5, జనవరి 2012, గురువారం

పెదనాన్న..కొన్ని జ్ఞాపకాలు

             సగోత్రీయులం  అందరం గోదావరి గట్టుకి వెళ్ళాం పిండ ప్రదానం చేయడానికి. కార్యక్రమం  జరుగుతూ ఉంది. కాకులకోసం చూస్తున్నారు. మా పెదనాన్న గారి జీవితం ముగిసి కొద్ది రోజులే అయ్యింది. ఎందుకో  తెలియదు ఇంతకు ముందు మరీ అంత విచారం ఉండేది కాదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తరంలో ఒక్కక్కరూ రాలి పోతుంటే వ్యక్తులు శాశ్వతంగా  దూరమైన బాధకు  మించి వేరే బాధ నన్ను చుట్టు ముట్టేస్తుంది. నాకు ఊహ తెలిసిన తొలి రోజుల లోనే ఆయనకు పెరాలసిస్ వచ్చింది. పల్లెటూరు కావడం వలనా….వెనుకబడిన కుటుంబం కావడం వలనా….ఆయనకు సకాలం లో వైద్యం ఐతే అంద లేదు. దాని  బాధ ఆయన జీవితాంతం పడ్డాడు. ఎంతో కష్టపడే  అలవాటున్న ఆయన దానికి దూరం కావడం తో మానసికంగా చాలా కృంగి  పొయ్యాడు.కానీ ఆయనతో పాటు మా పెద్దమ్మ జీవితం మొత్తం జైల్ జీవితం అయిపోయింది.  గత 40 సంవత్సరాలలో ఆవిడ  వేరే యెక్కడికీ రావడం చూడ లేదు. యెవరో పలకరించడంతో ఆలోచనా స్రవంతి కి బ్రేక్ పడింది......

                  మొత్తానికి  కాకులు వచ్చాయి. 40 యేళ్ళ నుండీ వీధి దాటి యెరుగని ఆయన కు పెద్ద గా యే కోర్కెలూ ఉండే అవకాశాలు ఉండవు. గతం అంతా యెదో సినిమా రీల్ లా మెదిలింది. ఒకసారి తాడికొండ ఆశ్రమ పాఠశాలకు వెళ్ళాక ఆయనను చూడడానికి వెళ్ళే టైం దొరికేది కాదు. నాన్న  గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు…ఎప్పుడు కలిసినా పెదనాన్న “ఆడు…ఆడు…” అని సైగ చేసి అడుకుతున్నాడురా…అని. ఆయనకు  అంతకు మించి మాటలు వీలయ్యేవి కాదు. నా  మీద అభిమానం ఉండటానికి కారణం కూడా ఆయనకు మగ పిల్లలు లేకపోవడం ఒక కారణం కావచ్చు. నిజం చెప్పాలంటే ఆయన తన తోటి వారినందరినీ ఆప్యాయంగా చూసుకొనేవాడు. నాకైతే నాకు తలపాగా చుట్టి బయటకు తీసుకెళ్ళడం చూచాయగా గుర్తుంది. .........మరలా కర్మకాండ తంతులొకి  ప్రవేశించాం.  గడ్డాలు..మీసాలు తీయడం  ప్రారంభమైంది. కానీసం చావులో ఐనా అంతా కలవడం ….ఆ కర్మకాండలు పూర్తయి  ఆత్మ స్వర్గం చేరిందని నమ్మకం కలిగే వరకూ సగోత్రీయులందరూ ఆ బాధలో కూడా ఉండడం……ఇవన్నీ ఆచార పరంగా వచ్చినా ఎంత ఆలోచనతో పెద్ద వాళ్ళు  ముందు చూపుతో ఇలాంటివి పెట్టారో అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తరువాత నావారినందరినీ  చూసాను.  చదువు అయిన  వెంటనే ఉద్యోగం ….దాంట్లో యాంత్రికంగా ఇమిడి పోవడం ..జీవితంలో యేదైనా సాధిస్తున్నామో…కోల్పోతున్నామో…అలోచించుకొనే వ్యవధి కూడా ఉండని జీవితం……పరుగులు….అంతా పరిగెత్తుతున్నప్పుడు మనం కూడా పరిగెడితేనే సాపేక్షంగా మన స్థానం  నిలబడుతుందన్న…ఫీలింగ్……..చాలాకాలం తరువాత  యేదో ఒకటి ఆలోచించే టైం దొరికింది. మరలా  ఒక సారి పెద నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన హాస్పిటల్ లో ఆఖరి రోజులలో ఉన్నాడని కబురు తెలిసింది. హాస్పిటల్ కి వెళ్ళాం. మన  లో లేడని చాలా మంది ముందుగానే చెప్పడం వలన ఆయనను చూస్తే చాలని అనుకుంటూ వెళ్ళాను. రిసెప్షన్ లోనే చెప్పేసేరు ..ఆయన భోజనం మానేసి 15 రోజులయ్యిందని. అలానే పైకి వెళ్ళాను. కూడా ఉన్న నాన్న గారితో మాట్లాడుతున్నాను. మా మాటలు వినబడి ఆయన దిగ్గున లేచి కూర్చోవడం ఆయనకోసం ఉంచబడ్డ మనిషి ని ఎంత ఆశ్చర్యానికి  గురి చేసిందో చూసిన వాళ్ళకే అర్దం అవుతుంది. లేచిన మనిషి ఒక్కసారి  భోరున యేడ్చేశాడు. యేనాడూ ఆయన నోరు విప్ప లేని పరిస్థితి .... మరి చరమాంకంలో దేనికోసం అంతలా విలపించాడో ఈనాటికీ నాకు అర్దం కాలేదు. అలా ఆయనను చూసిన తరువాత మరలా కొంత కాలం తన జీవితాన్ని పొడిగించగలడనిపించింది. నా అలోచననే 2 రోజుల తరువాత మా నాన్న గారు తన ఫోన్ తో ఖాయం కూడా చేసారు. కానీ అంతలోనే యీ ముగింపు.
                        ఆయనేమీ గొప్ప వ్యక్తిగా చూడబడాలని కోరుకోలేదు. పొలం వెళ్ళడం మానివేసినప్పటి నుండీ ఇంటికెదురుగా ఉన్న గానుగ చెట్టు చుట్టూ కట్టిన చప్టాయే ఆయనకు శాశ్వత కాలక్షేప వేదిక అయ్యింది. ఆయనతో  పాటు మిగిలిన ఆ తరంలోని అన్నదమ్ములు(పెదనాన్న..చిన్నాన్నల కుమారులు) కబుర్లు వినడమే ఆయనకుండే ఒకానొక్క కాలక్షేపం. యెప్పుడైనా వస్తుండే మమ్మలని అంత దూరం నుండే చూసేసరికి ఆయన ముఖంలో కనబడే వెలుగుని చూడడం నాకు చాలా ఇష్టం గా ఉండేది. అటువంటి వెలుగులు బహుశా యిక ముందు తరాల  లోని వారు చూడలేకపోవచ్చు.డిజిటల్ కెమేరా కొన్న కొత్తలో ఒక సారి ఆ వూరు వెళ్ళి ఆయనకు చాలా ఫొటోస్ తీయడం జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం యేమిటంటే ఆ ఫొటోస్ నేను బేక్ అప్ చేయకముందే ఆ కెమేరాను అరువు తీసుకున్న వాళ్ళు అవసరం లేక పోయినా వాటిని మొత్తం తీసేసారు.
                     ఒక్క విషయం ఖచ్చితంగా అనిపించింది..ఇంకా అనిపిస్తూనే  ఉంటుంది.." నా మనుషులు ..నా వాళ్ళు నాకు కావాలి....అని ఆలోచించే..తరాలకు...నా వస్తువులతో ....నా కాలక్షేపం నాకుందిలే అనుకునే తరాలకు  మధ్య  ఉన్న సంధి యుగంలో ఉన్నామని .............