులు జ్ఞాపకానికి కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాం.



                                కానీ ఈ పుస్తకం మరొక్క సారి మాకొక మార్గం చూపించింది. తన జీవితం మరొకరికి భారం కాకుండా ఆ మహనీయురాలు ఎలా జాగ్రత్త పడిందో చూసిన తరువాత ఇప్పుడు మేము నడుపుతున్న పడవను ఇప్పుడున్న పరిమితులలోనే ఒక తీరానికి చేర్చిన తరువాత మరలా మేము ఏ బాట పట్టాలో తెలిపింది . ఆ మహా తల్లిని నిర్జన వారధిగా మిగలనీయం.

                                 అటువంటి అమ్మమ్మ దొరికిన అనూరాధ ధన్యురాలైతే .....ఈ పుస్తకాన్ని బయటకు తీసుకు రావడానికి కృషి చేసిన అనురాధ (చిన్ని) తో  పరిచయం ఉన్న మేమంతా ధన్యులం.