1, డిసెంబర్ 2011, గురువారం

కుళ్ళుని కడగడం ప్రారంభిద్దామా....

పారిభాషిక పద కోశం లో కొన్ని పదాలకు అర్ధాలు యేమున్నాయో తెలియదు  కానీ వాడుకలో మాత్రం కొన్ని పదాల అర్ధాలు అనూహ్యంగా మారి పోతున్నాయి. కొన్ని పదాల అర్దం యేమిటో నాకిప్పటికీ అగమ్య గోచరంగా ఉంటుంది.  అందులో ముఖ్యమైనది "శీలం" అనే పదం. వాడుకలో ఈ పదానికి ఉన్న అర్దం వినడానికే యేవగింపుగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క "నడవడి" ఇత్యాది లక్షణాలను  వివరించే ఈ పదం ఈనాడు కేవలం సమాజానికి (ఇది కూడా మొత్తం గా వర్తించక పోవచ్చు) ఆమోదమయ్యే రీతిలో   స్త్రీ యొక్క శారీరక ఉపయోగాన్ని నిర్దేశించే  ఉపయోగార్దం లో వాడుతున్నారు. నేను ఇప్పటికీ అనుకున్నంత స్పష్టంగా  నా భావాన్ని వ్యక్తీకరించ లేకపొయ్యాను.ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవలసింది ఏమిటంటే స్త్రీలు కూడా అదే భావజాలంలో కొట్టుకు పోవడం. ఉద్యోగం చేసుకుంటున్న ఒక విద్యాధికురాలు తన స్నేహితురాలితో  మాట్లాడిన మాటలు  నా చెవినబడడం కాకతాళీయమే ఐనప్పటికీ ఆ మాటలు  మనం అంటున్న "మారిన అర్ధాల" గురించి చెబుతాయి." నేను చాలా లక్కీ తెలుసా ...ఆ టైం  కి ఎవరో వచ్చి తలుపు తట్టారు సో ఐ వస్ సేవ్డ్" మరి ఆవిడ తరహా మిగిలిన వారి గురించి   నేను ఇంతకు మించి వేరే వివరించదలుచుకోలేదు.
  ఇంతకు ముందు కూడా నా వేరే పోస్ట్  లో ఇదే విషయాన్ని కొంత వివరించాను. యీ పదాల అర్దాలు మరలా ఎప్పుడు మారతాయో చూడాలి. ఈ రోజు జైళ్ళలోకి నెట్ట బడుతున్న రాజకీయ నాయకుల ,అధికారుల భార్యలకు రోజు రోజు కీ ఇంట్లోకి ఎక్కడి  నుండి ధనం ప్రవహిస్తుందో తెలియదా......ఎంతో కొంత తమ భర్తలు చట్టానికి,సమాజానికి అతీతమైన రీతుల్లో ఈ ధనార్జన చేస్తున్నారని. ఐనా సమాజం వారినందరినీ శీలవతులుగానే పరిగణిస్తుంది. ( ఒక వేళ వీళ్ళు చెబుతున్నా ఆ భర్తలు వినక పోతే ...ఆ భార్యలను విమర్శించడం తగదు కానీ జరుగుతున్న చాలా పరిణామాలు ఆ విధంగా లేవు.) అక్కడి వరకూ అక్కర లేదు యీ రోజు కాలేజ్ నుంది బయటకు వస్తున్న విద్యార్ధి నెవరినైనా సరే ఈ " శీలం  అంటే ఏమిటి?"  అని ప్రశ్నించండి  అప్పుడు మీకే అర్ధం అవుతుంది మన కాబోయే నాయకులు..మేధావులకున్న  సామాజిక అవగాహన. ఎంత మంది తలిదండ్రులు తమ పిల్లలకు 50 సంవత్సరాల అజెండాను ఇస్తున్నారు? ఇచ్చిన అజెండా కేవలం 25 సంవత్సరాల వరకే. ఆ తరువాత గడపవలసిన జీవితం పట్ల అవగాహన....అంతా అగమ్య గోచరం. మంచి అంటే ఏమిటో వివరించే కొలమానాలు అసలు ఉన్నాయా? నిజంగా అంత అజెండా తో పిల్లలని పెంచితే సాఫ్ట్ వేర్ లాంటి రంగాలలో మాంచి మాంచి ఉద్యోగాలలో ఉన్న యువకులు వాళ్ళ తలిదండ్రులని యేవో సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి ఉండే వారు. వాళ్ళు సంపాదించేది చాలక ఆ డబ్బు ఇక్కడికి పంపి దానితో తన వాళ్ళతో రియల్   ఎస్టేట్ వ్యాపారాలు చేయిస్తున్నారు.   

ఒక చిన్న విషయంతో ప్రారంభిద్దాం. మా అక్కయ్య పాలెం మెయిన్  రోడ్ లో వెళ్తున్న ప్రతివారూ ఒక చోట రోడ్ లో కొంత భాగాన్ని ఆక్రమిస్తూ  అడ్డంగా కట్టిన రంగురంగుల గుడ్డలను చూసే ఉంటారు. నాకు కూడా కొంత కాలం వరకూ అర్దం కాలేదు. తరువాత అర్దం అయ్యిదేమిటంటే ఆ స్థలాని ఆక్రమించుకొని కొంత మంది సత్య సాయి బాబా భజనలు చేస్తున్నారు. వారి ఆక్రమణ వలన కొన్ని వేల మంది వెళ్ళే  రోడ్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ఐనా యెవరూ అడగరు. ఆ భజనలు చేసే కొద్ది మందికీ వారి నమ్మకాలే ప్రధానం కాని సమాజం లో తోటి వారి ఇబ్బందులు వారికి అక్కరలేదు. కొంత మందికి వారి నమ్మకాలే ముఖ్యమైనప్పుడు  మరికొంత మందికి వారి అవసరాలే ముఖ్యమై కూర్చుంటాయి. ఉల్లంఘన పట్ల ఒక సారి ప్రారంభమైన ఉదాశీనత దేనికైనా దారి తీయొచ్చు. ప్రతి ఒక్కరూ ఈ తమ చుట్టూ జరుగుతున్న  చిన్న అన్యాయాల  గురించి మాట్లాడుకోరు. ఎక్కడో  దూరంగా ఉండే రాజకీయ వాది గురించో లేక ఒక ఉన్నతాధికారి గురించో మాట్లాడుకొంటారు.  ఎందుకంటే అప్పుడు  మన చేయగలిగింది యేమీ ఉండదు. యే అన్న హజారే యో ముందుకు తేబడితే హాయిగా అతడి టోటో  లు వేయించుకొంటూ ఫోటోస్ దిగవచ్చు. "అయ్యా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా  ఊరేగింపు తీద్దాం " అంటే చందా ఈయని  వార్డ్ స్థాయి  నాయకులు తమ అవసరాల కోసం వినాయక చవితి పందిళ్ళు వేయించి పెట్టుకుంటున్న కటౌట్లను చూస్తూనే ఉంటాం కానీ మన ఈ ఉదాశీనతనే పై వాళ్ళు బాగా కనిబెడుతున్నారన్న వాస్తవాన్ని మనం విస్మరిస్తున్నాం. క్రింద స్థాయిలో  ప్రశ్నిచడం  ప్రారంబించగానే పై వాడు కూడా కొద్దిగా భయపడతాదని  మనం ఎప్పుడూ మరవ కూడదు. 
క్యూ ఖచ్చితంగా పాటించే సంస్కారం మన అందరిలో ఉన్నప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర కాపలా వాడి అవసరం ఏమిటి? మనం సరిగ్గా ఉండక ఎవడో పనికి మాలిన వాడికి కాపలా పేరుతో మన జుట్టు అందిస్తున్నాం. లోపం మన లోనే ఉంది. విలన్లు ఎక్కడో ఉండరు. మన మధ్యే ఉంటారు. సిమెంట్ దొంగతనం చేసి శివలింగాలను పూజ చేస్తున్న వారిని కళా పోషకులుగా ...రాజకీయ నాయకులిగా కీర్తిస్తూ వెలసిన కటౌట్లను ఆనందంగా చూడడం తప్ప మరేమీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో  ఉన్న మనందరం విలన్లమే.
సినిమా తీసినంత సుళువుగా  రాజకీయ పార్టీ పెట్టి జిల్లా వారీగా ఫైల్యూర్ సినిమాని ముందుగానే అమ్మేసినట్లు  పార్టీని  కూడా అమ్మేసిన ఒక మాజీ హీరో  గారి పుత్ర రత్నం యొక్క వివాహ నిశ్చితార్ధ వేడుకలని రెండు మూడు చానళ్ళు చాలా సేపటి నుండీ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయ్. రైతుల ఆత్మ హత్యల లైవ్ కవరేజ్ తో కూడా టీ.ఆర్.పీ. రేటింగ్స్ ఎలా పెంచుకోవచ్చో యీ మధ్యే విడుదలైన ఒక హిందీ సినిమాలో చూపించారు. యీ రోజు కూడా నలుగురు అన్న దాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అవి కూడా లైవ్ కవరేజ్ ఇచ్చే అలోచన కలిగితే బాగుండును. మరెవరైనా ప్రముఖ రాజకీయ నాయకుడు పైకి పోతే ఇవన్నీ ఆయన అకౌంట్ లోకి పోయి..చక్కగా ఎవరో ఒకరు వీళ్ళందరినీ ఓదార్చడానికి వచ్చి ఉండేవారు కదా అనిపిస్తుంది. ఈ కుళ్ళంతా కడగడానికి ఎన్ని చీపుళ్ళు కావాలో....కానీ కడగడం తప్పదు. ఉప్పెన పైకెగసే రోజు దగ్గర లోనే ఉంది.....మనం చూస్తుండగానే కుళ్ళంతా సమూలంగా తుడిచి పెట్టుకు పోతుంది. ఒక్క విషయం ఏమిటంటే ఉప్పెన దానంత అది రాదు. మనందరం దానిలో భాగస్తులైతేనే వస్తుంది.