1, మే 2012, మంగళవారం

వేరే ప్రపంచపు వాసనలు

స్థలం: వెయిటింగ్  హాల్ ,ఐ.ఐ.ఎం.కలకత్తా
పీ.జీ.డీ.యెం. కోర్స్ కు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయ్. అదృష్టమో... యేంటో తెలియడం లేదు....కార్పొరేట్ నాయకులను తయారు చేసే కార్ఖానా లోకి అడుగు పెట్ట గలిగాను ..మా అమ్మాయికొచ్చిన కాట్ స్కోర్ వలన.       
"అదేంటమ్మా....అలా బిగదీసుకుపోయి ఉన్నారేంటి..?
మా అమ్మాయిని అడిగాను..అక్కడకొచ్చిన యువతీ యువకులను చూసి....
"వూరుకో నాన్నా...మన తెలుగు వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ .....టెన్షన్ వలన ముఖాలు అలానే ఉంటాయి.... "
"టెన్షన్ యెందుకమ్మా.....వీళ్ళడిగిన కట్ ఆఫ్ మార్కులకి బయట కూడా మంచి ఉద్యోగాలో....వేరే కాలేజ్ లలో గాని సీట్ దొరుకుతుంది కదా...,ఇంత గొప్పవి కాక పోయినా ఉద్యోగానికైతే ఢోకా ఉండదు కదా......."
"ఇప్పుడవన్నీ యెవరూ చూడరు నాన్నా...ఇక్కడ వచ్చే పేకేజ్ రేంజ్ వేరు."
నిజమేనేమో.....కాంపస్ల లోనే ఉద్యోగాల సెలెక్షన్ అంటేనే మా టైం లో పెద్ద ఆశ్చర్యం.
యే.సీ. బాగానే పని చేస్తుంది. అయినా చాలా మంది ముఖాలకు  చెమటలు  పడుతూనే ఉన్నాయి. మధ్యలో లేచి టాయిలెట్ కి వెళ్ళి వస్తున్నారు. ఇంటర్వ్యూ దగ్గర పడ్డ వారు సూట్ సరి చేసుకుంటున్నారు.
"నీవు కూడా సూట్ వేసుకోవలసింది పప్పీ ...."
శ్రీమతి మా అమ్మాయికి సలహా యీయబోయింది.
"వూరుకోమ్మా...బయట ఉక్క యెలా చంపేస్తుందో చూడు.. నా ఒంటికి యేది హాయి అనిపిస్తే అది వేసుకుంటాను...."
మా అమ్మాయి ఖయ్యిమంది.
నిజానికి ఆ మాటలో చాలా విలువుందనిపించింది. మనకు నచ్చినట్టుగా మనం ఉండడానికి మించిన ఆనందం ఏముంది ? హుందాతనానికి సూట్ వేసుకోవడమొక్కటేనా మార్గం? నిజానికి సూట్ వేసుకున్నందుకు ఒక్క మార్క్ యెక్కువ వేసినా అది ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ బానిస బుద్దికి నిదర్శనం మాత్రమే అవుతుంది.
ఎందుకో నాకు ముందు నుండీ కొన్ని సందేహాలు ఉంటూ ఉండేవి.ఈ కాలేజ్ అంటే ఐ.ఐ.ఎం. లాంటి విద్యా సంస్థలు కార్పొరేట్ లీడర్లను మాత్రమే  తయారు చేస్తాయా... ? నిజమే 1500000 ఫీజ్ కట్టి సమాజానికి పనికి వచ్చే చదువు ఎందుకు చదవాలి?
ఇక్కడే ఇంకొక సందేహం కూడా వస్తుంది. సామాజిక ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలకు దూరంగా ఎందుకు ఉండాలి?
మా అమ్మాయికి ఫైనల్ సంవత్సరపు పరీక్షలు లాంటివి యెక్కువగా ఉండడంతో మంచి మంచి టాపిక్ పై ఆర్టికల్స్ కోసం నేను ఎక్కువగా చదివాను. మొత్తానికి మా అమ్మాయికి ఎలా ఉన్నా గానీ నా జ్ఞానాభివృద్దికి బాగా ఉపయోగపడింది.
అలా చదువుతున్నపుడే కొన్ని కొన్ని విచిత్రమైన విషయాలు కూడా తెలిసాయి. ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటి టాపిక్స్ గురించి చూస్తున్నప్పుడు హ్యూమన్ హేపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటుందనీ.....దానిలో కూడా రాంక్స్ ఉంటాయనీ వాటికీ హ్యూమన్ డెవలప్మెంట్ లో ఇచ్చిన రాంక్స్ కు చాలా వత్యాసాలు ఉన్నాయనీ....
అంటే డెవలప్మెంట్ అనేది అన్ని వేళలా సంతోషాన్ని సృష్టించదని చాలా స్పష్టంగా అంకెలతో నిరూపితమయ్యింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన పక్కనే ఉన్న చిన్న రాజ్యం భూటాన్ అత్యంత సంతోషంగా జీవించే దేశాల  జాబితాలో 8 వ రాంక్ లో ఉంటే అమెరికా 22వ రాంక్ కు పరిమిత మయ్యింది. మరి మనకు ఆనందం కావాలా....అభివృద్ది కావాలా...కొంతమందికే ఫలాలు దక్కే అభివృద్ది మనకు అవసరమా.....
అలాగే ఒక ఉత్తమమైన వ్యాపారమంటే ఏమిటి ......అనేదానికి నిదర్శనంగా నిలిచిన ఆర్చిడ్ హోటల్ దానిని ఆ స్థానంలోకి తెచ్చిన వెంకటేష్ కామత్ భారత వ్యాపార ప్రపంచానికి ..అలాగే  యావత్ ప్రపంచ  వ్యాపార సామ్రాజ్యాలకు అందించిన సందేశం ...అనేక విషయాల గురించి మా అమ్మాయి బాగా చదివింది కానీ వాటి మీద మా అమ్మాయినే కాదు ఆ రోజు ఇంటర్వ్యూ లో యెవరినీ అడగలేదు...మరొక రోజు ఎప్పుడైనా అడిగారేమో తెలియదు. అత్యుత్తమమైన మూడు కాలేజ్ ఇంటర్వ్యూలు చూసిన తరువాత నాకనిపించిందేమిటంటే ఆ ఇంటర్వ్యూల కెళ్ళే వాళ్ళు జ్ఞానాని కన్నా అదృష్టాన్ని నమ్ముకుని వెళ్తే ఉత్తమమని.
అక్కడ అటెండ్ అవుతున్న వాళ్ళని చూస్తే ఎందుకో గాని నాకు గోదావరి తీరంలో ఉన్న మా స్వంత వూరికి వెళ్ళినప్పుడు .."యేరా అబ్బాయి..ఇదేనా రావడం..అంటూ పలకరించే  మా నాన్న గారి అన్నదమ్ములు... ఎండని పడి వచ్చావ్..కాళ్ళు కడుక్కో ..భోజనం చేసేద్దువు కాని..అంటూ పీట వాల్చి పళ్ళెం పెట్టే మా పెద్దమ్మలు...పిన్నమ్మలు...మిగిలిన బంధువుల అప్యాయంతో కూడిన పలకరింపులు..వ్యవసాయాలు కిట్టక పోయినప్పటికీ యెండల్లో పడి పనిచేసి ఇంటికి వచ్చి భోజనం కానిచ్చి కాస్త నడుము వాల్చి ..లేచిన తరువాత తుండు భుజాన వేసుకుని పొలానికి పొయ్యే ఆ కర్మ యోగులు మనసులో మెదిలారు. వీళ్ళ స్థాయికి  వాళ్ళు ఏనాటికీ రాలేక పోవచ్చు.....
ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న కాంటీన్ కు వెళ్ళి యేవేవో ఆర్డర్ చేస్తున్నారు. ఇంచుమించు అందరి చేతుల్లోనూ...సాండ్విచ్చెస్ ..కోలా బాటిల్స్... పక్కనే ఫ్రిజ్ లో పడి ఉన్న అమూల్ బటర్ మిల్క్ బాటిల్ ను పాకెట్స్ ను వెనక్కి పడేసి ఆ కాంటీన్ కుర్రాడు కోలా బాటిల్స్ ను ఫ్రిజ్ లో సర్దుతున్నాడు......మేము నెమ్మదిగా బయట పడ్డాం.                     
                 
   

7, మార్చి 2012, బుధవారం

మరొక్క సారి హనుమంతుల వారు పూనితే....

అప్పటి ఉత్తేజం ఎక్కడికి పోయింది ?                       

                           నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు తణుకు  లో అప్పుడప్పుడు సీ. పీ ఐ. ఆఫీస్ కు వెళ్తుండే వాడిని. అప్పటికి అదే వారి ప్రజా సంఘాలకి కూడా కేంద్రంగా ఉండేది. నేను చాలా సార్లు ఒక వ్యక్తిని అక్కడ చూస్తుందే వాడిని. అక్కడే తనకున్న సమయమంతా గడుపుతూ మము మాట్లాడుకునే మాటలన్నీ చాలా శ్రద్దగా వింటుండే వాడు. కొద్దికాలానికే అతడు అక్కడ ఒంటెద్దు బళ్ళ సంఘానికి నాయకుడని తెలిసింది. మేమొద్దని అంటున్నా కూడా అప్పుడప్పుడు వెళ్ళి టీలు కూడా తెస్తుండే వాడు. యీ పోస్ట్ రాసే ఉద్దేశం కలిగిన నాటి నుండీ అతడి పేరు గుర్తుకు తెచ్చు కోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ సఫలీకృతుడను కాలేక పొయ్యాను. మన అవసరం కొద్దీ అతడి పేరు పద్దయ్య అనే అనుకొందాం. సరే మనకు పేరుతో అంత పని లేదు కానీ అతడి గురించి ఆనాటికి మా గురుతుల్యులు శ్రీ ( నిజంగా ఐతే కామ్రేడ్ అని సంభోదించాలి)  భూపతి రాజు సుబ్బరాజు గారు చెప్పిన కొన్ని సంగతులు నేనెప్పటికీ మరిచి పోలేను. చాలా సంవత్సరాల ముందు జరిగిన ఒక సంఘటన...... ఆ సమయంలో మన పద్దయ్య చూపిన తెగింపు గురించి ఆయన ఒక సారి చెప్తుంటే మేము ఆశ్చర్య   పోక తప్పింది కాదు.  ఆ రోజుల్లో తణుకు లో చదివి విదేశాలకెళ్ళిన విద్యార్థి ఒకరు స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్త....అభ్యుదయ భావాలున్న వాడు. అతడికి విదేశాలకు వెళ్ళేటప్పుడే అతడి దగ్గరి బంధువుల అమ్మాయితో వివాహం నిశ్చయం చేసి అక్కడికి పంపించారు. అంతా బాగానే ఉంది గాని ఆ వూరికి అప్పట్లో ఒక స్వామీజీ వేంచేయడం....వారిని వూళ్ళో  ఉన్న ఉనంత వర్గాల వారంతా ప్రతిదినం  సేవించుకోడానికి  పోటీ పడడం జరిగింది. సినిమాల్లో చూపినట్లుగానే ఆ స్వామీజీకి ప్రతిరాత్రీ శ్రీకృష్ణులు  వారు పూనేవారట. ఆ సమయంలో వారు కొంత మందికి యేకాంత సేవ కూడా అనుగ్రహించేవారట. ఇంతవరకూ యీ భారత దేశం లో అన్ని చోట్లా జరిగే  విషయమే కానీ యెప్పుడైతే తమ తోటి విద్యార్థి చేసుకోబోయే అమ్మాయికి  కూడా స్వామీజీ వారు యేకాంత సేవ అనుగ్రహించడంతో కధ అడ్డం తిరిగింది. వాళ్ళంతా కలసి ఒక పధకం వేసారు. యేకాంత సేవ అనుగ్రహించిన రోజున భజన ప్రారంభం అయ్యింది.స్వామి వారికి యధావిధిగా శ్రీకృష్ణులు  వారు పూనేసారు. చుట్టూ చేరిన భక్తులంతా పారవశ్యంతో ఊగి పోతుండగా ఆ సంఘటన జరిగిన ఆ సంఘటన అందరినీ నోట మాట రానీయకుండా జరిగింది. పద్దయ్య " ఓరీ కృష్ణా..నీవిక్కడ ఉన్నావా..... "అంటూ వచ్చి  బండ రాయితో స్వామి తల మీద అడ్డంగా  ఒక్కటిచ్చాడు. పెద్దలంతా తేరుకొనేసరికి కుర్రాళ్ళంతా బిల బిల మంటూ లోపలకు వచ్చేసారు పద్దయ్య వెనుకే......" అతడు పద్దయ్యే కానీ సాయంత్రం అయ్యేసరికి అతడికి హనుమంతుడు పూనుతున్నాడ నీ.... శ్రీకృష్ణుల వారికీ ..యీయనకూ పాత తగువులు యేవో ఉన్నాయనీ.....అందుకు హనుమంతులు వారు శ్రీకృష్ణుల వారికోసం వెతుకుతుంటే అడ్రసు ఇప్పటికి దొరికిందనీ....." వాదించడం మొదలు పెట్టారు. యీ లోపులో స్వామి వారిని హాస్పిటల్ కి కూడా తీసుకెళ్ళ వలసిన అవసరం కూడా ఉండడంతో వారి వెంటే కొంత మంది భక్తులు వెళ్ళారు. విద్యార్థులంతా పోలీస్ కేస్ కు కూడా రెడీ అన్నారు. పరువు పోతుందనే భయంతో స్వామి వారు యే కంప్లైంట్ ఇవ్వ లేదు. పాపం ఆ విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళ లో చదవ లేదు కాబట్టి కాస్త ఆలోచనా  శక్తి...సమాజాన్ని ముందుకు నడిపే బుద్ది ఉన్న వాళ్ళు.

ఇదంతా జ్ఞాపకం రావడానికి  ముఖ్య కారణానికి ఇప్పుడు వద్దాం. 


 సిద్దాంతాల రచ్చ లోకి నేను వెళ్ళ దలుచు కోలేదు ...ఒక రాజకీయ ఆల్టర్నేటివ్ యేర్పాటు చేయడంతో బాటు ఒక హేతుబద్ద ఆలోచనను కొంతైనా  సమాజంలో అభివృద్ది చేయడంలో ఆ నాడు కమ్యూనిష్టులు కృతకృత్యులయ్యారు. ఆ పార్టీలు స్వతంత్రంగా ఉన్నంత సేపూ వాటి ప్రజా సంఘాలు కూడా యెంతో కొంత తమ పాత్రను పోషిచగలిగాయి. అడవి బాట పట్టిన వారిని మినహాయిస్తే పబ్లిక్ లో మిగిలిన యెర్రదనాన్ని ముందు పసుపు రంగు...ఆ తరువాత మూడు రంగులు......మరలా పసుపు రంగు......మింగేసిన తరువాత.....మిగిలిన దాన్ని కూడా ఇంకే రంగు మింగేస్తుందో తెలియక జనం ఇప్పటికే తికమక తో చస్తూ.....ముందు నొయ్యి..వెనుక గొయ్యి..చందాన ఉన్న రాజకీయాలలో గత్యంతరం లేక తమకున్న  హక్కుని ఉపయోగించుకొనే తాపత్రయంతో మాత్రమే వోటు వేయవలసిన పరిస్థితి మాత్రమే ఉంది.  
 

1, మార్చి 2012, గురువారం

మెట్లమీది నుండి దొర్లుతున్న చెంబు.....



   ఇంటికి వచ్చి చెప్పులు విప్పానో.... లేదో భార్యామణి మొదలుపెట్టింది
" క్రింద ఫ్లాటావిడ  వచ్చింది నిన్ను కలవడానికి" 
కొత్తగా ఫ్లాట్ కొనుక్కుని వచ్చారు క్రింద ఒక ఫామిలీ  
"ఎందుకట?" కాజువల్ గానే అడిగాను
" వాళ్ళకేదో మొక్కుబడి ఉందట....వచ్చే సోమవారం కంచర పాలెం లోని పైడితల్లమ్మ  గుడి లో నుండి విగ్రహాన్ని వూరేగింపుగా మేళ తాళాలతో తీసుకుని వచ్చి కొంత సేపు ఇంట్లో  వుంచి కొంత సేపైన తరువాత సాగనంపుతారట" 
యీ విధమైన మ్రొక్కులు ఉంటాయని వినడం మొదటి సారి నాకు. కొంచెం అలసటగా ఉండడం వలన వెంటనే ఆ విషయం  గురించి ఆలోచించ లేక పొయ్యాను. వేడి వేడి టీ తాగి స్నానం చేసి వచ్చే సరికి సరికి టీవీ లో "చక్ దే" సినిమా చూస్తున్నాడు మా సుపుత్రుడు. మొత్తంగా కాక పొయినా ఆ సినిమా లోని చాలా సన్నివేశాలు నన్ను అనేకసార్లు టీవీ కి కట్టి పడేసాయ్. కాబట్టి సహజంగానే మరలా కొంత సేపు టీవీ కి అతుక్కుని పోయాను. 
" రేపు యెదో ఒకటి చెప్పాలి...పొద్దుటే ఆయన కూడా వస్తారట..." మా శ్రీమతి  మరలా ఆ విషయాన్ని  కదిపింది. దీనికి పెద్దగా ఆలోచించేదేముంటుంది. ఇలాంటి సమస్యలు ఇంతకు ముందు కూడా వచ్చాయి ....అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మిగిలిన వాళ్ళందరితో చర్చించి ఒక తీర్మానం కూడా చేయించగలిగాను. పైన అంతకు ముందే ఒక బెంగాలీ క్రిష్టియన్ ఫేమిలీ కూడా కొత్తగా వచ్చినప్పుడు ఇంట్లో ప్రేయర్ పెట్టుకోడంతో బాటు మైక్ పెట్టినప్పుడు వారికి సున్నితంగా వివరించి దానిని కట్టి వేయించడం జరిగింది. అలాగే ఒక సాయిబాబా భజన కూడాను...  
"కొత్తగా ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు లోకల్ గా పవర్ ఫుల్ ఫేమిలీ అంట..ఇక్కడంతా వాళ్ళ కమ్యూనిటీ యే నంట..."
చిన్న హెచ్చరిక లాంటిది చేసింది ... శ్రీమతి. 
నాకు యాదాలాపంగా యీ మధ్యనే చదివిన "గాంధీ అనంతర భారత దేశం (రామ చంద్ర గుహా)"  గుర్తుకు వచ్చింది. నిజానికి పరిమాణ రీత్యా ఆ నాడు రాజీవ్  గాంధీ కి వచ్చిన విపత్తుకి ...యీ నాడు మాకు వచ్చిన విపత్తు కి యే మాత్రం పొంతన లేక పోయినా మా యీ చిన్న ప్రపంచానికి ఇది కూడా ఒక సమస్య అవుతుందేమోనన్న హెచ్చరిక కనబడింది నాకు మా శ్రీమతి మాటల్లో. కొన్ని ఉప యెన్నికల్లో వోటమి వచ్చినంత మాత్రాన లోక్ సభ చరిత్ర లోనే అత్యంత సంఖ్యా బలం సాధించిన  చరిత్ర ఉన్న ఆయన "షాబాను" విడాకుల భృతి విషయంలో ఒక మైనారిటీ మతస్థుల లోని  చాందసులకు ఎలా లొంగి  పొయ్యేడో ...ఆ వెంటనే మెజారిటీ మతస్థుల వోట్ల కోసం ఆయన చేసిన పనులు.......అవన్నీ భారత దేశాన్ని యీ నాడు యే పరిస్థితికి దిగ జార్చాయో అంతా చూస్తూనే ఉన్నారు.
మరలా నా ఆలోచనలు మా ఫ్లాట్ సమస్య వైపు మరలాయి. నేను ఒక స్థిర నిర్ణయానికి వచ్చాను.  మొత్తానికి మా ఇరవై ఫ్లాట్స్ కి ఒక ఖచ్చితమైన రూల్స్ మైంటైన్ చేసి తీరాల్సిందే. యీ విషయమే అందరికీ చెప్పేస్తాను. ఒక వేళ లోకల్ వాళ్ళని మిగిలిన వాళ్ళు భయ పడితే వేరే నిర్ణయం మిగిలిన వాళ్ళనే చేయనిస్తాను. బయటి శక్తులకి భయపడి సిద్దాంతాల విషయంలో రాజీ పడి నేను న్యాయ విరుద్దమైన పనికి నేను సహకరించ లేను కాబట్టి నేను నా పదవికి వెంటనే రాజీనామా ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నాను. ఇదేమైనా దేశ ప్రధాని  పదవి కాదుగా ....


మరలా పాత సంఘటనలన్నీ యెందుకో గుర్తుకు రావడం మొదలయ్యింది. బాబ్రీ మసీదు  కూల గొట్ట బడినప్పుడు మేము హైదరాబాద్ లోనే ఉన్నాం. కర సేవకులు దేశం నలు మూలల నుండీ కదులుతున్నారన్న వార్తలు ముందునుండీ ఉన్నాయి కాబట్టి కేంద్రం సరైన యేర్పాటులతోనే ఉంటుందని అందరం వూహిస్తూ ఉండే వాళ్ళం. బహుశా యీ దేశ జనాభాలో పాలకుల నిజాయితీ మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడూ అలానే ఆలోచించి ఉంటాడు.  మొత్తానికి నిజాయితీ మీద నమ్మకమే దెబ్బతిన్నది. ప్రతి పక్షాల అమ్ముల పొదిలోనుండి ఒక ప్రధాన ఆయుధం నిరుపయోగం కానున్నదని పాలక పక్షం ....ఒక గొప్ప చారిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వర్తించిన  ఘనత (పైకి చెప్పక పోయినప్పటికీ ) తమకి ఉండిపోతుందని కీలక పాత్ర వహించిన ఘన మైన ఒక ప్రధాన ప్రతిపక్షం ...యెవరి ప్రయోజనాలు వారు వూహించుకొన్నారు. మిగిలిన మతాల పురాణాల గురించి నాకు అంతగా తెలియదు కానీ హిందువు అన్నవాడు ప్రతి ఒక్కరూ భాగవతాన్ని  విధిగా చదువుతారు. మాకు వూహ వచ్చేటప్పటికే కంఠస్థం  అయిన పద్యం "ఇందుగలడందు లేడని......" . బహుశా ఇది అన్ని భాషలలోనూ ఉంటుందనే అనుకుంటున్నాను. మరి అన్ని చోట్లా భగవంతున్నాడని నమ్మిన మతం లో పుట్టిన మనం (హిందువులం) పాలక వర్గాల కుట్రలకు బలవ్వడం యెంతవరకూ సబబు ? బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యం లో జరిగిన గోద్రా ఘటన... తదనంతరం గుజరాత్ లో జరిగిన మారణ హోమం ఎవరి మూర్ఖత్వ ఫలితం? పోయిన నెల 27 తారీఖున హిందూ లో పడిన ఆర్టికల్ .....1984 లో ఢిల్లీ  లో  సిక్కుల ఊచ కోత కు సంబందించిన సాక్షుల  వీడియో రికార్డింగ్ లు ఒక్క సారి చూడండి. మన సమాజంలో మిగిలిన మానవతా శాతాన్ని కొలిచి చూపుతాయ్. ఒక కుటుంబంలో పెద్దన్న యెప్పుడూ సహనంతో మిగిలిన వారిని చక్క దిద్దుతాడు. అప్పుడే ఆ కుటుంబం పదిమందికీ ఆదర్శ వంత మవుతుంది. యీ ప్రపంచ దేశాలలో మనకొక గౌరవ స్థానం కావాలన్నా .......మనం ప్రశాంతంగా అభివృద్ది మార్గం లో నడవాలన్నా......మూర్ఖత్వం  ఉన్న వాళ్ళని మన మధ్య లో నుండి గెంటి వేయడం ఒక్కటే సరైన మార్గం. ఒక చిన్న ఉదాహరణని ఇక్కడ ప్రస్తావించడం తప్పని సరి . మా అపార్ట్మెంట్ ఒక కూడలి లో ఉంది. రెండువైపులకి ఒక ప్రధాన రహదారి...మిగిలిన రెండు వైపులకూ 20-30 అడుగుల రోడ్లు ఉంటాయ్. యీ 20-30 అడుగుల రోడ్లలో కూడా యెప్పుడూ చాలా ట్రాఫిక్ ఉంటుంది. మా పక్కనే ఉన్న ఇరుకు రోడ్ లో ఒక రోజు యేదో మార్కింగ్ చేయబడి ఉంది. మేము పెద్దగా పట్టించు కోలేదు. మరునాడే అక్కడ తవ్వడం ప్రారంభించ గానే మేమంతా వెళ్ళాం. ఆ తీస్తున్న గోతులు ట్రాఫిక్ కు పెద్ద అవరోధంగా మారాయి. మేము ఆ పనిని ఆపగానే ఒక ఆర్గనైజర్ల బృందం అక్కడ తయారయ్యింది.వాళ్ళు వివరించినదేమిటంటే ఆ వీధి లోపల ఒక గుడి ఉన్నదట . దాని ముఖద్వారం నిర్మాణం  చేయాలని వాళ్ళంతా సంకల్పించారట." మరి ట్రాఫిక్..." అని మేమడిగితే "మేమంతా మీకంటే ముందు నుండీ ఇక్కడ ఉంటున్నాం సార్...సమస్యలు మాకు కూడా తెలుసు..... దైవ కార్యానికి అడ్డు రాకండి..." అంటారు. మొత్తం మీద సమాజం యెలా తయారయ్యిందంటే..పై వర్గాల వారికి సమాజానికి యేమైనా చేయవలసిన అవసరం లేదు. దిగువ మధ్య తరగతి నుండి క్రింద వరకూ యేదైనా మంచి పని చేయడ మంటే వినాయక చవితి కి..దసరాకు  పందిళ్ళు వేయించి మైక్ సెట్లు పెట్టి ఆఖరి రోజున ఒక ఊరేగింపు జరపడం తో సరిపోతోంది. మొతానికి యీ మైకుల గోల లేని సౌండ్ ప్రూఫ్ కాలనీ లు.......యీ గోలతో సరిపెట్టుకొని  ..ఆనందించగలిగే స్థాయి వారి   కాలనీ లు గా నగరాలు విడి పోతూనే ఉన్నాయ్. ఇవేమీ యువతకు పట్టకుండా మీడియా...సినిమా వర్గాల వారు ...అందరికీ మించి కార్పొరేట్ స్కూల్/కాలేజ్ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.  ఒక ప్రాంతంలో ఒక మత ..కుల ఘర్షణ తలెత్తితే వాటి నివారణకు  తాము యెవరి పక్షం వహించాలనే దిశా నిర్దేశం నేటి యువతకు యెవరైనా యీయ గలుగుతున్నారా... ? 


నా దురదృష్ట  వశాత్తూ లాల్ బహాదూర్ శాస్త్రి గారి గురించి పెదగా చదవ లేదు. ఒక విజన్ ఉన్న నాయకత్వం ..హుందా తనం నెహ్రూ తోనే అంతరించి పోయిందనుకో వచ్చు. విజన్ ఉన్న నాయకుడికీ లేని నాయకుడికీ ఉన్న ప్రధాన మైన తేడా యేమిటంటే విజన్ ఉన్న నాయకుడు తన సిద్దంతాలతో ప్రజలను..సమాజాన్ని ముందుకు నడిపిస్తాడు. విజన్ లేని వాడంటే  ప్రజలలో అణగారి పోతున్న మూర్ఖత్వాన్ని  పైకి లేపి తద్వారా వాళ్ళని ..సమాజాన్ని ...వెనక్కు నెట్టి తన ప్రయోజనాల తో ముందుకు పొయ్యే వాడు. 


ఒక సారి అనుకోకుండా బలవంతంగానే మా కులాం వాళ్ళు ఎరేంజ్ చేసిన వన భోజనానికి వెళ్ళ వలసి వచ్చింది. ఒక మంచి ఆశ్రమాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ గా నేను అక్కడ అందరికీ పరిచయం చేయబడ్డాను. నా చుట్టూ చేరిన వారందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసాను. మన కులాన్ని మన ఒక్కళ్ళమే ఒక చోట చేరి పొగుడు కొంటే పెద్ద ప్రయోజనమేమీ ఉండదు.... అదే మనమంతా యేదైనా మంచి పని చేస్తే మనలను మిగిలిన వాళ్ళు కూడా పొగుడుతారు. ఇది యెంత మందికి యెక్కిందో తెలియదు కానీ ఇదే విషయాన్ని మిగిలిన కులాల వాళ్ళందరూ పాటిస్తే.....అసలు కుల పోరాటాలు ఉంటాయంటారా.....? ఇదే సూత్రం అన్ని మతాల వారికీ కూడా వర్తిస్తే......
ఒక్క విషయం యేమిటంటే న్యాయంగా.....కాస్తో కూస్తో....మానవత్వంతో అలోచిస్తూ వ్యాపారం చేసే వారికి మత మూర్ఖత్వం అవసరం ఉండదు. అలా కాకుండా కేవలం నెం.1 గా వ్యాపారంలో   మాత్రమే ఎదగాలునుకునే వారికి ప్రజల  మూర్ఖత్వం ఆయుధంగా మారుతుంది. అది తెలివైన వారు...విజ్ఞులు...గమనించి ప్రజలను చైతన్యవంతులను చేయాలి.


 ఇవన్నీ  యేవీ  చేయకుండా ..కొంత మంది ఒక హోం గార్డ్ ను చంపో....పొట్ట పోసుకోడానికి....కుటుంబాన్ని పోషించికొడానికో...ఉద్యోగం చేస్తున్న పోలీస్ ను చంపో ....సమాజంలో విప్లవానికి మార్గం చేస్తున్నామని భావించుకునుంటే మాత్రం వాళ్ళ సిద్దాంతాన్ని నమ్మి బలై పోతున్న వారిని చూసి జాలి పడడం తప్ప చేయగలిగేదేమీ ఉండదు.  

22, ఫిబ్రవరి 2012, బుధవారం

నా కొత్త ఆహ్వాన ..సన్మాన పద్దతులు(సీక్రెట్)

...నేను యెప్పుడైనా    ఇవెంట్ మేనేజర్  గా ఉద్యోగం చేయాల్సి వస్తే కొన్ని కొన్ని ఇన్నొవేటివ్   పద్దతులతో జనాలను యెలా ఆశ్చర్య చకితులను చేయాలా అని అలోచిస్తుండేవాడిని. అప్పట్లో  నాకున్న బ్రిలియేంట్ అయిడియాలలో ఒకటి యేమిటంటే యేదైనా పెళ్ళిలో అకాశం నుండి వధూవరులను దేవతలు దీవిస్తున్నట్లుగా  పైనుండి పూలవాన కురిపించే యేర్పాటు చేస్తే అమోఘంగా ఉంటుందేమోనని....ఆసలు ఇలాంటి  గొప్ప..గొప్ప అయిడియాలు నాకే యెందుకు వస్తాయోనని మురిసి పోవడం కూడా జరుగుతుండేది. కానీ అంతటి భారీ వివాహ మహోత్సవాన్ని నిర్వహించే అదృష్టం  నాకు ఇంకా కలగ లేదు కాబట్టి నా కలల్లోని యీ  మహోన్నత ఘట్టాన్ని ప్రజలు వీక్షించే రోజు  ఇంకెప్పుడా అని అప్పుడప్పుడు  కొద్దిగా చింతించడం కూడా యెక్కువైన యీ తరుణంలో ఇంత త్వరగా నా యీ కోరిక తీరినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. యీ మద్యనే కొత్తగా  మా జిల్లా నుండి మంత్రివర్యులైన ఒక రాజకీయ నాయకునికి ఘనాతి ఘనమైన ఆహ్వానం పలకటానికి హెలికాప్టర్ నుండి  పూల వాన కురిపించారని తెలిసి ఆ మహత్తర దృశ్యాన్ని కనులారా చూచి తరించలేక పోయినందుకు కొద్దిగా బాధ పడ్డాను కూడాను . నా ఇన్నొవేటివ్  అయిడియాను నాకంటే ముందుగానే ప్రపంచానికి చూపించినందుకు ఒకింత అసూయ కలిగినా నాలాంటి బ్రిలియంట్ లకు ఇది మంచి సీజన్ లా కనబడుతుంది. అకాశాన్నుండి  పువ్వులు కురిపించేకంటే మంచి ఇన్నొవేటివ్ ఐడియా మనసులోకి తొంగి చూస్తోంది. ఒకసారి షార్ లో  ఉన్న నా ఫ్రెండ్ కి ఫోన్ చేయ్యాలి. అయ్యయ్యో నా ఐడియా ఇలా బయట పడిపోతుందేమిటి ? నేనసలే రాజకీయ పామరుణ్ణి. పెద్దగా సామాజిక శాస్త్రాలు    చదువుకున్న వాడిని కూడా కాదు. అందుకే ఆ మంత్రివర్యులకు యెందుకింత ఘనమైన ఆహ్వానాన్ని పలికెరో కనుక్కుందామని ఆ ఆహ్వాన కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన కొంత మంది ఆఫీస్ సహచరులని కూడా అడిగాను కానీ నాకు సరియైన సమాధానం మాత్రం దొరక లేదు. నేను ముందే విన్న వించు కొన్నట్లుగా నాకు కొన్ని విషయాల పరిజ్ఞానం మరీ సున్నా. ఆయన యెదైనా రైతు సమస్యల మీద కానీ మరేదైనా సమస్యల మీద కానీ ఉద్యమాలలో పాల్గొన లేదని మాత్రం వాళ్ళు చెప్పుకుంటుండగా విన్నాను. యెన్నెన్నో ఉద్యమాలలో పాల్గొని కేవలం ప్రజా స్రేయస్సు కోసమే మంత్రి పదవి చేపట్టిన ధన్య జీవులెవ్వరికీ దక్కని ఆహ్వాన మర్యాదలు  వీళ్ళకు యెందుకు దక్కుతున్నాయన్న నా సందేహాన్ని నా స్నేహ వర్గంలో కొంత విజ్ఞుడని పేరున్న వాడిని అడిగాను.
" ఓరి  పిచ్చి మొహమా...వీళ్ళూ ప్రజా నాయకులే ..వారూ ప్రజా నాయకులే... కానీ యే ప్రజల నాయకులన్న విషయంలోనే అసలు విషయ ముంది." 
నాకు యే మాత్రం బోధపడ లేదు.
" మరి జనం వోట్లు వేసి గెలిపించారు కదరా..." నా సందేహాన్ని వ్యక్త పరిచాను.
" వోట్లు వేయక చస్తారా... యెవరో ఒకరికి వేయడమొక్కటే వాళ్ళకు తెలిసింది...సమాజం లో యే సిద్దాంతానికీ  విలువ లేదు. అసలు సిద్దాంత  మంటే యేమిటో  జనాలకు తెలియదు. పై వర్గాలకు కావసినది కూడా ఇదే..కులానికి సామాజిక వర్గం అని ముద్దు పేరు పెట్టారు. సిద్దాంత రాజకీయాలు పూర్తిగా అంతరించి పొయ్యాక ఇక రాజకీయాల్లో కులాల సమీకరణాలే  మిగులుతాయి. కాబట్టి ప్రతి నియోజక వర్గానికి ఒక్కొక్క ఒక్కొక్క సమీకరణం ఉంటుంది. మీడియా వారు కూడా కాండిడేట్స్ యే యే సామాజిక వర్గానికి చెందినవారో....ఆ వర్గం యొక్క వోట్స్ ఆ నియోజక వర్గంలో యెన్ని ఉన్నాయో చక్కగా అనాలిసిస్  లు రాస్తారు. ఒరేయ్ నీకివన్నీ అర్ధం కావు కానీ నన్ను వదిలి పెట్టు" అని వాడు వెళ్ళిపో బొయ్యాడు.
నేనంతగా ఓడిపొయ్యే రకం కాదు.
" మరైతే నేను రోదసీనుండి  పువ్వులు జల్లే కార్యక్రమాన్ని నేను ఒక వేళ అక్టోబర్ 2 న మన సెంటర్ లో ఉన్న గాంధీ విగ్రహంతో ప్రారంబిస్తాను.." నాలో దాచుకొన్న ఇన్నొవేటివ్  ఐడియా ను బయటకు కక్కానన్న బాధ మొదలవకుండానే వాడు నా మొహంలోకి విచిత్రంగా చూశాడు.
" ఒరేయ్...ఆయన యే బిజినెస్ మేన్ కు గాని....కాంట్రాక్టర్లకు గానీ యే హెల్ప్ కూడా చేయలేదు... చేయలేడు .మరి ఫండ్స్ యెక్కడ నుండి తెస్తావ్రా......ఇంకొక విషయం  కూడా చెబుతున్నాను ఆయన సామాజిక వర్గం కూడా పెద్ద సంఖ్య లో లేరు......అంతే కాదు మరే జాతీయ నాయకుడికీ నీవేమీ చేయలేవు. "
వాడింత చెప్పిన తరువాత కూడా నేను నా లోని కళ..వ్యాపారాన్ని...( నాలో ఉన్నదేమిటో నాకే తెలియదనుకొండి......) ఇంకా యెందుకు వేస్ట్ చేసుకుంటాను....మరలా ఎలక్షన్స్ ఎలానూ వస్తాయ్....అప్పుడైనా నాలోని కళా పురుషుడు బయటకు వచ్చి తీరుతాడు. యీ లోపులో మీ బుర్రలకు కూడా  పదును పెట్టండి.....యేదైనా సీజన్ లో నాలుగు రూపాయలు వెనుక వేసుకోవాలి.....
  

13, ఫిబ్రవరి 2012, సోమవారం

అభ్యుదయమా....నీ చిరునామా చెప్పు

BRTS రోడ్  మీద జీప్ స్పీడ్ గా వెళ్తోంది. ముందు కూర్చున్న నాకు చాలా దూరం వరకూ రోడ్ కనబడుతోంది. విశాఖపట్నం  లో కొత్తగా వేసిన  యీ రోడ్ ట్రాఫిక్  రూల్స్ గురించి చాలా మందికి ఒక పట్టాన అర్ధం కాదు. మొత్తానికి  ట్రాఫిక్  సమస్యలు  కొంతవరకూ తీరిన ఆనందంలోనే జనం ఉన్నారు. ఏవేవో   ఆలోచనలకు బ్రేక్ వేస్తూ జీప్ షడన్ గా స్లో అయ్యింది. కొంచెం  ముందు మూగి ఉన్న జనం బట్టి అక్కడ ఏదో  సంఘటన జరిగిందనేది అర్ధం అయ్యింది. కొంచెం  ముందుకు  వెళ్ళాం. రోడ్ కు అడ్డంగా పడి ఉన్న శవం. మధ్య లేన్ లో నుండి లెఫ్ట్ లేన్ లోకొస్తుంటే వెనుకగా వస్తున్న సిటీ బస్ ఢీకొని అక్కడికక్కడే  చనిపొయ్యాడు  ఒక యువకుడు. విచిత్రం  యేమిటంటే యెవరిదీ రాంగ్ రూట్  కాదు. మరి  తప్పెలా జరిగింది? వింటే కొంత విచిత్రంగానే ఉంటుంది. ఆ యువకుడు రోడ్ క్రాస్ చేయడం ఆ బస్ డ్రైవర్  కనబడకుండా ఒక రాజకీయ నాయకుడికి స్వాగతం పలకడానికి వెలిసిన ఒక చోటా రాజకీయ నాయకుదు యేర్పాటు  చేసుకున్న ఫ్లెక్సీ  అడ్డం వచ్చింది. డ్రైవర్ జీప్ స్టార్ట్  చేసాడు. వద్దంటున్నా వినకుండా శవం పక్కగా
తీసుకుని వెళ్ళాడు. వయసు 20-25 సంవత్సరల  మద్య  ఉండొచ్చు. నూరేళ్ళూ నిండి పొయ్యాయి. మామూలు మరణం కాదు. తల పగిలి మెదడు రోడ్ మీద పడి ఉంది. ఛాలా సేపటి వరకూ మామూలు మనిషిని కాలేక పొయ్యాను. యెవరి స్వార్దం ఆ కుర్రాడిని చంపేసిందో అర్ధం కావడం లేదు. ఆ  రాజకీయ నాయకుడి నగరాగమనం యీ కుర్రాడి మరణానికి దారితీసిన ఈక్వేషన్స్ గురించి ఆలోచనలు ముసురుకున్నాయ్. ఒక  సారి నా చిన్న  నాటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నాను. నాకు  ఊహ  వచ్చీ రాకుండా ఉన్నప్పుడు అంటే  1971 లో లోక్ సభ ఎలక్షన్స్ జరిగాయి. నాకేమీ అంత గుర్తు లేదు కానీ మేమప్పుడు రాజమండ్రి  సమీపంలోని ఒక గ్రామమైన వీరవరం లో ఉండే వాళ్ళం. రాజకీయ  ప్రభంజనాల గురించి యే మాత్రం తెలియని వయసు. వూరిలోని భూస్వాములూ….దళితులూ కూడా ఇందిరా గాంధీ పక్షాన ఉండడం నాకు  బాగా గుర్తుంది. యెందుకంటే నా క్లాస్ లో వీరికి సంబందించిన ఇద్దరూ ఉండేవారు. మరి వీరికి ప్రతి పక్షంగా  కొంత మంది దేవాంగుల పిల్లలు ఉందే వారు. వాళ్ళ ఇళ్ళ  మీద ఎర్ర జండాలు ఎగురుతూ ఉండేవి. వాళ్ళ నాన్నలు చేనేత పని చేస్తుండే వారు. నేనెక్కువగా వాళ్ళతోనే ఉండే  వాడిని.  ఆ  రోజుల్లో గాలిపటాలికి  వాళ్ళే ఉచితంగా దారపు కండెలు ఇస్తుండేవారు. నాకు గుర్తున్న మొదటి  రాజకీయ సభ ఆ ఎలక్షన్లో కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర చౌదరి   గారు మాట్లాడిందే .  తన కాంగ్రెస్ ప్రత్యర్ధి అయిన కపిళేశ్వరపురం   జమీందారీ వంశస్తుడైన   పట్టాభి రామారావు గారి మీద నిప్పులు కురిపిస్తూంటే చేనేత కార్మికులు మాటి మాటికి చప్పట్లు కొట్టడమొక్కటే నాకు గుర్తుంది. ఆ  తరువాత మరలా తాడికొండ స్కూల్ లో మా టీచర్స్ అలహాబాద్   హై కోర్ట్ తీర్పు గురించి  మాట్లాడు కొంటుంటే ఏదో ఒక అపూర్వ సంఘటన జరిగిందని అర్ధం అయ్యింది. ఆ తరువాత కొద్దికాలానికే ఎమెర్జన్సీ డిక్లేర్  అవడం …దాని గురించి చాలా గొప్పగా చెప్పుకోడం వింటుండే వాడిని. భారత దేశం అంతా ఒక విన్నూత్నమైన   క్రమ శిక్షన  వచ్చేస్తోందని మాకు
 మీటింగ్స్  పెట్టి మరీ చెబుతుండేవారు. నాకు అప్పటికి అంతగా రాజకీయ పరిజ్ఞానం లేదు కానీ తాడికొండ స్కూల్ లో మాకు ఇంగ్లీష్ సబ్జక్ట్ కు విల్సన్ రావు గారనే మేస్టారు ఉండే వారు. టెంత్ క్లాస్ లో మాకు "ది  చేంజింగ్ వరల్డ్ " అనే పాఠం ఉండేది. అది బహుశా నాలుగు పేజీల లెసన్ అన్నట్లు గుర్తు. కానీ ఆ పాఠాన్ని ఆయన పది రోజుల పైనే చెప్పినట్లు గుర్తు. ఎక్కడెక్కడివో  ఉదాహరణలు తీసుకుంటూ అసలు ప్రపంచం ఎందుకు మారుతుందో ఆయన చెప్పిన తీరు మాపై చూపిన ప్రభావాన్ని  గురించి సింపుల్ గా చెప్పడం కష్టం.( ఆయన గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్క విషయం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోడం చాలా అవసరం. ఆయన అదే టెక్స్ట్  బుక్  లో ఉన్న రవీంద్రుడి " ది హోం కమింగ్ " పాఠాన్ని చెబుతుంటే ఇంటికి దూరంగా ఉన్న మేమంతా కంట తడి పెట్టామనడంలో  అతిశయోక్తి యేమీ లేదు. ) సరే ఇంతకూ అసలు విషయం యేమిటంటే మూడు సంవత్సరాలు జైల్ లో ఉన్నట్టుగా  ఉన్న నాకు అవకాశం దొరికినప్పుడల్లా  సినిమాలు  చూడ్డం అలవాటు అయ్యింది. సినిమాకు ముందు తప్పనిసరిగా న్యుఎస్ రీల్ వేసే వారు. అందులో అప్పటి ప్రధాని ఐన స్రీమతి గాంధీని ,ఆమె కనిష్ట పుత్రుడైన సంజయ్ గాంధీని ఆకాసానికెత్తే తీరు నాకు ఎందుకో నచ్చేది కాదు. కారణం ఇదమిద్దంగా యీనాటికి కూడా చెప్ప లేను. అందుకే జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎందుకో చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత ఎమర్జన్సీ లో జరిగిన వాటి గురించి పేపర్ లో చదివి ఆవేశం తెచ్చు కొనే వాడిని. ఆ వయసుకి ..నేను పెరిగిన పరిస్థితులకీ అంతకు మించిన రాజకీయ అవగాహన ఉండే అవకాశం లేదు. ఆ తరువాత జరిగిన సంఘటనలు..... మార్పులు చూస్తుంటే యేమీ అర్ధం కాక తల పగిలి పోతూ ఉండేది. ఇంతకు ముందు ఒక పోస్ట్ లో రాసి  నట్లుగా "జాబ్ అయినా చూపండి ..లేదా జైల్ లో అయినా పెట్టండి"  అనే స్లోగన్ నన్ను ఒక వూరేగింపులో పాల్గొనడానికి పురికొల్పింది. అంతకు ముందు సాహిత్యంలో భాగంగా "అమ్మ" నవల చదవడం జరిగింది కానీ యీ వూరేగింపు నన్ను ఒక సైద్దాంతిక రాజకీయాల పరిచయం కలిగించింది. విస్తృతంగా పాల్గొన నప్పటికీ ఎంతో కొంత చతన్యం  ఉన్న యువకుడిగా మాత్రం నన్ను నేను మలచు కొనడానికి ప్రయత్నం మొదలయ్యింది. 1977-80 జనతా పార్టీ  కాలం పోటెత్తిన రాజకీయ చైతన్యంతో ప్రారంభం అయ్యి కుళ్ళు కంపు కొట్టేతంటగా  దిగజారిన విలువలతో అంతం అయ్యింది. మొట్టమొదటి సైద్దాంతిక సందేహం నాకు 1980 పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే వచ్చింది. అప్పట్లో సీ.పీ.ఐ. పార్టీ చరణ్ సింగ్ నేతృత్వంలోని గ్రూప్ ను సమర్ధిస్తే ...సీ.పీ.యం  పార్టీ మొరార్జీ నేతృత్వం లోని  జనతా పార్టీ తో కలసి పోటీ చేసింది. నిజంగానే నేనొక రాజకీయ పామరుడనే అప్పటికి. నాకు వచ్చిన సందేహం యేమిటంటే లోక్దళ్ ..జనతా పార్టీలతో ఉన్న భావ  సారూప్యత కన్నా...యీ రెండు కమ్యూనిస్ట్ పార్టీల మధ్య భావ సారూప్యత యెక్కువా కాదా అని.... సైద్దాంతిక నిబద్దత లేని పార్టీ  ల గురించి నేను మాట్లాడడం లేదు. కానె ఎంతో కొంత నిబద్దత ఉందని నమ్మిన కార్యకర్తల..ప్రజల మనసుల్లో కూడా ఒక గందరగోళాన్ని నింపారు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేనప్పుడు అప్పుడప్పుడు మా కాలేజ్ దగ్గరలో ఉన్న  సీ.పీ.ఐ. ఆఫీస్ కు వెళ్తుండే వాడిని. ఒక సారి అక్కడ  జాతీయ బూర్జువా ..ప్రాంతీయ లేదా పెట్టీ బూర్జువా అన్న పదాల మీద  వివరణ ఇస్తూ అక్కడ ఉన్న నాయకులు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ ను జాతీయ బూర్జువా పార్టీగాను..మిగిలిన వారిని పెట్టీ బూర్జువా పార్టీల గానూ గుర్తించాలని ముగించారు. ఆ తరువాత కొద్దికాలానికే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. తణుకు  మున్సిపాలిటీ కి  అప్పటి కాంగ్రెస్ యెం. పీ. అయిన చిట్టూరి సుబ్బా రావు గారి నేతృత్వం లో ఒక గ్రూప్ ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన శ్రీ  ముళ్ళపూడి హరిస్చంద్ర ప్రసాద్ నాయకత్వం లో ఒక గ్రూప్ పోటీకి దిగాయి. అప్పటికి సీ.పీ.ఐ. పాటీ రాజకీయ అవగాహన మేరకు వారు హరిస్చంద్ర ప్రసాద్ తో కలసి పోటీ  చేయాలి...కానీ అందుకు విరుద్దంగా జరిగింది. కారణమడిగితే యీ టౌన్ కి ఆయన పెద్ద బూర్జువా ...చిట్టూరి సుబ్బా రావు గారు చిన్న బూర్జువా అన్నారు. ఇలాంటి హాస్యాస్పదమైన నిర్ణయాల ఫలితమే యీ రోజు యే సిద్దంతమూ లేని ...అవకాశవాద...దిగజారుడు పార్టీల తోకలుగా కమ్యూనిస్ట్ పార్టీలు మిగిలి పోవలసి వచ్చింది.  కమ్మ్యూనిస్ట్ పార్టీ ల రాజకీయ సిద్దాంతాన్ని ఆ  రోజుల్లో అందరూ 100% సమర్ధించక పోవచ్చు..కానీ నమ్మిన సిద్దంతమంటూ ఒకటి ఉన్న పార్టీలు గా గుర్తించే వారు.  నా యీ సందేహాలు చదివిన పార్టీ నాయకులు..సమర్ధకులు...నాకొక పెద్ద సైద్దంతిక వ్యాసాన్ని పంపవచ్చు. కానీ వారు దృస్తిలో పెట్టుకోవలసింది......ఒక అతి సాధారణ పౌరిడికి అర్ధం అయ్యె రాజకీయ పరిభాషనే ఉపయోగించి చెప్పండి.బిల్గేట్స్ ని బిల్ క్లింటన్ ను భుజాన వేసుకుని తిరిగిన చంద్ర బాబు కాంగ్రెస్ కంటే యే విధంగా వామ పక్షానికి దగ్గరో నాకు అర్ధం కాదు. అంతే కాదు అధికారం కోసం అత్యంత దివాళా కోరు పనులని చేసిన కాంగ్రెస్ తో జత కట్టడానికి యీ వామ పక్షాలు సంకోచించ లేదు. అలా అంటే మత తత్వానికి అడ్డు కట్ట వేయడానికంటారు. కానీ "షాబాను మచ్చ ...బాబ్రీమసీదు కూల్చి వేత పత్ల ఉపేక్షభావం..లాంటివి...ఆ పార్టీని మతతత్వ పార్టీ ల కంటే తక్కువగా యెలా చూడగలరో అర్ధం కాదు. అంతకన్న దారుణమైన విషయమేమిటంటే 1989 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వారు వూరూరా గాంధీ,నెహ్రూ విగ్రహాల పక్కనే వారు  ప్రతిస్టించిన విగ్రహాన్ని చూస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అసలు నైజం అర్ధం వుతుంది. తమ పర్టీ నాయకుల విగ్రహాలను ప్రతిస్టిచడం తప్పు కాకపోవచ్చు...కానీ అవి యెవరి పక్కన ప్రతిష్టిస్తున్నామన్నది కూడా ముఖ్యం కాదా......
1950 ల నాటి పత్రికలు  ఒక్క సారి అర్చీవ్స్ కెళ్ళి  తిరగెయ్యండి. ఒక్క చోట కూడా " సామాజిక వర్గం " అన్న పదం కన బదదు. యీ నాదు పంచాయితీ వార్డ్ మెంబెర్ ఎలెక్షన్స్ కు కూడా మెడియా వారు సామాజిక వర్గాల విస్లేషన అందిస్తారు. యీ అలోచన తప్పు అని చెప్పరు సరి కదా...దానికి ఆహార్యాన్ని అంద జేస్తారు. యెవరి ప్రయోజనాలు వారివి. యీ పరిస్థితి చూస్తుంటే మొన్ననే వచ్చిన "రాజన్న" చిత్రంలోని పాట పదే పదే వినాలనిపిస్తొంది. ఆ పాటలో రచయిత "యెగిరిపోవె..యాడికైనా..." అని అర్ధిస్తాదు. కానీ మనం ఇక్కడే ఉందాలి కదా....గదులలో కూర్చుని ....మనకెందుకులే అనుకుంటున్న అభ్యుదయ మేధావి వర్గమంత.....వీధులొకి కదలాల్సిన సమయం వచ్చింది. ళేకుంటే మరేమీ ఇక మిగలదు. మన సిద్దాంత వాదోపవాదాలు వినిపించాలంటే కనీసం మనం బ్రతికి ఉందాలి కదా.......అన్నీ ఒక్క సారి పక్కన పెట్టి ముందు యీ కుళ్ళును కడిగి ఆ తరువాత వచ్చే మంచి వాతావరణంలో తీరిగ్గా వాదించుకొందాం. 

5, జనవరి 2012, గురువారం

పెదనాన్న..కొన్ని జ్ఞాపకాలు

             సగోత్రీయులం  అందరం గోదావరి గట్టుకి వెళ్ళాం పిండ ప్రదానం చేయడానికి. కార్యక్రమం  జరుగుతూ ఉంది. కాకులకోసం చూస్తున్నారు. మా పెదనాన్న గారి జీవితం ముగిసి కొద్ది రోజులే అయ్యింది. ఎందుకో  తెలియదు ఇంతకు ముందు మరీ అంత విచారం ఉండేది కాదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తరంలో ఒక్కక్కరూ రాలి పోతుంటే వ్యక్తులు శాశ్వతంగా  దూరమైన బాధకు  మించి వేరే బాధ నన్ను చుట్టు ముట్టేస్తుంది. నాకు ఊహ తెలిసిన తొలి రోజుల లోనే ఆయనకు పెరాలసిస్ వచ్చింది. పల్లెటూరు కావడం వలనా….వెనుకబడిన కుటుంబం కావడం వలనా….ఆయనకు సకాలం లో వైద్యం ఐతే అంద లేదు. దాని  బాధ ఆయన జీవితాంతం పడ్డాడు. ఎంతో కష్టపడే  అలవాటున్న ఆయన దానికి దూరం కావడం తో మానసికంగా చాలా కృంగి  పొయ్యాడు.కానీ ఆయనతో పాటు మా పెద్దమ్మ జీవితం మొత్తం జైల్ జీవితం అయిపోయింది.  గత 40 సంవత్సరాలలో ఆవిడ  వేరే యెక్కడికీ రావడం చూడ లేదు. యెవరో పలకరించడంతో ఆలోచనా స్రవంతి కి బ్రేక్ పడింది......

                  మొత్తానికి  కాకులు వచ్చాయి. 40 యేళ్ళ నుండీ వీధి దాటి యెరుగని ఆయన కు పెద్ద గా యే కోర్కెలూ ఉండే అవకాశాలు ఉండవు. గతం అంతా యెదో సినిమా రీల్ లా మెదిలింది. ఒకసారి తాడికొండ ఆశ్రమ పాఠశాలకు వెళ్ళాక ఆయనను చూడడానికి వెళ్ళే టైం దొరికేది కాదు. నాన్న  గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు…ఎప్పుడు కలిసినా పెదనాన్న “ఆడు…ఆడు…” అని సైగ చేసి అడుకుతున్నాడురా…అని. ఆయనకు  అంతకు మించి మాటలు వీలయ్యేవి కాదు. నా  మీద అభిమానం ఉండటానికి కారణం కూడా ఆయనకు మగ పిల్లలు లేకపోవడం ఒక కారణం కావచ్చు. నిజం చెప్పాలంటే ఆయన తన తోటి వారినందరినీ ఆప్యాయంగా చూసుకొనేవాడు. నాకైతే నాకు తలపాగా చుట్టి బయటకు తీసుకెళ్ళడం చూచాయగా గుర్తుంది. .........మరలా కర్మకాండ తంతులొకి  ప్రవేశించాం.  గడ్డాలు..మీసాలు తీయడం  ప్రారంభమైంది. కానీసం చావులో ఐనా అంతా కలవడం ….ఆ కర్మకాండలు పూర్తయి  ఆత్మ స్వర్గం చేరిందని నమ్మకం కలిగే వరకూ సగోత్రీయులందరూ ఆ బాధలో కూడా ఉండడం……ఇవన్నీ ఆచార పరంగా వచ్చినా ఎంత ఆలోచనతో పెద్ద వాళ్ళు  ముందు చూపుతో ఇలాంటివి పెట్టారో అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తరువాత నావారినందరినీ  చూసాను.  చదువు అయిన  వెంటనే ఉద్యోగం ….దాంట్లో యాంత్రికంగా ఇమిడి పోవడం ..జీవితంలో యేదైనా సాధిస్తున్నామో…కోల్పోతున్నామో…అలోచించుకొనే వ్యవధి కూడా ఉండని జీవితం……పరుగులు….అంతా పరిగెత్తుతున్నప్పుడు మనం కూడా పరిగెడితేనే సాపేక్షంగా మన స్థానం  నిలబడుతుందన్న…ఫీలింగ్……..చాలాకాలం తరువాత  యేదో ఒకటి ఆలోచించే టైం దొరికింది. మరలా  ఒక సారి పెద నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన హాస్పిటల్ లో ఆఖరి రోజులలో ఉన్నాడని కబురు తెలిసింది. హాస్పిటల్ కి వెళ్ళాం. మన  లో లేడని చాలా మంది ముందుగానే చెప్పడం వలన ఆయనను చూస్తే చాలని అనుకుంటూ వెళ్ళాను. రిసెప్షన్ లోనే చెప్పేసేరు ..ఆయన భోజనం మానేసి 15 రోజులయ్యిందని. అలానే పైకి వెళ్ళాను. కూడా ఉన్న నాన్న గారితో మాట్లాడుతున్నాను. మా మాటలు వినబడి ఆయన దిగ్గున లేచి కూర్చోవడం ఆయనకోసం ఉంచబడ్డ మనిషి ని ఎంత ఆశ్చర్యానికి  గురి చేసిందో చూసిన వాళ్ళకే అర్దం అవుతుంది. లేచిన మనిషి ఒక్కసారి  భోరున యేడ్చేశాడు. యేనాడూ ఆయన నోరు విప్ప లేని పరిస్థితి .... మరి చరమాంకంలో దేనికోసం అంతలా విలపించాడో ఈనాటికీ నాకు అర్దం కాలేదు. అలా ఆయనను చూసిన తరువాత మరలా కొంత కాలం తన జీవితాన్ని పొడిగించగలడనిపించింది. నా అలోచననే 2 రోజుల తరువాత మా నాన్న గారు తన ఫోన్ తో ఖాయం కూడా చేసారు. కానీ అంతలోనే యీ ముగింపు.
                        ఆయనేమీ గొప్ప వ్యక్తిగా చూడబడాలని కోరుకోలేదు. పొలం వెళ్ళడం మానివేసినప్పటి నుండీ ఇంటికెదురుగా ఉన్న గానుగ చెట్టు చుట్టూ కట్టిన చప్టాయే ఆయనకు శాశ్వత కాలక్షేప వేదిక అయ్యింది. ఆయనతో  పాటు మిగిలిన ఆ తరంలోని అన్నదమ్ములు(పెదనాన్న..చిన్నాన్నల కుమారులు) కబుర్లు వినడమే ఆయనకుండే ఒకానొక్క కాలక్షేపం. యెప్పుడైనా వస్తుండే మమ్మలని అంత దూరం నుండే చూసేసరికి ఆయన ముఖంలో కనబడే వెలుగుని చూడడం నాకు చాలా ఇష్టం గా ఉండేది. అటువంటి వెలుగులు బహుశా యిక ముందు తరాల  లోని వారు చూడలేకపోవచ్చు.డిజిటల్ కెమేరా కొన్న కొత్తలో ఒక సారి ఆ వూరు వెళ్ళి ఆయనకు చాలా ఫొటోస్ తీయడం జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం యేమిటంటే ఆ ఫొటోస్ నేను బేక్ అప్ చేయకముందే ఆ కెమేరాను అరువు తీసుకున్న వాళ్ళు అవసరం లేక పోయినా వాటిని మొత్తం తీసేసారు.
                     ఒక్క విషయం ఖచ్చితంగా అనిపించింది..ఇంకా అనిపిస్తూనే  ఉంటుంది.." నా మనుషులు ..నా వాళ్ళు నాకు కావాలి....అని ఆలోచించే..తరాలకు...నా వస్తువులతో ....నా కాలక్షేపం నాకుందిలే అనుకునే తరాలకు  మధ్య  ఉన్న సంధి యుగంలో ఉన్నామని .............

1, డిసెంబర్ 2011, గురువారం

కుళ్ళుని కడగడం ప్రారంభిద్దామా....

పారిభాషిక పద కోశం లో కొన్ని పదాలకు అర్ధాలు యేమున్నాయో తెలియదు  కానీ వాడుకలో మాత్రం కొన్ని పదాల అర్ధాలు అనూహ్యంగా మారి పోతున్నాయి. కొన్ని పదాల అర్దం యేమిటో నాకిప్పటికీ అగమ్య గోచరంగా ఉంటుంది.  అందులో ముఖ్యమైనది "శీలం" అనే పదం. వాడుకలో ఈ పదానికి ఉన్న అర్దం వినడానికే యేవగింపుగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క "నడవడి" ఇత్యాది లక్షణాలను  వివరించే ఈ పదం ఈనాడు కేవలం సమాజానికి (ఇది కూడా మొత్తం గా వర్తించక పోవచ్చు) ఆమోదమయ్యే రీతిలో   స్త్రీ యొక్క శారీరక ఉపయోగాన్ని నిర్దేశించే  ఉపయోగార్దం లో వాడుతున్నారు. నేను ఇప్పటికీ అనుకున్నంత స్పష్టంగా  నా భావాన్ని వ్యక్తీకరించ లేకపొయ్యాను.ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవలసింది ఏమిటంటే స్త్రీలు కూడా అదే భావజాలంలో కొట్టుకు పోవడం. ఉద్యోగం చేసుకుంటున్న ఒక విద్యాధికురాలు తన స్నేహితురాలితో  మాట్లాడిన మాటలు  నా చెవినబడడం కాకతాళీయమే ఐనప్పటికీ ఆ మాటలు  మనం అంటున్న "మారిన అర్ధాల" గురించి చెబుతాయి." నేను చాలా లక్కీ తెలుసా ...ఆ టైం  కి ఎవరో వచ్చి తలుపు తట్టారు సో ఐ వస్ సేవ్డ్" మరి ఆవిడ తరహా మిగిలిన వారి గురించి   నేను ఇంతకు మించి వేరే వివరించదలుచుకోలేదు.
  ఇంతకు ముందు కూడా నా వేరే పోస్ట్  లో ఇదే విషయాన్ని కొంత వివరించాను. యీ పదాల అర్దాలు మరలా ఎప్పుడు మారతాయో చూడాలి. ఈ రోజు జైళ్ళలోకి నెట్ట బడుతున్న రాజకీయ నాయకుల ,అధికారుల భార్యలకు రోజు రోజు కీ ఇంట్లోకి ఎక్కడి  నుండి ధనం ప్రవహిస్తుందో తెలియదా......ఎంతో కొంత తమ భర్తలు చట్టానికి,సమాజానికి అతీతమైన రీతుల్లో ఈ ధనార్జన చేస్తున్నారని. ఐనా సమాజం వారినందరినీ శీలవతులుగానే పరిగణిస్తుంది. ( ఒక వేళ వీళ్ళు చెబుతున్నా ఆ భర్తలు వినక పోతే ...ఆ భార్యలను విమర్శించడం తగదు కానీ జరుగుతున్న చాలా పరిణామాలు ఆ విధంగా లేవు.) అక్కడి వరకూ అక్కర లేదు యీ రోజు కాలేజ్ నుంది బయటకు వస్తున్న విద్యార్ధి నెవరినైనా సరే ఈ " శీలం  అంటే ఏమిటి?"  అని ప్రశ్నించండి  అప్పుడు మీకే అర్ధం అవుతుంది మన కాబోయే నాయకులు..మేధావులకున్న  సామాజిక అవగాహన. ఎంత మంది తలిదండ్రులు తమ పిల్లలకు 50 సంవత్సరాల అజెండాను ఇస్తున్నారు? ఇచ్చిన అజెండా కేవలం 25 సంవత్సరాల వరకే. ఆ తరువాత గడపవలసిన జీవితం పట్ల అవగాహన....అంతా అగమ్య గోచరం. మంచి అంటే ఏమిటో వివరించే కొలమానాలు అసలు ఉన్నాయా? నిజంగా అంత అజెండా తో పిల్లలని పెంచితే సాఫ్ట్ వేర్ లాంటి రంగాలలో మాంచి మాంచి ఉద్యోగాలలో ఉన్న యువకులు వాళ్ళ తలిదండ్రులని యేవో సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి ఉండే వారు. వాళ్ళు సంపాదించేది చాలక ఆ డబ్బు ఇక్కడికి పంపి దానితో తన వాళ్ళతో రియల్   ఎస్టేట్ వ్యాపారాలు చేయిస్తున్నారు.   

ఒక చిన్న విషయంతో ప్రారంభిద్దాం. మా అక్కయ్య పాలెం మెయిన్  రోడ్ లో వెళ్తున్న ప్రతివారూ ఒక చోట రోడ్ లో కొంత భాగాన్ని ఆక్రమిస్తూ  అడ్డంగా కట్టిన రంగురంగుల గుడ్డలను చూసే ఉంటారు. నాకు కూడా కొంత కాలం వరకూ అర్దం కాలేదు. తరువాత అర్దం అయ్యిదేమిటంటే ఆ స్థలాని ఆక్రమించుకొని కొంత మంది సత్య సాయి బాబా భజనలు చేస్తున్నారు. వారి ఆక్రమణ వలన కొన్ని వేల మంది వెళ్ళే  రోడ్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ఐనా యెవరూ అడగరు. ఆ భజనలు చేసే కొద్ది మందికీ వారి నమ్మకాలే ప్రధానం కాని సమాజం లో తోటి వారి ఇబ్బందులు వారికి అక్కరలేదు. కొంత మందికి వారి నమ్మకాలే ముఖ్యమైనప్పుడు  మరికొంత మందికి వారి అవసరాలే ముఖ్యమై కూర్చుంటాయి. ఉల్లంఘన పట్ల ఒక సారి ప్రారంభమైన ఉదాశీనత దేనికైనా దారి తీయొచ్చు. ప్రతి ఒక్కరూ ఈ తమ చుట్టూ జరుగుతున్న  చిన్న అన్యాయాల  గురించి మాట్లాడుకోరు. ఎక్కడో  దూరంగా ఉండే రాజకీయ వాది గురించో లేక ఒక ఉన్నతాధికారి గురించో మాట్లాడుకొంటారు.  ఎందుకంటే అప్పుడు  మన చేయగలిగింది యేమీ ఉండదు. యే అన్న హజారే యో ముందుకు తేబడితే హాయిగా అతడి టోటో  లు వేయించుకొంటూ ఫోటోస్ దిగవచ్చు. "అయ్యా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా  ఊరేగింపు తీద్దాం " అంటే చందా ఈయని  వార్డ్ స్థాయి  నాయకులు తమ అవసరాల కోసం వినాయక చవితి పందిళ్ళు వేయించి పెట్టుకుంటున్న కటౌట్లను చూస్తూనే ఉంటాం కానీ మన ఈ ఉదాశీనతనే పై వాళ్ళు బాగా కనిబెడుతున్నారన్న వాస్తవాన్ని మనం విస్మరిస్తున్నాం. క్రింద స్థాయిలో  ప్రశ్నిచడం  ప్రారంబించగానే పై వాడు కూడా కొద్దిగా భయపడతాదని  మనం ఎప్పుడూ మరవ కూడదు. 
క్యూ ఖచ్చితంగా పాటించే సంస్కారం మన అందరిలో ఉన్నప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర కాపలా వాడి అవసరం ఏమిటి? మనం సరిగ్గా ఉండక ఎవడో పనికి మాలిన వాడికి కాపలా పేరుతో మన జుట్టు అందిస్తున్నాం. లోపం మన లోనే ఉంది. విలన్లు ఎక్కడో ఉండరు. మన మధ్యే ఉంటారు. సిమెంట్ దొంగతనం చేసి శివలింగాలను పూజ చేస్తున్న వారిని కళా పోషకులుగా ...రాజకీయ నాయకులిగా కీర్తిస్తూ వెలసిన కటౌట్లను ఆనందంగా చూడడం తప్ప మరేమీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో  ఉన్న మనందరం విలన్లమే.
సినిమా తీసినంత సుళువుగా  రాజకీయ పార్టీ పెట్టి జిల్లా వారీగా ఫైల్యూర్ సినిమాని ముందుగానే అమ్మేసినట్లు  పార్టీని  కూడా అమ్మేసిన ఒక మాజీ హీరో  గారి పుత్ర రత్నం యొక్క వివాహ నిశ్చితార్ధ వేడుకలని రెండు మూడు చానళ్ళు చాలా సేపటి నుండీ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయ్. రైతుల ఆత్మ హత్యల లైవ్ కవరేజ్ తో కూడా టీ.ఆర్.పీ. రేటింగ్స్ ఎలా పెంచుకోవచ్చో యీ మధ్యే విడుదలైన ఒక హిందీ సినిమాలో చూపించారు. యీ రోజు కూడా నలుగురు అన్న దాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అవి కూడా లైవ్ కవరేజ్ ఇచ్చే అలోచన కలిగితే బాగుండును. మరెవరైనా ప్రముఖ రాజకీయ నాయకుడు పైకి పోతే ఇవన్నీ ఆయన అకౌంట్ లోకి పోయి..చక్కగా ఎవరో ఒకరు వీళ్ళందరినీ ఓదార్చడానికి వచ్చి ఉండేవారు కదా అనిపిస్తుంది. ఈ కుళ్ళంతా కడగడానికి ఎన్ని చీపుళ్ళు కావాలో....కానీ కడగడం తప్పదు. ఉప్పెన పైకెగసే రోజు దగ్గర లోనే ఉంది.....మనం చూస్తుండగానే కుళ్ళంతా సమూలంగా తుడిచి పెట్టుకు పోతుంది. ఒక్క విషయం ఏమిటంటే ఉప్పెన దానంత అది రాదు. మనందరం దానిలో భాగస్తులైతేనే వస్తుంది.