14, అక్టోబర్ 2011, శుక్రవారం

విగ్రహాలను పడగొడదాం.....






మా సుపుత్రుడితో కలసి యీ మధ్య ద్వారకా నగర్ వైపు వెళ్తుండగా వాడికి ఆకస్మాత్తుగా ఒక సందేహం వచ్చింది. మనం చేసే మంచి పనులు అప్పుడప్పుడు మన పీకకే చుట్టుకుంటాయనడానికి మంచి ఉదాహరణ నేను ..మా సుపుత్రుడే. మాయా బజార్ సినిమా చూపించినప్పుడు వాడికి అందులో ఉన్న మంచి మంచి డైలాగ్స్ వివరించి చెప్పడం జరిగింది. " శత్రు మిత్ర చరిత్ర జ్ఞానం కావాలి" అన్న డైలాగ్ అందులో ఒకటి. అప్పటి నుండీ మా వాడు తన ధర్మ సందేహాలతో చంపేస్తున్నాడు.
మా విశాఖ లో యీ మద్య చాలా చాలా కొత్త విగ్రహాలు వెలిశాయ్. కొత్తవి కావడం వలన కావచ్చు అవి తళ తళా మెరుస్తున్నాయి కూడా. వాటి పక్కనే ఉన్న పాత విగ్రహాలు వెలిసి పోయి ఉన్నట్టుగానే ఉన్నాయ్. అంతే కాదు సైజ్ లో కూడా అవి అంటే పాతవి చాలా చిన్నగానే ఉన్నాయ్. అంతవరకూ ఫరవాలేదు కానీ మా వాడు కొన్ని యక్ష ప్రశ్నలు అడిగి నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. వాటికి సూటిగా సమాధానం చెప్పడం నావలన కావడం లేదు కాబట్టి యీ పోస్ట్ చదువుతున్న పాఠక దేవుళ్ళు యెవరైనా సరైన సమాధానాలు చెప్పి నా బాధను కాస్త పంచుకొంటారని ఆశిస్తాను.
ఒక సెంటర్ లోని పార్క్ లో ఉన్న విగ్రహం పేరు అడిగాడు. అదేదో యీ మద్యే కాల ధర్మం చెందిన రాజకీయ నాయకుడిది కాబట్టి పేరు చెప్పాను. వాడికి వెంటనే పేరు చెప్పాను. "నాన్నా మరి యీ పేరు మా బుక్స్ లో ఎక్కడా లేదు అన్నాడు.
"ముందు ముందు యెక్కిస్తారేమోరా..." సమర్దించుకున్నాను.
" ఐతే ఆయన చేసిన కొన్ని మంచి పనులు చెప్పు"
పచ్చి వెలక్కాయ గొంతులో పడింది.
అంతే కాకుండా యెక్కువగా కనబడుతున్న ఒక దివంగత ముఖ్య మంత్రి విగ్రహాల గురించి కూడా అడిగాడు.
" నాన్నా మరి మన టీవీలో ..పేపర్లో వాళ్ళ అబ్బాయిని సీ.బీ.ఐ. విచారిస్తోందని అంటున్నారు కదా..."
"అవును...ఇంకా విచారణే కదరా...నేరం కొర్టులో ఋజువవ్వ లేదు కదా...." నా తెలివి తేటలకు నేనే మురిసిపోయాను.
"ఒక వేళ ౠజువైతే ..అవన్నీ కూల్చేస్తారా... ఐనా నాన్నా.. చిన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కన ఆయనకంత విగ్రహం పెడుతుంటే యెవ్వరూ యేమీ అనలేదా?"
చచ్చాను...యేమి చెప్పాలో తెలియలేదు. మళ్ళీ మా వాడే కొనసాగించాడు.
" మరి .....తాతయ్య.....ఆ తరువాత.........తాతయ్య మన వూరికి సర్పంచ్ లు గా చేసారని చెప్పావుగా..మరైతే వాళ్ళ విగ్రహాలు కూడా మన వూళ్ళో పెట్టేద్దాం...మన ఇంటి దగ్గర సెంటర్ ఖాళీగానే ఉందిగా...
అలా చేయకూడదని చెప్పలేకపొయ్యాను. అసలు నాదగ్గర సమాధానమే లేదుగా...అందరి లాగే నా చర్మం కూడా మందమైనదే...మహనీయులు ,చరిత్రను మలుపు తిప్పిన వారు..పోరాటాల్లో సర్వస్వం త్యాగం చేసినవారి చిన్న మట్టి కొట్టుకు పోయిన విగ్రహాల పక్కన బంగారపు రంగు పూతతో కొత్త విగ్రహాలు అలా వెలుస్తుంటే చూస్తూ నోరు విప్ప లేక పోయిన దౌర్భాగ్యుల్లో నేనూ ఒకడినే కదా.....
యేది యేమైనా మా వాడికి సహజంగా వచ్చిన తెలివితేటలు తగ్గించేయాలి..లేక పోతే చాలా ప్రమాదం. ఇలాంటి ప్రశ్నలు వాడి మనసులో పెరిగి పోతే ముందు ముందు వాడు బ్రతకడమే కష్టం. వాడి తెలివి తేటల్ని శుభ్రంగా తుడిచేసి .. ...చక్కగా మాంచి ఫౌండేషన్ కోర్స్ చెప్పే ......టెక్నో స్కూల్ లో పడెయ్యాలి.....
యెంతైనా నేనూ ఒక తండ్రినే కదా......

5, అక్టోబర్ 2011, బుధవారం

స్వచ్చత...ముందు ముందు ఎండ మావేనా

కళ్ళలో సన్నటి కన్నీటి  పొర. ఈ రోజు "కౌన్ బనేగా కరోడ్ పతి" ప్రోగ్రాం చూస్తున్నంత సేపూ అది ఆనందమో తెలియదు ...మరేదో తెలియదు ..ఒక నిజమైన భారతీయత మొత్తం ఆ మరాఠీ  రైతు రూపం లో ప్రత్యక్షమైంది. చాలా సార్లు యేదో ఒక పొర లో నుండి సమాధానాలిచ్చిన  ..ఇస్తున్న మనుషులను చూసీ  చూసీ ఉన్న  మా అందరికీ ఆ సమున్నత గ్రామీణ వ్యక్తిత్వం ...ఆ స్వచ్చత ...మాటల్లోని నిజాయితీ ..... యెక్కడో  కోల్పోతున్న మానవీయతను ఆ ఎపిసోడ్ చూసిన వారందరికీ రుచి చూపించింది. బహుశా  ఆ స్వచ్చతను యే పొరలూ లేకుండా మిగిలిన వారు మాత్రమే ఆఘ్రాణించగలనుకుంటాను. కేవలం విలువలే కాదు..యీ నాటి రైతాంగ జీవితంలోని కష్టాలను  ,కఠోర వాస్తవాలను సున్నిత మైన భాషలోనే చెబుతూ ..కష్టాలైనప్పటికీ వాటికి యెదిరొడ్డగల సరళ జీవన తత్వాన్ని ఆవిష్కరించిన  ఆ నిలువెత్తు మానవతా మూర్తి మాటలకు ...ఆ మహా కళాకారుడైన అమితాబ్ కూడా మంత్ర ముగ్ధుదయ్యాడనడం యెంత మాత్రం అతిశయోక్తి కాదు.
పట్టణ  జీవిత మసాళాలు మరిగిన వారికి తమాషా గా అనిపిచే వేషధారణతో.. .   ..అందులోనూ స్వచ్చమైన మరాఠీ రైతాంగ వేషధారణతో  వచ్చిన యీ వ్యక్తి ధైర్యం ముందు తమాషాగా అనిపించినా ..."యీ డబ్బుతో మీరేమి చేస్తారు " అన్న ప్ర్స్నకు ఆయనిచ్చిన సున్నిత సమాధానం యీ నాటి రైతాంగ జీవనాన్ని మొత్తం ప్రేక్షకులందరికీ వివరించగలిగింది. నాలుగు ఎకరాల వ్యవసాయంలో కేవలం 30000 రూపాయల ఆదాయం తెచ్చుకో గలిగే ఆ రైతు ఆకాంక్షలు ....ఒక్కొక్క చెక్కూ అందుకుంటన్నప్పుడు ఆ రైతు ..ఆయన భార్య ముఖంలోని ఆనందం చూస్తున్నప్పుదు కలిగిన భావాలను చెప్పడానికి ఇంతకంటే పది రెట్లు బలమైన భాష కావాలేమో. అంతే  కాకుండా సమకాలీన సామాజిక పరిస్థితుల గురించి " ఈ ఐదు కోట్లు రానియ్యండి సార్ ...ఒక్కక్కడి సంగతి చూస్తాను" అని అన్న అతడి మాటలు రానున్న కాలంలో రైతులు చేయబోయే గర్జన లా వినబడింది. ఆ కసి యీనాడు ప్రతి భారతీయ రైతు గుండెల్లో నిండి ఉన్నదే.

వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్ కావడం ప్రారంభంలో ఇబ్బందిగా ఉండేది కానీ రాను రాను అందులో కూడా కొన్ని కొన్ని ఆనందాలను కూడా  గమనించాను. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అయినప్పుడు  చుట్టు పక్కల రైతులతో తప్పనిసరిగా సంబంధాలు ఉంటాయి. ఎంతోకొంత రైతాంగ నేపధ్యం ఉంది కాబట్టి వారందరితో సంభాషించడం ...గాలి...నీరు..తో బాటు వాళ్ళ మాటల స్వచ్చతను కూడా సంపూర్ణంగా  ఆస్వాదించడం అలవాటుగా మారింది." బాబూ ...ఈ నాలుగు మామిడి పళ్ళూ ఉంచండి ..." అంటూ అప్యాయంగా వాళ్ళిస్తున్నప్పుడు తిరిగి వాళ్ళకేమి ఇవ్వాలో అర్దం కాని పరిస్థితి అనేక సార్లు ఎదురయ్యింది. ప్రభుత్వాలు స్వచ్చమైన నీటి కోసం పధకాలు తేవచ్చేమో కాని..స్వచ్చమైన మనసుల కోసం తేలేవుగా.....

ఆనందం అనేది సాపేక్షమైనదే అని ఇంతకు ముందు ఒక పోస్ట్ లో రాసిన గుర్తు. ఆ మాట ఎందుకంటున్నానంటే  ఈ టీవీలు..అంతర్జాలం ...సెల్ ఫోన్లు లేకమందు కూడా మనిషి ఆనందంగానే ఉన్నాడు. ఒక్కటే తేడా యేమిటంటే ఇంకొకరి ప్రమేయం లేకుండా మాత్రం ఆనందం పొందడమనేది ఇంచుమించు లేదనే చెప్పవచ్చు.  భోజన ప్రియులకు మాత్రం ఇది వర్తించక పోవచ్చు. కానీ యీనాటి యువతరం మాత్రం వారి వారి మూలాల గురించి యే కోశానా అలోచించలేని  మత్తులో ఊగి పోతున్నారు. యేమో ప్రతి జనరేషన్  తన తరువాతి జనరేషన్ గురించి ఇలాగే అలోచిస్తారేమో.. కానీ ఒక్కటి మాత్రం అనుభవంతో  చెప్పగలుగుతున్నాను.. నేను కాలేజ్ లోకి అడుగు పెట్టేసరికి బ్రతికి ఉన్న స్వాతంత్ర సమర యోధులు కూడా మమ్మల్ని చూసి గర్వపడే పనులు మేము కొన్ని చేసాం అని కొంత గర్వంగా చెప్పగలను . ఓక బలమైన గాలి వీచినప్పుడు రోడ్లు మీద మట్టి, ధూళి  మొత్తం యెగిరి పోతాయి. అప్పట్లో  యేదో ఒక ఉద్యమ గాలి ఉండేది కాబట్టి  కొంతైనా మనసులలో ఉండే చెత్త పోయి కొత్త భావజాలాలతో  శుభ్ర పడుతూ ఉండేవేమో. ఇప్పుడు ఉద్యమమే పెద్ద మార్కెట్ సరుకై కూర్చుంది. ఆ పాట యెవరు రాసారో గుర్తు లేదు కానీ "పూజ" సినిమా లోనిది అనుకుంటా. " నిప్పు రగిలి జ్వాల రేగ నీళ్ళ వలన ఆరును..నీళ్ళలోనె జ్వాల రేగ మంట యెటుల ఆరును"... 

పిల్లలలో ఒకటి  చూడవచ్చు. సాధారణంగా వాల్లకిస్టమైన పదార్ధాలు మితం లేకుండా తింటూ ఉంటారు. వాళ్ళకిష్టం లేనివి ముట్టరు. మా బంధువుల పిల్లలు చాలామంది ఆకు కూరలు ముట్టరు. అలా అనడం కంటే వాళ్ళ పెద్దలే వారిని అవి తినడానికి ప్రోత్సహించరు. యెందుకంటే అవి వీళ్ళకు కూడా పెద్దగా రుచించవు కాబట్టే. కానీ  మా ఇంటికి వచ్చి నప్పుడు మాత్రం మా ఇంట్లో ఉన్న కొద్ది కాలం లోనే నెమ్మదిగా అలవాటు పడతారు. ఇదే విషయం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. మన ఉపఖండానికున్న ప్రత్యేక పరిస్థితుల వలన మొత్తం సమాజం అనేక పొరల దొంతరగా మారి పోయింది. మనుషులు తమ స్వార్ధాన్ని కప్పి పుచ్చుకునేందుకు వాళ్ళు ప్రస్తుతం ఉండే పొరలను సునాయాసంగా పక్కన పెట్టి వేరే పొరల లోని భావాలను సునాయాసంగా అరువు తెచ్చుకోగలుగుతున్నారు. కంప్యూటర్ మీద మరీ ముఖ్యంగా ఆటో కేడ్ అనే సాఫ్ట్ వేర్  వాడే వాళ్ళకు యీ పొరల గురించి మంచి అవగాహన ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ గా చెప్పుకోవాలంటే స్వచ్చత అంతే నీవు ప్రస్తుతం ఉన్న పొర తాలూకు భావ జాలాన్ని మాత్రమే అన్ని వేళలా విశ్వసించడం.