8, నవంబర్ 2011, మంగళవారం

అందరిలో హజారే ఉండాలి

ఇందుగలదందు లేదని సందేహము వలదు......ఎక్కడ వెదికినా ఏదో ఒకటి మీ కంటికి కనబడుతూనే ఉంటుంది.పైనున్న చిత్రాన్ని ఒక్క సారి పరీక్షగా చూడండి. వాహనాలు పార్క్ చేసిన స్థలంలో ఏది ఉంటే బాగుంటుంది? అది ఈ మధ్య కాలం వరకూ రాష్ట్ర రవాణా శాఖ వారి ఆధీనం లోనే ఉండేదని ఈ మధ్యనే నా మిత్రుడొకడు చెప్పాడు.కాదు అసలు ఆ స్థలం రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్  కార్పోరేషన్ వారిదే అని కూడా అన్నాడు. నిజానిజాలు ఇంకా నాకు తెలియవలసి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ స్థలం లో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నది. ఒక్క సారి మరలా ఆ కూడలి ప్రాముఖ్యాన్ని చూడండి.అక్కడ ఒక మంచి బస్ స్టాప్ కావాలా....లేక కమర్షియల్ కాంప్లెక్స్ కావాలా......తమరే చెప్పాలి. ఏ పేద వారికి ఉపయోగం కలుగుతుందని ఆ స్థలాన్ని అలా ధారా దత్తం చేసారో నాకైతే తెలియదు. నాకు అంత జ్ఞానం లేదు. ఆ కాంప్లెక్స్ లో చక్కగా KFC వారి ఫుడ్ కోర్ట్ ,4D theater లాంటి అత్యాధునిక సదుపాయాలూ ఉన్నాయి. కానీ వాటి వలన ఉండే ఉపయోగం కంటే హై వే కు ,ఒక గొప్ప విశ్వ విద్యాలయానికి ఆనుకుని ఉన్న ఆ స్థలం పేద వారికి, విద్యార్ధులకి ఇంకా ఎక్కువే ఉపయోగ పడుతుందని నా లాంటి పామరుడు అనుకో వచ్చు కానీ ప్రభుత్వ పెద్దల అభిప్రాయం అంత కంటే భేషుగ్గా ఉందేమో...

4, నవంబర్ 2011, శుక్రవారం

భాషా..బంధం

 ఉదయానికి మధ్యహ్నానికి మధ్యలో ఉన్న టైం అంటే 11.30  అయ్యుండొచ్చు. కాంక్రీట్ వర్క్ నడుస్తోంది. చెక్ చేసి వచ్చి చెట్టు కింద వేసిన కూర్చీలలో కూర్చున్నాను. ఆ వర్క్ నాది కాదు కానీ నా కొలీగ్ వేరొక పని మీద వెళ్ళడం వలన నేను ఆ చెకింగ్  కి వచ్చాను. కాంట్రాక్టర్  కొద్ది సేపటికి  వచ్చి నా పక్క కూర్చీలో కూర్చున్నాడు. ఆయనకు నాకు పరిచయం లేదు. తనే మాటలు ప్రారంబించాడు.
"సార్ ది గోదావరి జిల్లాయే నంట కదా..."
"అవునండీ.."
"మాదీ  అక్కడే లెండి..."
కొంత సంభాషణ నడిచింది. అతడు పెద్దగా చదువుకోలేదనీ...కష్ట పడి పైకి వచ్చిన వాడని అర్ధం అయ్యింది.
 యెదురుగా కొత్తగా కట్టిన స్టాఫ్  క్వార్టర్స్ వైపు చూపిస్తూ అడిగాడు.
" క్వార్టర్స్ బాగానే కట్టారు కానీ ...దాని చుట్టూ  మూడడుగుల వెడల్పులో ఒక ప్లాట్ ఫార్మ్  కడితే చూడ్డానికి..శుభ్రానికీ  బాగుంటుంది కదా సార్...."
"మీరు చెప్పింది బాగానే ఉంది కానీ డ్రాయింగ్ లో లేనిది మా వాళ్ళు అంత త్వరగా కట్టరు లెండి" అన్నాను
"అన్నీ  డ్రాయింగ్ లోనే ఇస్తే మేమ్మాత్రం కట్టలేమా యేంటి సారూ...అవి చూడండి బొత్తిగా మొల్తాడు లేని మగాడి లా వేలాడి పడి పోతున్నాయి కదా.."
యెందుకో నాకు తెలియదు కానీ ఆ ఆఖరి వాక్యంలో ఉన్న నుడికారం నన్ను భలే ఆకట్టుకుంది. రాను రానూ మన వాడుక  భాషలో  అందులోనూ పట్టణ  ప్రాంతంలో ఉన్న మాకు యీ నుడికారాలు లేక భాషలో భావ వ్యక్తీకరణ తగ్గిపొతోందనిపిస్తోంది. యే భాషకైనా నుడికారాలు లేకపొతే అది యూనిఫార్మ్ వేసుకున్న కాన్వెంట్ పిల్లల మాదిరిగా ఉంటుంది. ఆఫీస్ ల వరకూ ఆ భాష బాగానే ఉంటుంది కానీ వాడుకలో మాత్రం నుడికారాల సౌందర్యం బలమైన సాస్కృతిక పునాదులున్న వారికి మాత్రమే అర్దం అవుతుంది. ఆ పునాదులు లేని వారికి ఎస్ . ఏం. ఎస్ . భాషకు , తేనెలూరే తెలుగుకి తేడా తెలియదు.  బలమైన సాంస్కృతికాభిమానం లేని వారి కుటుంబ వాతావరణం కూడా బల మైన పునాదులు లేని కట్టడం లా ఉంటుంది.
యీ మద్య అనుకోకుండా ఆదిత్య 369 సినిమా చూడడం జరిగింది. మహా దర్సకులైన స్రీ సింగీతం శ్రీని వాస రావు గారు మన భాషా సౌందర్యాన్ని  ..పద్య సాహిత్యాన్ని ..ప్రేక్షకులకు యెంత అద్భుతంగా పరిచయం చేశారనిపించింది.
కేవలం భాషే కాదు సమాజం లోని పొరలు...ఘర్షణలు  కొత్త తరానికి అందించడంలో మనం విఫలమౌతున్నాము కాబట్టే ఒక తప్పు చేయడానికి వెనుకాడని యువతరం ...ఒక తప్పును గాని...అది జరుగుతున్న తీరును గాని..యెదిరించే మానసిక సామర్ధ్యాన్ని కోల్పోయి దేనిని నమ్మాలో తెలియని డోలాయమాన స్థితి లో ఉంటున్నారు.

ఒక సారి పైన  ఉన్న విడియో క్లిప్  జీవితంలొని లోతులకి ఉదాహరణగా యెలా ఉందో చూడండి.

14, అక్టోబర్ 2011, శుక్రవారం

విగ్రహాలను పడగొడదాం.....






మా సుపుత్రుడితో కలసి యీ మధ్య ద్వారకా నగర్ వైపు వెళ్తుండగా వాడికి ఆకస్మాత్తుగా ఒక సందేహం వచ్చింది. మనం చేసే మంచి పనులు అప్పుడప్పుడు మన పీకకే చుట్టుకుంటాయనడానికి మంచి ఉదాహరణ నేను ..మా సుపుత్రుడే. మాయా బజార్ సినిమా చూపించినప్పుడు వాడికి అందులో ఉన్న మంచి మంచి డైలాగ్స్ వివరించి చెప్పడం జరిగింది. " శత్రు మిత్ర చరిత్ర జ్ఞానం కావాలి" అన్న డైలాగ్ అందులో ఒకటి. అప్పటి నుండీ మా వాడు తన ధర్మ సందేహాలతో చంపేస్తున్నాడు.
మా విశాఖ లో యీ మద్య చాలా చాలా కొత్త విగ్రహాలు వెలిశాయ్. కొత్తవి కావడం వలన కావచ్చు అవి తళ తళా మెరుస్తున్నాయి కూడా. వాటి పక్కనే ఉన్న పాత విగ్రహాలు వెలిసి పోయి ఉన్నట్టుగానే ఉన్నాయ్. అంతే కాదు సైజ్ లో కూడా అవి అంటే పాతవి చాలా చిన్నగానే ఉన్నాయ్. అంతవరకూ ఫరవాలేదు కానీ మా వాడు కొన్ని యక్ష ప్రశ్నలు అడిగి నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. వాటికి సూటిగా సమాధానం చెప్పడం నావలన కావడం లేదు కాబట్టి యీ పోస్ట్ చదువుతున్న పాఠక దేవుళ్ళు యెవరైనా సరైన సమాధానాలు చెప్పి నా బాధను కాస్త పంచుకొంటారని ఆశిస్తాను.
ఒక సెంటర్ లోని పార్క్ లో ఉన్న విగ్రహం పేరు అడిగాడు. అదేదో యీ మద్యే కాల ధర్మం చెందిన రాజకీయ నాయకుడిది కాబట్టి పేరు చెప్పాను. వాడికి వెంటనే పేరు చెప్పాను. "నాన్నా మరి యీ పేరు మా బుక్స్ లో ఎక్కడా లేదు అన్నాడు.
"ముందు ముందు యెక్కిస్తారేమోరా..." సమర్దించుకున్నాను.
" ఐతే ఆయన చేసిన కొన్ని మంచి పనులు చెప్పు"
పచ్చి వెలక్కాయ గొంతులో పడింది.
అంతే కాకుండా యెక్కువగా కనబడుతున్న ఒక దివంగత ముఖ్య మంత్రి విగ్రహాల గురించి కూడా అడిగాడు.
" నాన్నా మరి మన టీవీలో ..పేపర్లో వాళ్ళ అబ్బాయిని సీ.బీ.ఐ. విచారిస్తోందని అంటున్నారు కదా..."
"అవును...ఇంకా విచారణే కదరా...నేరం కొర్టులో ఋజువవ్వ లేదు కదా...." నా తెలివి తేటలకు నేనే మురిసిపోయాను.
"ఒక వేళ ౠజువైతే ..అవన్నీ కూల్చేస్తారా... ఐనా నాన్నా.. చిన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కన ఆయనకంత విగ్రహం పెడుతుంటే యెవ్వరూ యేమీ అనలేదా?"
చచ్చాను...యేమి చెప్పాలో తెలియలేదు. మళ్ళీ మా వాడే కొనసాగించాడు.
" మరి .....తాతయ్య.....ఆ తరువాత.........తాతయ్య మన వూరికి సర్పంచ్ లు గా చేసారని చెప్పావుగా..మరైతే వాళ్ళ విగ్రహాలు కూడా మన వూళ్ళో పెట్టేద్దాం...మన ఇంటి దగ్గర సెంటర్ ఖాళీగానే ఉందిగా...
అలా చేయకూడదని చెప్పలేకపొయ్యాను. అసలు నాదగ్గర సమాధానమే లేదుగా...అందరి లాగే నా చర్మం కూడా మందమైనదే...మహనీయులు ,చరిత్రను మలుపు తిప్పిన వారు..పోరాటాల్లో సర్వస్వం త్యాగం చేసినవారి చిన్న మట్టి కొట్టుకు పోయిన విగ్రహాల పక్కన బంగారపు రంగు పూతతో కొత్త విగ్రహాలు అలా వెలుస్తుంటే చూస్తూ నోరు విప్ప లేక పోయిన దౌర్భాగ్యుల్లో నేనూ ఒకడినే కదా.....
యేది యేమైనా మా వాడికి సహజంగా వచ్చిన తెలివితేటలు తగ్గించేయాలి..లేక పోతే చాలా ప్రమాదం. ఇలాంటి ప్రశ్నలు వాడి మనసులో పెరిగి పోతే ముందు ముందు వాడు బ్రతకడమే కష్టం. వాడి తెలివి తేటల్ని శుభ్రంగా తుడిచేసి .. ...చక్కగా మాంచి ఫౌండేషన్ కోర్స్ చెప్పే ......టెక్నో స్కూల్ లో పడెయ్యాలి.....
యెంతైనా నేనూ ఒక తండ్రినే కదా......

5, అక్టోబర్ 2011, బుధవారం

స్వచ్చత...ముందు ముందు ఎండ మావేనా

కళ్ళలో సన్నటి కన్నీటి  పొర. ఈ రోజు "కౌన్ బనేగా కరోడ్ పతి" ప్రోగ్రాం చూస్తున్నంత సేపూ అది ఆనందమో తెలియదు ...మరేదో తెలియదు ..ఒక నిజమైన భారతీయత మొత్తం ఆ మరాఠీ  రైతు రూపం లో ప్రత్యక్షమైంది. చాలా సార్లు యేదో ఒక పొర లో నుండి సమాధానాలిచ్చిన  ..ఇస్తున్న మనుషులను చూసీ  చూసీ ఉన్న  మా అందరికీ ఆ సమున్నత గ్రామీణ వ్యక్తిత్వం ...ఆ స్వచ్చత ...మాటల్లోని నిజాయితీ ..... యెక్కడో  కోల్పోతున్న మానవీయతను ఆ ఎపిసోడ్ చూసిన వారందరికీ రుచి చూపించింది. బహుశా  ఆ స్వచ్చతను యే పొరలూ లేకుండా మిగిలిన వారు మాత్రమే ఆఘ్రాణించగలనుకుంటాను. కేవలం విలువలే కాదు..యీ నాటి రైతాంగ జీవితంలోని కష్టాలను  ,కఠోర వాస్తవాలను సున్నిత మైన భాషలోనే చెబుతూ ..కష్టాలైనప్పటికీ వాటికి యెదిరొడ్డగల సరళ జీవన తత్వాన్ని ఆవిష్కరించిన  ఆ నిలువెత్తు మానవతా మూర్తి మాటలకు ...ఆ మహా కళాకారుడైన అమితాబ్ కూడా మంత్ర ముగ్ధుదయ్యాడనడం యెంత మాత్రం అతిశయోక్తి కాదు.
పట్టణ  జీవిత మసాళాలు మరిగిన వారికి తమాషా గా అనిపిచే వేషధారణతో.. .   ..అందులోనూ స్వచ్చమైన మరాఠీ రైతాంగ వేషధారణతో  వచ్చిన యీ వ్యక్తి ధైర్యం ముందు తమాషాగా అనిపించినా ..."యీ డబ్బుతో మీరేమి చేస్తారు " అన్న ప్ర్స్నకు ఆయనిచ్చిన సున్నిత సమాధానం యీ నాటి రైతాంగ జీవనాన్ని మొత్తం ప్రేక్షకులందరికీ వివరించగలిగింది. నాలుగు ఎకరాల వ్యవసాయంలో కేవలం 30000 రూపాయల ఆదాయం తెచ్చుకో గలిగే ఆ రైతు ఆకాంక్షలు ....ఒక్కొక్క చెక్కూ అందుకుంటన్నప్పుడు ఆ రైతు ..ఆయన భార్య ముఖంలోని ఆనందం చూస్తున్నప్పుదు కలిగిన భావాలను చెప్పడానికి ఇంతకంటే పది రెట్లు బలమైన భాష కావాలేమో. అంతే  కాకుండా సమకాలీన సామాజిక పరిస్థితుల గురించి " ఈ ఐదు కోట్లు రానియ్యండి సార్ ...ఒక్కక్కడి సంగతి చూస్తాను" అని అన్న అతడి మాటలు రానున్న కాలంలో రైతులు చేయబోయే గర్జన లా వినబడింది. ఆ కసి యీనాడు ప్రతి భారతీయ రైతు గుండెల్లో నిండి ఉన్నదే.

వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్ కావడం ప్రారంభంలో ఇబ్బందిగా ఉండేది కానీ రాను రాను అందులో కూడా కొన్ని కొన్ని ఆనందాలను కూడా  గమనించాను. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అయినప్పుడు  చుట్టు పక్కల రైతులతో తప్పనిసరిగా సంబంధాలు ఉంటాయి. ఎంతోకొంత రైతాంగ నేపధ్యం ఉంది కాబట్టి వారందరితో సంభాషించడం ...గాలి...నీరు..తో బాటు వాళ్ళ మాటల స్వచ్చతను కూడా సంపూర్ణంగా  ఆస్వాదించడం అలవాటుగా మారింది." బాబూ ...ఈ నాలుగు మామిడి పళ్ళూ ఉంచండి ..." అంటూ అప్యాయంగా వాళ్ళిస్తున్నప్పుడు తిరిగి వాళ్ళకేమి ఇవ్వాలో అర్దం కాని పరిస్థితి అనేక సార్లు ఎదురయ్యింది. ప్రభుత్వాలు స్వచ్చమైన నీటి కోసం పధకాలు తేవచ్చేమో కాని..స్వచ్చమైన మనసుల కోసం తేలేవుగా.....

ఆనందం అనేది సాపేక్షమైనదే అని ఇంతకు ముందు ఒక పోస్ట్ లో రాసిన గుర్తు. ఆ మాట ఎందుకంటున్నానంటే  ఈ టీవీలు..అంతర్జాలం ...సెల్ ఫోన్లు లేకమందు కూడా మనిషి ఆనందంగానే ఉన్నాడు. ఒక్కటే తేడా యేమిటంటే ఇంకొకరి ప్రమేయం లేకుండా మాత్రం ఆనందం పొందడమనేది ఇంచుమించు లేదనే చెప్పవచ్చు.  భోజన ప్రియులకు మాత్రం ఇది వర్తించక పోవచ్చు. కానీ యీనాటి యువతరం మాత్రం వారి వారి మూలాల గురించి యే కోశానా అలోచించలేని  మత్తులో ఊగి పోతున్నారు. యేమో ప్రతి జనరేషన్  తన తరువాతి జనరేషన్ గురించి ఇలాగే అలోచిస్తారేమో.. కానీ ఒక్కటి మాత్రం అనుభవంతో  చెప్పగలుగుతున్నాను.. నేను కాలేజ్ లోకి అడుగు పెట్టేసరికి బ్రతికి ఉన్న స్వాతంత్ర సమర యోధులు కూడా మమ్మల్ని చూసి గర్వపడే పనులు మేము కొన్ని చేసాం అని కొంత గర్వంగా చెప్పగలను . ఓక బలమైన గాలి వీచినప్పుడు రోడ్లు మీద మట్టి, ధూళి  మొత్తం యెగిరి పోతాయి. అప్పట్లో  యేదో ఒక ఉద్యమ గాలి ఉండేది కాబట్టి  కొంతైనా మనసులలో ఉండే చెత్త పోయి కొత్త భావజాలాలతో  శుభ్ర పడుతూ ఉండేవేమో. ఇప్పుడు ఉద్యమమే పెద్ద మార్కెట్ సరుకై కూర్చుంది. ఆ పాట యెవరు రాసారో గుర్తు లేదు కానీ "పూజ" సినిమా లోనిది అనుకుంటా. " నిప్పు రగిలి జ్వాల రేగ నీళ్ళ వలన ఆరును..నీళ్ళలోనె జ్వాల రేగ మంట యెటుల ఆరును"... 

పిల్లలలో ఒకటి  చూడవచ్చు. సాధారణంగా వాల్లకిస్టమైన పదార్ధాలు మితం లేకుండా తింటూ ఉంటారు. వాళ్ళకిష్టం లేనివి ముట్టరు. మా బంధువుల పిల్లలు చాలామంది ఆకు కూరలు ముట్టరు. అలా అనడం కంటే వాళ్ళ పెద్దలే వారిని అవి తినడానికి ప్రోత్సహించరు. యెందుకంటే అవి వీళ్ళకు కూడా పెద్దగా రుచించవు కాబట్టే. కానీ  మా ఇంటికి వచ్చి నప్పుడు మాత్రం మా ఇంట్లో ఉన్న కొద్ది కాలం లోనే నెమ్మదిగా అలవాటు పడతారు. ఇదే విషయం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. మన ఉపఖండానికున్న ప్రత్యేక పరిస్థితుల వలన మొత్తం సమాజం అనేక పొరల దొంతరగా మారి పోయింది. మనుషులు తమ స్వార్ధాన్ని కప్పి పుచ్చుకునేందుకు వాళ్ళు ప్రస్తుతం ఉండే పొరలను సునాయాసంగా పక్కన పెట్టి వేరే పొరల లోని భావాలను సునాయాసంగా అరువు తెచ్చుకోగలుగుతున్నారు. కంప్యూటర్ మీద మరీ ముఖ్యంగా ఆటో కేడ్ అనే సాఫ్ట్ వేర్  వాడే వాళ్ళకు యీ పొరల గురించి మంచి అవగాహన ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ గా చెప్పుకోవాలంటే స్వచ్చత అంతే నీవు ప్రస్తుతం ఉన్న పొర తాలూకు భావ జాలాన్ని మాత్రమే అన్ని వేళలా విశ్వసించడం.   
  

21, ఆగస్టు 2011, ఆదివారం

భలే మంచి లాభసాటి ఉద్యమం ...

అబ్బ ....యెంత ఆనందం....ఒక మహా  ఉద్యమం మొదలవ్వ బోతోంది. చాలా సంతోషం. ఆన్నాహజారే ప్రారంబించిన ఉద్యమానికి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. బహుశా  ఈ పదేళ్ళ కాలంలో ప్రజలు ఇలాంటి ఉద్యమాన్ని చూడలేదేమో. మీడియా కూడా మంచి ప్రచారాన్నిస్తోంది. వాళ్ళకు చాలా రోజుల వరకూ సెన్సేషన్ కోసం వెదుక్కోవలసిన అవసరం తప్పుతుంది.  ఈ  నేపధ్యంలో రెండు మూడు ఆత్మ హత్యలు జరిగినా ఆశ్చర్య పోనక్కరలేదు. లేదంటే  జరిగిన మరణాలన్నీ కూడా ఆత్మ హత్యలుగా మిగిలే అవకాశం కూడా యెక్కువే. చాలా మందికి ఇప్పటికే ఒక అవగాహన వచేసింది. ఈ ఉద్యమంలో పాల్గొంటే అరెస్ట్ లు లాంటివి జరిగే అవకాశం తక్కువే. జరిగినా కూడా దానివలన ప్రమాదం యెమీ ఉండదని కూడా అందరికీ తెలుసు ..అంతే కాదు అక్కడ కూడా మన పాండితీ ప్రకర్ష ప్రదర్శించొచ్చు..  ఆనంద పడ్డ స్టేషన్  స్టాఫ్ మనకు టీ లు సప్లయ్ చేసే అవకాశాలూ యెక్కువే.. యే విధంగా చూసినా చాలామందికి ఇది లాభసాటి ఉద్యమమే.
                   ఇది చాలా మందికి కోపం తెప్పించవచ్చు. కానీ మనం ఒక్క సారి కొన్ని విషయాలను సావధానంగా అవలోకిద్దాం. నేననుకోవడం ప్రకారం ఐతే చాలా మంది ఆ బిల్ ముసాయిదా కూడా చదివి ఉండరు. వూరేగింపులో పాల్గొని మాంచి ఆవేసం తో ఊగిపోతున్న కుర్రాడిని పిలిచి మనకేమి ఉపయోగమమ్మా యీ జనలోక్  పాల్ బిల్ వలన అని అడిగాను. ఆ కుర్రాడు తనకొచ్చిన యెస్.యెం.యెస్.  లో ఉన్న సారాంసాన్నాంతా చక్కగా చెప్పేసాడు.
 అప్పుడు అడిగాను..."నీవు చెప్పినదంతా బాగానే ఉంది కానీ నీవు చెప్పిన దానికి ..జన్ లోక్ పాల్ బిల్ కు సంబందం యేమిటి?"
" అదేంటి సార్...అందుకే కదా జన్ లోక్ పాల్ బిల్ తెస్తుంట"
నాకేమని చెప్పాలో అర్ధం కాలేదు.
ఒక్క సారి మనం మన దేశ పరిస్థితిని చూద్దాం. లెక్కల ప్రకారం మనం అభివృద్ది పధం లోనే ఉన్నాం. ఒక్క సారి గ్రామాల్లోకి వెళ్ళి వాస్తవాలు చూద్దాం. యెంత మంది రైతులు ఆనందంగా వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయాధారిత పరిస్రమలు యేవైనా  మనగలిగి ఉన్నాయా.. కళ కళ లాడుతూ ఉండ వలసిన గోదావరి జిల్లాల లోని గ్రామాలు కూడా ఇప్పుడు యెలాంటి పరిస్థితి లో ఉన్నాయ్ ?


                యీ నాడు మనకున్న అతి ముఖ్య మైన సమస్య అదేనని కూడా చాలా మందికి తెలుసు. మరి దీనికి జన్ లోక్ పాల్ బిల్ కు యేమైనా సంబంధం ఉందా....ఇదొక్కటేనా.. ...రగులుతున్న సమస్యలు యెన్ని లేవు? వాటి కోసం యే చర్చా జరగదు...జరిగినా మనం పట్టించుకొం. ఒక్క సారి అంధ్ర జ్యోతి లో  శ్రీ  రామఛంద్రగుహ  రాసిన ఒక ఆర్టికల్ లోని ఒక్క వాక్యం ఇక్కడ రాయడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. " నాగ్పూర్ లో లేక్మీ కంపెనీ వాల్ళు పెట్టిన ఫేషన్ షో కవర్ చేయడానికి 140 మందికి పైగా జర్నలిస్టులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కానీ యీ చుట్టు పక్కలే జరిగిన లెక్కలేనన్ని రైతుల ఆత్మ హత్యలు కవర్ చేయడానికి 6 గురు  జర్నలిస్టులు కూడా  లేరు. " యీనాడు ప్రతీదీ మార్కెట్ వస్తువైనట్లుగానే  ఉద్యమాలు కూడా మీడియా కు మర్కెట్ ను తెచ్చి పెడతాయి. అందుకే వాళ్ళు చాలా సెలెక్టివ్  గా ఉంటారు. మార్కెట్   కాని ఉద్యమం వాళ్ళకు అవసరం ఉండదు. మరి యిదొక్కటే మార్కెట్ సరుకుగా మీడియా యెందుకు యెంచుకుందో ఒక్క సారి మనసు పెట్టి అలోచిద్దాం.
1. యీ ఉద్యమం లో పాలు పంచుకొనే వారికి యెలాంటి భయం ఉండదని మనం ముందుగానే అనుకున్నాం. కాబత్తి సహజం గానే పట్టణ మధ్య తరగతి ప్రజలు దీనిలో గరంటీ గా పాలుపంచుకొంటారు. నగరాల్లో జరిగే ఉద్యమాలను మాత్రమే అసలైన ప్రజా ఉద్యమాలుగా భావించే నేటి పరిస్థితులలో దీనికి మాంచి గిరాకీ ఉంటుందని మీడియా పెద్దలకు బాగానే తెలుసు.
2. ప్రెస్సర్ కుకర్ లా ఉన్న నేటి సమాజం లో కొంత ప్రెసర్ ని యేదో రూపం లో బయటకు పంపడం అధికార పీఠాలలో ఉన్న వారికి చాలా అవసరం. అందుకు యేదో ఒక ప్రమాద రహిత ఉద్యమానికి అన్ని వైపుల నుండీ మద్దతు అవసరం. లేదంటే యీ ప్రెసర్ వలన జనం అంతా భిన్న రూపాలు ..అంటే ఆ పీఠాలు కదిలించే ఉద్యమాలలోకి మళ్ళుతారు. యీ భావజాలాన్ని కాపాడుకొంటూ పై పై మెరుగులకే మీడియా ఇస్టపద్డుతుంది కాని పునాదుల మార్పంటే వాటికి కూడా భయమే....
యీ మధ్య పేపర్ చూస్తున్న వారికందరికీ ఒక్క విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకు ముందు యెక్కువగా ఆకలి చావులు ఉండేవి.కానీ యీ మధ్య కాలంలో అవి రైతుల ఆత్మ హత్యలుగా మార్పు చెందాయి. కేవలం వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించిన పాపానికి అనేక వేల మంది రైతుల ఆత్మ హత్యలు దేశంలో జరుగుతున్నప్పుడు మన స్పందన యేమిటి? మీడియా వారు చూపిన శ్రద్ద యేపాటిది?
చాలా కాలం క్రితమే మా వూరిలో జరుగుతున్న మార్పులు  చూసి యేదో మనకు తెలియకుండానే రైతులను నెమ్మదిగా యీ వృత్తి నుండి ద్దొరం చేసే పరిస్థితులు యేర్పడుతున్నాయేమోనని అనిపించేది. మా వూరు రాజమండ్రి పట్టణానికి అతి సమీపంగా ఉందే గ్రామం. నేను చదువుకుంటున్న రోజుల లోనే  పట్టణాన్నుండి బంగారం వ్యాపారస్తులు ,బట్టల వ్యాపారస్తులు మా వూరిలో భూములు   కొంటున్నప్పుడు నాకు అనిపించేది...మన రైతులు ఒక్కరు కూడా పట్టణాల్లో ఆస్తులు యేవీ కొనలేకపోతున్నారు..కానీ ఆస్తుల విలువ లెక్క గడితే పొలాల విలువా ఆయా వ్యాపారస్తుల పెట్టుబడులకన్నా అనేక రెట్లు యెక్కువగానే ఉండేవి. నేను ఆర్ధిక శాస్త్ర విధ్యార్ధిని కాదు కానీ యేదో తెలియని సమీకరణాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అర్ధం అయ్యేది.
యేమాత్రం ఆర్ధిక శాస్త్ర  జ్ఞానం లేని నాకే ఆ మాత్రం అర్ధం అయ్యినప్పుడు మనకున్న మేధావులెందరికో యీ విషయం అర్ధం అయ్యే ఉంతుంది. కానీ పరిస్థితులు ఆత్మహత్యలకు దారి తీసినా రాజధాని వీధులలో యే రైతూ ఊరేగింపు తీయలేకపోయాడు కాబట్టి అది భారత దేశపు సమస్యగా మన మీడియా  గానీ యీ రోజు ఊరేగింపులు తీస్తున్న వర్గాలకు గానీ పట్టలేదు.
ఒక సమస్య మీద పోరాడడం తప్పు కాదు ఆ పోరాటాన్ని సమర్ధించడం పొరబాటు కాదు కానీ పొలాలు వదిలి పారిపోతున్న రైతుల గురించి  అలోచించడం ముఖ్యమా....లేక ప్రధాన మంత్రిని లోక్పాల్ పరిధి లోకి తేవడం ముఖ్యమా..అనేది విజ్ఞులే అలొచించుకోవాలి.
ఆ నాడు జాతీయోద్యమం మొదలైనప్పుడు కూడా మనం దేని కోసం పోరాడుతున్నామన్నది ఆ పోరాటం  లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన ఉండాలని...కేవలం రాజకీయ స్వాతంత్రయం వలనే మన సమస్యలు తీరి పోవనీ...పోరాడ  వలసిన అంశాలు  ఇంకా అనేకం ఉన్నాయని ఆనాటి మేధావులు కూడా నొక్కి వక్కాణించారు.  అది యీ  నాటికీ కూడా మనం పట్టించుకోము. కేవలం మనకు విలన్లు ప్రధానమంత్రి..జుడీషియరీ  యేనా ....ఇంకెవరూ కాదా....అసలు మన చుట్టూ ఉన్నవారి  పాత్రా...దానికి మన ప్రతిస్పందనలూ..ఒక్క సారి చూద్దాం.....
ఒక సారి విజయవాడ రైల్వే స్టేషన్  అప్పర్ క్లాస్ వెయిటింగ్  రూం లో కూర్చుని  ఉన్నాను. రాత్రి 12 గంటలు దాటి ఉండవచ్చు..వస్తున్నవారి వివరాలు..రిజిస్టర్  లో రాయడానికి ఒక అటెండెర్  ఉంటారు. సాధారణంగా యిది కూర్చుని చేసే ఉద్యోగమే కాబట్టి స్త్రీలనే అక్కడ కూర్చో బెట్టదం జరుగుతుంది. ఒక వ్యక్తి సుమారు 40 సం. ల వయస్సు ఉండవచ్చు..తన కుమారుడితో.. ప్రవేశించడం  జరిగింది.. ఆవిడ వివరాలు అడిగింది. అతడిది జనరల్ టికెట్ కావడంతో ఆవిడ మర్యాదగా ఆయనను జనరల్ వెయిటింగ్  హాల్ కు వెళ్ళమని చెప్పింది. అతడు వినకుండా అక్కడే కూర్చున్నాడు..ఆవిడ అడుగుతుంటే "ఉండమ్మా...రిజర్వేషన్ చేయించుకొంటాం.".అంటూ దబాయిస్తున్నాడే కానీ అక్కడ నుండి మాత్రం కదల లేదు. జనం అంతా చూస్తున్నారు...కానీ యెవ్వరూ మాట్లాడడం లేదు. కానీ ఒక తోటి రైల్వే ఉద్యోగిని కాబట్టి యిది చూస్తూ ఊరుకోడం నా వాల్ల కాలేదు..తగిన శాస్తి జరిపించాను అది అంత ప్రధానం కాదు. కానీ   ఇక్కడ నేను చెప్ప దలుచుకున్న దేమిటంటే బాధ్యత గల పౌరుడిగా   మన వంతు కర్తవ్యాన్ని కొంతైనా మనం చేయం....." అన్నా హజారే ..జిందాబాద్..అంటూ.."గొంతు చించుకుంటాం...  కానీ కనీసం ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఉన్నా కూడా ధీమాగా ముదుకు పొయిన వాడిని నాలుగు పీకుదాం..అని మాత్రం అలోచించం. రిస్క్ యెవరిక్కావాలండీ...ఇదీ మన దౌర్భాగ్యపు పరిస్థితి..


                  ఇది మనకు ప్రతిదినం అనేక చోట్ల యెదురయ్యే దృశ్యమే ....కానీ మనది అతి మందమైన చర్మం కాబట్టి  ఇవన్నీ మనకు సాధారణమైనవి గానే కనిపిస్తాయి. ప్రస్తుతం పెందుర్తి గ్రామం నుండి  వైజాగ్ రైల్వే స్టేషన్  మరియు బస్ కాంప్లెక్స్ వరకు BRTS రోడ్ ఇంచుమించు పూర్తి కావస్తోంది. దీనివలన కొన్ని లక్షల మంది ప్రయాణీకులు యెంతగానో లాభపడతారు. ఆ రోద్ లో ప్రయానించే వాళ్ళకు ఒక చోట యీ పని లో బ్రేక్ కనబడుతుంది. వేపగుంట అనె సెంటెర్ కు ముందు రెండు చిన్న చిన్న మందిరాలు ఉంతాయి. వాటిని చూస్తే అవి యీ మధ్యనే అంటే 20 సం. లోపులొనే కట్టినవని అర్ధం అవుతుంది. ఇంతమంది ప్రయాణీకులు లాభపడతారని తెలిసినా ఆ మందిరాలను యెవ్వరూ కదప లేక పొతున్నారు. మందిరాలకి ..మానవత్వానికి దూరం సహజంగానే యెక్కువగానే ఉంటుంది కానీ అధికారులు....యువకులు ..ప్రజాసంఘాలు...మరి సో కాల్డ్ మీడియా యేమి చేస్తుందో తెలియదు. మరి అన్నా హజారే ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ వూరేగడం కంటే ఇటువంటివి ముఖ్యమని యెందుకు అనిపించడం లేదు. నేను ఒక్క వైజాగ్ లో రోజూ గమనిస్తున్న ఒక్క సమస్య గురించి ప్రస్తావించాను. మరి వెదికితే ప్రతి చోటా ఇటువంటివి యెన్నో ఉంటాయి. కానీ అవి మన దృస్టికి కనబడవు. కారణమైతే  నాకు ఒక్కటే కనబడుతుంది. మనమంతా ఒక అధీకృత భావజాలానికి అతీతంగా అలోచించడానికి ...యేదైనా ఆచరించడానికి వెనికాడుతూనే ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మధ్య తరగతి నుండి వచ్చిన విధ్యార్ధులకు సినిమాలు ,షికార్ల కంటే కూడా ఒక ఉద్యోగం, కుటుంబానికి తగినంత ఆసరాగా నిలబడడం తక్షణ అవసరం. కానీ కాలేజ్ లలో అది అధీకృత భావజాలం కాదు. నేను చదివిన తణుకు అప్పటికింకా గ్రామమే...అందులో ఉన్న మా కాలేజ్ ఆవూరికి గొప్పదే కాబట్టి కొత్త సినిమాకు అడిగినన్ని టికెట్స్ ఇవ్వలేదని గొడవకు బయలు దేరితే నా వెనుక వంద మంది పైగానే చేరేవారు. కానీ "ఉద్యోగమైనా...చూపండి లేదా జైల్లో ఐనా పెట్టండి " అన్న స్లోగన్ తో ఊరేగింపుకు బయలుదరినప్పుడు అందులో మా స్నేహితులం నలుగురిమే ఉన్నాము. పైగా ఆ రోజు బజార్ లో మాకు యెదురు వచ్చిన మా కాలేజ్ మేట్స్ మమ్మలని వింతగా  చూసారో లేదో తెలియదు కానీ మా మనసులో ఫీలింగ్స్ అలానే ఉన్నాయ్. ఐతే కాస్తో కూస్తో మొండి తనం ఉంది కాబట్టి..మేము చేస్తున్న పని మాకే కాకుండా పదిమందికీ మంచి చేస్తుందన్న అచంచల విస్వాసం ఉంది కాబట్టి మేము మా ప్రయాణాన్ని కొనసాగించాం.. మా భావజాలమే అక్కడ అధీకృత  భావజాలంగా నడిచేలా చేయగలిగాం.
టీవీలు....ఇంటర్నెట్ ..అంతకంటే దరిద్రమైన సెల్ ఫోన్ లు యువత ను సామాజిక బంధాల నుండే కాకా, సామాజిక అవసరాలను, సామాజిక సిద్దాంతాలను పట్టించుకోడం పూర్తిగా మానేసారు కాబట్టి కేవలం  రేటింగ్స్  కోసం గడ్డి తినే చానల్స్ వారు చాప క్రింద నీరులా ప్రవహింపచేస్తున్న మాయాజాలం లో పడకండి. మీరు అన్నా హజారే లా ఇక్కడ యేదైనా చేస్తే వారు కవర్ చేయరు. మీరందరూ కలసి ఊరేగింపులు తీస్తేనే వాళ్ళు కవర్ చేస్తారు. యెందుకంటే వాళ్ళకు యెప్పుడూ ఒక మార్కెట్ విలువ ఉండే వస్తువు కావాలి. మీరు ఊరేగింపులు తీస్తే అక్కడ ధిల్లీలో దీక్ష చేస్తున్న వారి మార్కెట్ విలువ ఇతోధికంగా పెరుగుతుంది. కాబట్టి మీరే అన్న హజారే లా ఉండాలో...లేక అన్నా హజారే కోసం ఊరేగింపులు చేసేవారిగా ఉంటారో మీరే తేల్చుకోండి.


అనుకున్నట్లుగానే అంతా సుఖాంతం అయ్యింది. ఒక్క సారి ప్రభుత్వం ప్రకటించిన లోక్ పాల్ ముసాయిదా ను ,అన్నా హజారే ప్రతిపాదించిన ముసాయిదా ను కూలంకషంగా ఒక్క సారి పరిశీలించండి. నాకైతే రాణీ గారు సన్నజాజుల బదులు మల్లెలు తెచ్చిన రాజా వారి మీద అలిగిన చందాన అంపించింది. దాని కోసం ఇంత హంగామా చేయడం అవసరమా....యేమో తెలియదు. నాకైతే మాత్రం అనేకానేక సమస్యల వలయం లో ఉన్న మనం యీ ఒక్క సమస్యనే జాతీయ సమస్య గా చేయడం వలన అసలు సమస్యలు పక్క దారి పడుతున్నాయేమో అనిపిస్తుంది. యేది యేమైనా అన్నా నిమ్మరసం తాగేసారు కాబట్టి నాకు మాత్రం కొంత ఉపసమనం కలిగింది. యెందుకంటే నిన్ననే ఒక నటీమణి  తన వీపు మీద అన్నా టాటూ వెయించుకొని పత్రికలకు ఫోజిచ్చింది. ఆయన ఇంకా ఇదే దీక్షలో కొనసాగుతుంటే ఇంకా మిగిలిన వారు ఇంకెక్కడ ఆ టాటూ లు పొడిపించుకుంటారో అన్న టెన్షన్ తో చచ్చి ఉండేవాడిని. ఒకసారి మంచి మార్కెట్ కు యెక్కిన దేనినీ మన వాళ్ళు వదలరని  తెలుసు కదా.. 
ఇందాకనే జే.పీ ఒక ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పడం విన్నాను. అందరిలో మార్పు కోసం తపన, పోరాడే పటిమ ఉంటేనే యే ఉద్యమమన్నా ముందుకు వెళ్ళతాయే తప్ప యే ఒక్కరి మీదో ఆధార పడి ఐతే కాదు. ఒక సారి యేదైనా పేరు వచ్చిన గుడికి వెళ్ళి చూడండి. యేదో ఒక అడ్డ దారిలో (వీ.ఐ. పీ కోటా, స్పెషల్ దర్శనాలు కూడా యీ కోవలోకే వస్తాయి) దేవుడిని దర్శించుకుందామనే తపన, అంటే కనీసం అక్కడ కూడా మనం యెంతో కొంత న్యాయాన్ని పాటిద్దామని ప్రయత్నించం. దేవుడి దగ్గరే అడ్డదారులు అంగీకారం అయినప్పుడు మిగిలిన చోట్ల అదే దారిలో వెళ్ళడానికి మనమెందుకు ప్రయత్నించం. అంతేకాదు నీవు తలనీలాలు సమర్పించుకొంటేనే సర్వ పాపహరణం జరుగుతుందని నమ్మడంలో యెన్ని ప్రమాదాలో ఒక్కసారి చూద్దాం. నీవు పాపం చేసావంటే సమాజం లో యెవరి కో నీ వలన అన్యాయమో..అపకారమో జరిగి ఉంటుంది. దానికి పరిహారం యేమిటంటే తిరిగి నీ వలన నష్త పోయిన వారిని యేదోలా ఆదుకోవడం..లేదా అది వీలు కాక పోతే అవసరం లో ఉన్న మరొకరికైనా సాయం చేయడం. ఇదే హేతుబద్దమైనదని విజ్ఞులెవరైనా ఒప్పుకుంటారనే భావిస్తున్నాను. కానీ దీనిని కాకుండా గుడికి వచ్చి తలనీలాలు ..అర్పించుకోడం..లాంటివి చేయడం వలన యెవరికి లాభం...నాకేమని అనిపిస్తుందంటే దీంట్లో ఉన్న ఒకే ఒక సౌలభ్యం వలన ప్రజలు యీ పద్దతిని అమోదించేసారని. అదేమిటంటే నీవు అపచారమో ..లేక అన్యాయమో చేసినట్టు యెవరికీ తెలియకుండానే నీ పాప పరిహారం జరిగిపోతుంది...యీ పద్దతిలో. అందుకు యీ గుళ్ళ చుట్టూ మహాత్యాల కధలు సృష్టించబడ్డాయి ...వాటినే నమ్ముకుంటూ మనం మాత్రం సమాజాన్ని అధోగతిలోకి నెట్టుతూనే ఉన్నాం.


మనమెంత పాపమో లేక అన్యాయమో చేసినా  కూడా దాని  పరిహారం సమాజానికి యే మాత్రం జవాబుదారీ తనం వహించకుండానే జరిగిపోతోంది...ఆహా యెంత గొప్ప సౌలభ్యం..యీ విధమైన సౌలభ్యం మిగిలిన మతాలలో ఉందో లేదో తెలియదు కానీ యీ విధమైన సామాజిక, తాత్విక చింతన ఖచ్చితంగా మనను ఖచ్చితంగా పాతాళానికి గెంటుతూనే ఉంది. పుణ్య సాధనకు గుడికి వెళ్ళి పూజలు చేసే వారిని, తల నీలాలు అర్పించుకునే వారిని నేను యే మాత్రం ఆక్షేపించను యెందుకంటే అది వారు నమ్మిన ధర్మం లో భాగం.


ఒక సారి మా అమ్మాయి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభానికి ముందు హాల్ టికెట్స్  గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తున్నారు నాన్నా  నేను కూడా వెళ్తాను అన్నది. ణేను ఒక్క విషయం తనకు అర్ధం అయ్యేలా చెప్పాను. మార్కులకి పూజకు సంబందం పెట్టకు ..నీకు వేరే వారి అక్రమాల వలన అన్యాయం జరగకుండా చూడమని మాత్రం ప్రార్దించు. ఇంకొక విషయం యేమిటంటే అక్రమం జరిగ్తుందని ఒక వేళ నీకు తెలిస్తే దాని నివారణకు మార్గం దేవుడిని అడగకు. పోరాడడం మన పని. ఒక విషయం నాకు అర్ధం కాని దేమిటంటే మనం మన తలిదండ్రుల మీద భారం తగ్గించాలంటే వాళ్ళు చేస్తున్న పనిలో  భాగస్వాములవుతాం. అదే విధంగా మనం నిజంగా భగవంతుడిని పూజించాడం కంటే ఆయన చేయవలసిన పనిలో భాగస్వాములమైతేనే ఆయన సంతోషిస్తాడని అనిపిస్తుంది. కాబట్టే ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ముతో గుడి కట్టిన రామ దాసు కంటే ఆ విధంగా చేసిన ఆయనను జైలులో వేసిన తానీషాయే గొప్పవాడిగా  కనిపిస్తాడు.
యీ క్రింది మెయిల్ ఇప్పటికే చాలా మందికి వచ్చి ఉంటుంది ..మరి పోరాటం యెలా మొదలవుద్దో చూద్దాం.
     


        








14, ఆగస్టు 2011, ఆదివారం

నా అందమైన కల -సాఫల్యం

నాకొక అందమైన కల ఉండేది . ఏమో కొంత మంది పిచ్చి కల అని కూడా అంటారేమో..... 

ఒక చక్కటి కాలనీ ..అంటే అది కాలనీ లా ఉండ కూడదు. ఒక చక్కటి తోటలో ఇళ్ళు పేర్చి నట్లుగా ఉండాలి. ఆ ఇళ్ళుకూడా భారీ కాంక్రీట్ భవనాలు కాదు. అవసరానికి సరి పడా ..హోం అనే పదానికి పర్యాయపదం గా ఉండాలి. ఇంటి చుట్టూచక్కటి చెట్లు...విరిబూస్తున్న పూవులు...చెట్లకు కాస్తున్న పళ్ళు.... ఆకు కూరలు ఒక పక్కన...కాయ గూరలు ఒకపక్కన...కార్లు అన్నీ కాలనీ బయటే పార్కింగ్ ...ఒక్క నడవలేని స్థితి లో ఉన్న వారికే కారుతో కాలనీ లోకి ప్రవేశించేసౌకర్యం .....కాలనీ లో తిరగడానికి కాలి నడకే సాధనంగా ఉండాలి..లేకుంటే సైకిల్ .... 



ఇంతేనా...ఇంకా చాలా ఉంది ....ఎవ్వరూ ...రెండో అంతస్తు మించి కట్ట కూడదు. ఆ కాలనీ లో పవర్ అనేది  ప్రాబ్లం గా ఉండకూడదు. కిచెన్ వేస్ట్ దగ్గర నుండి ప్రతి డిస్పోసబుల్ మెటీరియల్ బయో గాస్ ఉత్పాదనకు వినియోగించాలి. మంచినీళ్ళతయారీ ..అంతా...సోలార్ సిస్టం తో నడవాలి. నీళ్లన్నీ వృధా కాకుండా రీ సైకిల్ చేసి మొక్కలకోసం వాడాలి. సర్ఫేస్ నీరు    తప్ప గ్రౌండ్ వాటర్ జోలికి వెళ్ల కూడదు. ముఖ్యమైన విషయం ప్లాస్టిక్ వస్తువేదీ కాలనీ లో కనబడ కూడదు. పిచ్చిబాగా తలకెక్కిందనుకుంటున్నారు కదా...లేదు ఇంకా మోకాలి దగ్గరే ఉంది.... 
ఏ.సి. వాడితే కాలనీ లో గాలి వేడెక్కే అవకాశం ఉంది కాబట్టి వాటి పైన నిషేధం ఎలాగూ ఉంటుంది. మరి వేసవి తాపాన్నితట్టుకోడం ఎలా...దానికి కూడా సమాధానం ఉంది...గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ తో .....స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ,కొచ్చిన్ వారుసూచించిన విధంగా గాలి వెలుతురూ ..ధారాళంగా వచ్చే విధంగా ....కేవిటీ గోడలు మరియు పైకప్పు వేసి..ఆ పైన ఇటుకముక్కలు ..సున్నం కలిపి..ఒక పొరగా వేసి..దాని పై న సూర్య రశ్మి లోని రేడియేషన్ ని తగ్గించగల తెల్లటి రిఫ్లెక్టింగ్ టైల్స్వేసుకుంటే నిస్సందేహంగా ఇంట్లో ౩౦ డిగ్రీలు మించి వేడి ఉండదు. వేడి తక్కువగా ఉన్నప్పుడు ఒక మామూలు ఫ్యాన్సహాయంతో ఉక్క పోతను తట్టుకోవచ్చు. పిచ్చి నడుము దాకా...వచ్చింది కదా......మిగిలింది చూద్దాం.
కాలనీ లో ఏ మతానికీ సంబందించిన ప్రోగ్రామ్స్ జరగ కూడదు. లో లోపల ఏ మతాన్ని అభిమానించినా బయట మాత్రంఒకే కామన్ మతం. మానవతా వాదం. మైక్ గోల అనేది ఉండ కూడదు. మరీ అంత మూర్ఖత్వమా....అనుకుంటున్నారా...మతానికి సంబందించని....ఒక గొప్ప కళాకారులకి మాత్రం అందరి అనుమతితోప్రోగ్రాం ఎరేంజ్ చేయవచ్చు...దానికోసం చక్కని ఆడియో సౌకర్యం ఉండే ధియేటర్ ఉండాలి. దానికి ఆనుకొనే ఒక చక్కటిలైబ్రరీ ఉండాలి. దానిలో చక్కటి పుస్తకాలతో బాటు.. అనేక ఉచిత"ఈ "బుక్స్ చదువుకొని డౌన్ లోడ్ చేసుకొనేసదుపాయం..(రుసుము వసూలుతోనే ..) ఉండాలి. లైబ్రరీ కి వచ్చినా రాక పోయినా ...దానికి అయ్యే ఖర్చు మాత్రంఅందరి మీదా పడుతుంది. ప్రతి నెలా ఒక రోజు ప్రపంచ గతిని మార్చి వేసిన మహనీయుల పుస్తకాల మీద చర్చ లుఉంటాయి. ఉత్తమ ఉపన్యాసకుడికి పుస్తక బహుమతి లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కాలనీ వాసులుఅందరూ భరించాలి. అంతే కాదు బయట ప్రదర్శితం కాని ఉత్తమోత్తమ చలన చిత్రాలను కూడా కాలనీ వాసులకి అందుబాటులో ఉంచాలి. 

 వయో బేధం లేకుండా అందరికీ  శారీరక వ్యాయామాలు చేసే సదుపాయం ఉండాలి. తక్కువ ఖర్చుతోనే ఉల్లాస్సాన్నిచ్చే  వాలీ బాల్, బాడ్మింటన్ లాంటి క్రీడలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ ఉండాలి.
 నేనేమన్నా ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నానేమో తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద  రియల్ ఎస్టేట్ వెంచర్స్ యొక్క ప్రకటనలు ఒక్క సారి చూస్తే నావేమీ గొంతెమ్మ కోర్కెలు కావని సులువుగా ఎవరికైనా అర్దం అవుతుంది. క్లబ్ హౌస్ ..జిమ్...స్విమ్మింగ్ ఫూల్స్ ఒకటేమిటి మనలను ఫూల్స్ చేసే సమస్తం అందులో కనబడతాయి. ఈ ఏడ్స్ చూస్తున్నప్పుడు నాకేదో వెలితి ఉన్నట్లుగా అనిపించేది. ఇవన్నీ ఆ యా కాలనీ వాసులని ఆత్మీయంగా ఉంచుతాయా...ఎవరి మానసిక ప్రపంచంలో వారిని బ్రతికేలా చేస్తాయా....అలోచించి నాకంటే తెలివైన వారు చర్చిస్తే బాగుంటుంది. 
   నేనెప్పుడు సెలవులకి వూరికి వెళ్ళినా మా నాన్న గారు.."ఏమిటోరా ...జనం ఎవరూ కలవడం లేదు..ఏమీ తోచుబడి కావడం లేదు " అంటూనే ఉంటారు. మరి ఇంట్లో టీవి తో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. నాకర్దమైన విషయం ఏమిటంటే మనం టీవీ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చూడొచ్చు. అంటే మనం కేవలం ప్రేక్షకుడి గానే మిగిలిపోతాం.మన ఆలోచనలన్నీ మన లోనే ఇమిడి పోతుంటాయి. సమాజం లో అసలు ఇబ్బంది అక్కడే కనిపిస్తుంది. మామూలుగా ఉండవలసిన సోషల్ interaction  ఉండడం లేదు. కేవలం కొన్ని స్పెషల్ ఫంక్షన్ లోనే కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాస్త సమయం లోనే లేని పోని భేషజాలు ప్రదర్సిస్తున్నాం. ఇదంతా చూసి చూసి....నాలో పైన చెప్పిన కల ప్రారంభమైంది. 
 దీని గురించి అలోచిస్తున్నప్పుడే అనుకోకుండా మా మామయ్య తన మనసులో ఉద్దేశ్యం చెప్పాడు. గనులు తవ్వడం పూర్తవ్వగా మిగిలి పొయిన గోతులలొ మంచి మట్టి నింపగా ఇంచు మించు నాలుగు యెకరాల ఖాళీ స్థలం యెర్పడిందనీ..దానిలో యేదైనా నేచురోపతి కి సంబందించిన ఆశ్రమమేదైనా కట్టాలనున్నదని చెప్పాడు . నాకెందుకో ఇది జరిగే పనేనా అనిపించింది. కానీ తనే పది సార్లు ఫోన్ చేసేసరికి నెమ్మదిగా ఒక్కొక్కటీ డిజైన్  చేయడం ప్రారంభించాను. ప్రారంభించిన కొద్ది రోజులకి బ్రోచర్  వేయడం జరిగింది.దానిని చూస్తే నా కలలు కొన్నైనా నెరవేరే  సూచనలున్నాయని మీరే ఒప్పుకుంటారు. 

పైనున్న బొమ్మ బ్రోచర్ మొదటి పేజ్ . యీ క్రింది పేజ్ యోగా హాల్ కి సంబందించినది. దీనిలో మొదటి అంతస్తు అన్ని హంగులతోనూ పూర్తికావస్తోంది. పక్కన ఇచ్చిన సమాచారం 100% వాస్తవం.
యీ దిగువన ఇచ్చింది పేషెంట్స్ కు ఇచ్చే గదుల సముదాయం. యీ భవన నిర్మాణం పూర్తయ్యింది.
  అంతే కాకుండా నేను కలలు గన్న గ్రీన్ హౌస్  కాన్సెప్ట్ 
తో కట్టబోయే కాటేజ్ లు కొద్ది రొజుల్లోనే రూపు దిద్దుకోబొతున్నాయి. అనతి కాలం లోనే  యే విధమైన యే.సీ. లు వాడకుండానే మనం చల్లగా ఇంటిని ఉంచగలమని చూపిస్తున్నాము.  వాటి నమూనా  నమూనా క్రింద ఇస్తున్నాను.








నా కలలలో చాల భాగం ఇక్కడ నిజ రూపం దాల్చనున్నాయి. వాటితో బాటు మనకు అవసరమైన ఆయుర్వేద మొక్కలతో ఒక పూర్తి స్థాయి పార్క్  డిజైన్ చేయడం జరిగింది. ఆ మొక్కలన్నీ కూడా జైపూర్ (ఒడిషా) నుండి ఉపలభ్యం కానున్నాయి. వాటి మీద నుండి వచ్చే గాలి కూడా మానవ శరీరానికి  స్వాంతన చేకూరుస్తుంది.
మానసికంగా ఉల్లసం కలిగించడానికి చక్కటి లేండ్ స్కేపింగ్ దిజైన్ చేయబడింది. యీ మొత్తం పనిలో సంకేతికతలో  (టెక్నికల్)    ముఖ్య భూమిక నిర్వర్తించగలిగినందుకు నా కలలే కాకుండా నా జీవితం కూడా సాఫల్యం చెందుతుందని మనసారా నమ్ముతున్నాను. యెందుకంతే మల్తీ స్పెషాలిటీ పేరుతో జరుగుతున్న దొపిడీ కి వ్యతిరేకంగా నా వంతు పాత్ర నేను నిర్వర్తించగలుగుతున్నాను.
యీ మహత్తర ఆశ్రమం 99% దసరా పవిత్ర దినం నుండి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

యీ ఆశ్రమం  చుట్టూ ఉన్న భూమి చక్కటి కాలనీ  కట్టడానికి యెంతో అనువుగా ఉంతుంది. స్నేహితులు ...ఆప్తులు సహకరిస్తే ...పచ్చటి చెట్లు.... ..రంగు రంగుల పూవులు.....పక్షుల కిలకిలలు.... పిల్లల ఆట  పాటలు...నడి వయస్సు వారి ఆత్మీత తో కూడుకున్న పలకరింపులు...సమాజానికి మార్గ దర్సకత్వం వహించేవారి చర్చలకు కేంద్రంగా....చర్చలే కాదు కార్యాచరణకు  కూడా కేంద్రంగా ..కృత్రిమత్వం అనేది కనుచూపులో లేకుండా ..హేతుబద్దమైన  సాంప్రదాయ  సాంస్కృతిక కార్యకలాపాల నిలయంగా ..పరిసరాలు  చూడ గానే ..."అందమె ఆనందం ..." అనే మధుర గీతాన్ని పెదవుల పైకి తెచ్చే విధంగా ..ఒక కాలనీ నిర్మిచాలని ఉన్నది. అది అందరికీ నచ్చక పోవచ్చు కానీ మహా మానవతా సువాసనలు జీవిత చరమాంకం వరకూ ఆఘ్రాణించాలనుకునే వారికి పూర్తి అనువుగా ఐతే ఉండగలుగుతుంది.

చివరిగా చిరునవ్వుతో ముగిస్తాను. నా అలోచన అంతా విన్న మా బావ మరిది ఒకరు " ఇంతకూ ఆ కాలనీ కి యే పేరు పెడతావు బావా ?" అని అడిగేడు.
"థింకర్స్ కాలనీ అని పెడితే యెలా ఉంటుంది ?" అన్నాను.
" వూరుకో బావా...హేపీ గా డ్రింకర్స్ కాలనీ అని పెట్టు ...నెల రొజుల్లో ప్లాట్స్  అన్నీ నేనే అమ్మించేస్తాను" అన్నాడు
నిజమేనేమో...

4, జులై 2011, సోమవారం

చెక్ బిఫోర్ హెల్ప్.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి పలాస వెళ్ళే ఈ ఎం యు బయలు దేరింది . బయలుదేరే స్టేషన్ లో అయితేనే సీట్ దొరికేబళ్ళల్లో ఆ బండి కూడా ఒకటి. మర్రిపాలెం తరువాత దాంట్లో నిలబడడానికి కూడా చోటు ఉండదు. ప్రతి రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఆ బండి ఎక్కడం నాకు అలవాటే. ఇద్దరు కూర్చునే సీట్లో కూర్చుని న్యూస్ పేపర్ తిరగెయ్యడం మొదలు పెట్టాను. బండి మర్రిపాలెం వచ్చింది. జనం పెట్టెల్లో కూరుకోడం ప్రారంభం అయ్యింది. అప్పటికే నాపక్కన ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు. ఒక వ్యక్తి సుమారుగా ముప్పై సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. నుదుటిమీద బొట్టు పెట్టు కున్నాడు...ముఖానికి ఫేస్ పౌడర్ కూడా రాసినట్టు తెలుస్తూనే ఉంది. సరే అతని ముఖంతో నాకేమీసంబంధం లేదు కానీ బోగీ లోకి ఎక్కీ ఎక్కకుండానే నా సీట్ దగ్గరకు వచ్చి " ఇది ముగ్గురు కూర్చునే సీట్ కదా ...జరగండి.." అన్నాడు.
అనుమానమొచ్చి ఒక్క సారి సీట్ వంక చూసుకున్నాను. ఇద్దరు కూర్చునే సీటే. నాకు ఎందుకో అతని దబాయింపుధోరణి నచ్చ లేదు.
"చూడండి..ఇది ఇద్దరు కూర్చునే సీటే.." అన్నాను.
అతడు ప్రయత్నం మానలేదు ." ఐతే నే ఎదుటి సీట్లో ముగ్గురు ఉన్నారుగా.." అన్నాడు.
"మిస్టర్ అది వాళ్ళ ఇష్టం..నేను జరగను" భీష్మించేసాను.
అతడు సణుగుడు మొదలు పెట్టాడు. " అంతేనండి జనాల్లో హెల్ప్ చేసే స్వభావమే ఉండట్లేదండీ..మీరేకూర్చోండి..హాయిగా కూర్చోండి.."
నేను పట్టించు కోలేదు.
పక్కనున్న కుర్రవాడిని అడిగాను నెమ్మదిగా " ఎక్కడ దిగుతావమ్మా..."
"పక్కనే సార్ ..కొత్తవలసలో దిగిపోతాను.."
నెమ్మదిగా నాకే వినబడేటంత నెమ్మదిగా అన్నాడు.
బండి సింహాచలం స్టేషన్ కు వచ్చింది.
ఒక ముసలి దంపతులు ఎక్కారు.
పక్కకు జరిగి " మీరిద్దరూ కొంచెం సర్దుకు కూర్చోండి ..పక్క స్టేషన్ లో ఈ కుర్రాడు దిగిపోతాడు ..అప్పుడు మీరురిలాక్సేడ్ గా కూర్చోచ్చు .. " అన్నాను.
వాళ్ళిద్దరూ బోల్డు సంతోష పడి పొయ్యారు.
"ఒరేయ్..ఎవరికి సహాయం చెయ్యాలో చూసుకొని చెయ్యడం నేర్చుకోండి ..అంకుల్ ని చూసి " అని
ఎదుటి సీట్లో కూర్చున్నావిడ పిల్లలకు చెప్పడం నేను దిగేటప్పుడు
విన్నాను.
ఆ మధ్య వచ్చిన "వేదం " సినిమా లొ బ్రహ్మానందానికి ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఒక వేశ్య అడిగిన ప్రశ్నకు అతడు సమాజానికి చేస్తున్న సహాయాల గురించి వివరిస్తాడు. " హాస్పిటల్ లొ ఆపిల్ పంచడం.... " ఇంకా అలాంటివి. నిజంగా చెప్పాలంటే ఆ పాత్ర చాలా సజీవ పాత్రే. మా వీధిలొ మా అపార్ట్మెంట్ దగ్గరే ఒక ఆటో స్టాండ్ ఉంది. వాళ్ళు దసరా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఒక సారి నేను సెల్లార్ లొ బండి తీస్తుండగా ఒక పక్కనె భారీ యెత్తున జరుగుతున్న వంట యేర్పాట్లను చూసి ఆశ్చర్య పొయ్యాను. చాలా భారీ యెర్పాట్లే. వాచ్ మన్ ని పిలిచి అడిగాను.
"సార్....అన్న సంతర్పణ వంటలు ....ఆటో స్టాండ్ వాళ్ళవే ...యేదో మన సెంటర్ వాల్లే కదా అని" నీళ్ళు నమిలాడు.
నా సందేహం అతడికి అర్దం కాలేదని నాకు అర్దమయ్యింది.
" మరి యీ బిర్యానీ వాసనలు యేమిటి?"
అప్పుడె ఆ స్టాండ్ లొ ఆటో అతడొకదు అక్కడికి వచ్చి నా ధర్మ సందేహాన్ని తీర్చాడు.
"సారూ పాత రోజులు కావు మరి.. యీ మాత్రం లేక పొతె సంతర్పనకు జనం రారు ..జనం రాకపొతే..ఇంతా చేసి...మరి ఉపయోగం యేటి?"
పక్కనే అంటించి ఉన్న పోస్టర్ లొ నుండి స్పాన్సర్ చేసిన నాయకుడి ముఖం నన్ను చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. వాడు యీ పెట్టుబడి యెందుకు పెడుతున్నాడో నాకైతే తెలుసు. కానీ యీ ఆటొ వాళ్ళకు వాళ్ళు అన్నార్తులకు హెల్ప్ చేస్తున్నారో ...లేక ఆ నాయకుడికి పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారో అర్దమయ్యేదెప్పుడో తెలియడం లేదు.
1996 లొ అనుకుంటా.. కోనసీమ లొ భయంకరమైన తుఫాన్ వచ్చింది. మొత్తం కోనసీమ అంత అతాకుతలమై పోయినత్లుగా వార్తలు అన్నిట్లోనూ వచ్చాయి. ఆ రొజుల్లోనే మా రైల్వే ప్రోజెక్ట్ కు ఇండియా లోనే ఉత్తమమైన ప్రోజెక్ట్ గా అవార్డ్ వచ్చి 100000 రూపాయల నగదు బహుమతి కూడా ప్రకటించారు. డానికి విజయవాద లోని వస్త్ర వ్యాపారులు కూదా తమ వంతు సహాయ సహకారాలు అందజేయడంతో ఒక లారీ నిండా దుప్పట్లు వగైరాలు నింపుకొని కోనసీమ లోనే ఉన్న మా బంధువుల వూరికి వెళ్ళాం. మెము అక్కడికి వెళ్ళిన తరువాత అర్దం చేసుకున్నదేమిటంటే అక్కడ మొత్తం వ్యవసాయ పనులు ఆగిపొయ్యాయి. మొత్తం పని చెయవలసిన కూలీలంతా రోద్ మీదే హాయిగా వేచి ఉండి అందుకుంటున్న సామగ్రి విలువ వాళ్ళకు వచ్చే దినసరి వేతనం కంటే యెక్కువ గా ఉంటోంది. అప్పుడె నాకు ఒక సత్యం అర్దమైంది. యే సహాయం కూడా సామాజికోత్పత్తికి దోహద పడేలా ఉండాలి. ఉత్పత్తి యొక్క ఫలితం యెవరి జేబుల్లోకి వెళ్తుందనేది వేరే కోణం లో ఆలోచించవలసిన విషయం. భారతదేశం లోని రాజకీయవాదులకు అభివ్రుద్ది పధకాలకంటే కూడా సంక్షేమ పధకాలంటేనే మోజు యెందుకో నాకు ఒక స్పష్టమైన ఆలోచననిచ్చింది. ఒకడు కాలు పోయి అంగవిహీనత్వంతో రోడ్ పక్కన అడుక్కుంటుంటే నిజంగా వాడిని బాగు చేయాలుకునే వాడు వాడికి మిగిలిన రెండు చేతులతో చేయగల పనిని చూపిస్తాడు. వాడిని అడుక్కునే వాడి కిందే చూడాలనుకునే వాడు వాడికి 10 రూపాయలు దానం చేసి పోతాడు. అభివ్రుద్దికి..సంక్షెమానికి గల తెడా చాలా సూక్ష్మమైంది. ఇది అర్దం చెసుకోలేని వాళ్ళు పిల్లల పెంపకంలో కూడా పొరబాట్లు చేసే అవకాశాలు చాలా యెక్కువ.
మితిమీరిన నిబద్దతను కూదా ఒక విధమైన అర్దం లేని సహాయం క్రిందే పరిగణించవచ్చు. ఏ విషయమైనా జీవితంలో తక్షణ ఫలితాలనివ్వవు. యీ రొజు నీవు నాటిన విత్తనం యే ఫలితాన్నిస్తుందో తెలుసుకుంటానికి ఖచ్చితంగా కొంత వెచి చూడవలసి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభిద్దాం. నాకు తెలిసిన ఒక అమ్మాయి భయంకరమైన పిసినారితనం తో బ్రతికే కుటుంబంలో పుట్టి పెరిగింది. కొన్ని పరిస్థితులు తారుమారు కావడం వలన అనుకోకుండా ఆ అమ్మాయి ఒక ధనిక రైతు కుటుంబానికి కోడలయ్యింది. అదంతా తన భర్త ..అత్తవారి సౌహార్ద్రత వల్లనే జరిగిందని తను మనసారా నమ్మింది. అది నిజం కాదని తెలిసిన నాలాంటి వాళ్ళు ఆ అమ్మాయి దృఖ్పధాన్ని మార్చడానికి విఫల యత్నం చేసాం. తరువాత తన ఖర్మ అని వదిలేసాం. ఆ అమ్మాయి ఎంతో దూరం నుండి మేము వచ్చినప్పుడు కూడా తన భర్త శృంగార జీవితానికి భంగం వాటిల్లుతుందని 9.00 గంటలు కాక ముందే మమ్మల్ని నిర్మొహమాటంగా పొమ్మనేది, త్వరగా పడుకోవాలనే వంకతో.
అప్పట్లొనే నేనొక విషయాన్ని గమనించాను. వాళ్ళకున్న మిగులులో చాలా భాగం ఆయన ఖర్చులుకే పొయ్యేది. అది నాకేదో అసంబద్దంగానే అనిపించి చెప్పి చూసాను కూడా. అప్పుడప్పుడు కొనే చీరలను చూసుకుని మాత్రం యీవిడ మురిసిపొయ్యెది కానీ యీ అసంబద్ద పంపిణీ గురించి అలోచించేది కాదు. ఆఖరికి సంతానం చదువుల గురించి ఖర్చు చెయవలసిన డబ్బు కూడా తన భర్త ఖర్చుల కోసం వాడుకున్నప్పుడు కూడా ఆమె ప్రతిఘటించలేదు. యీ వాతావరణం మొత్తానికి సంతానంలో యే విధమైన దృఖ్పధాన్ని పెంచాయంటే మన సుఖాన్ని గురించి మనం అలోచించుకోవాలి కాని అది మొత్తం మీద కుటుంబానికి ఎలాంటి నస్టాన్ని కలుగచేస్తుందనేది పట్టించుకోవడమే మానేసారు.
మన దేశ పరిస్థితికి యీ ఆలోచనకు కొంత సారూప్యత కనిపిస్తుంది. మితిమీరిన విశ్వాసంతో చేసే సహాయాలు కూడా చాలా వరకూ ఇలాంటి ఫలితాలనే ఇస్తాయ్. సహాయం చేసే లక్షణమే కరువవుతున్న యీ రోజుల్లో (పైన చెప్పిన "వేదం" సినిమా లోని బ్రహ్మానందాన్ని పోలిన రాజకీయ వాదులను లెక్కలోకి తీసుకోకూడదు). అందువలన సహాయం చేస్తున్నది సరైన పనికే అని నిర్ధారించు కోడం చాలా అవసరం. ఆడిగారు కదా అని అందరికీ "వినాయక చవితి" "దసరా" పందిళ్ళకు చందాలిచ్చి వాళ్ళు వేసిన పందిళ్ళ వల్ల ట్రాఫిక్ కదలక తిట్టుకొనే జనాన్ని చాలా మందిని ఇక్కడ చూస్తూ ఉంటాను.
మనకు కొన్ని విశ్వాసాలుండవచ్చు. అందరికీ అవే ఉండాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుందని చాలామందికి తెలియదు. అలాగే యెవరి జీవితమైనా (కుటుంబ,వ్యక్తిగత) వారి వారి భౌతిక పరిస్థితుల వలన యేర్పడిన అలోచనల వలనే వస్తాయన్న వాస్తవాన్ని విస్మరించి తనకున్న విశ్వాసాలకు భిన్నంగా నదిచే వారి మీద దుమ్మెత్తి పోయడానికి కూడా యీ " హెల్ప్' లేదా "గైడింగ్" అనే పదాలను బాగా వాడుకొంటుంటారు. నేను పైన చెప్పిన అమ్మాయి ఇంటికే ఒక సారి చుట్టపు చూపుగా వెళ్ళాను. ఆ ఇంట్లోకి ప్రవెశించడం తోనే ఆవిడ ఆకస్మాత్తుగా
" యేంటి పక్కింట్లోనికి చూసుకుంతూ వస్తున్నావ్?" అని అడిగింది.
నెను కొన్ని సంగతులు అప్పటికే విని ఉండడం వలన యాదాలాపంగానే అడిగాను
"యెందుకలా అడుగుతున్నావు?"అన్నాను
"యెమీ..లేదు..మా ఇంటికి వచ్చే వాళ్ళంతా ..ఆ ఇంటి వైపు చూసుకుంటూ వస్తారులే.." వేళాకోళంగా అన్నది.
" యీ విషయాన్ని మీ అన్నా ..తమ్ముళ్ళకు కూడా చెప్పి హెచ్చరించినట్లున్నావ్?" కొంచెం కోపంగానే అన్నాను.
"అవును బాబూ...లేకపోతే ...అందరికీ పెళ్ళిల్ళు కానక్కరలేదా..."
నాకు కోపం నసాళ్ళాన్నంటింది
" ఆవిడను నేను చూడ లేదు....కానీ నాకంతా తెలుసు. బుద్ది లేని తలిదంద్రులు వాళ్ళ అవసరం కోసం కని ...ఒక వెధవకు అంట గట్టి చేయిదులుపుకున్నారు...కట్టుకున్న వెధవ..వెనుకా ముందూ అలోచించుకోకుండా తీర్చుకున్న వాంచల వలన ..ముగ్గురు పిల్లలు పుట్టారు....వాడి వలన పైసా ఆదాయం లేదు. కన్న పాపానికి ఆ పసి పిల్లలను యేదోలా బ్రతికించుకోవాలి. కానీ ఆమెకు వేరే దారి తెలియదు. ఆవిడ చేస్తున్న పని మంచిది కాకపోవచ్చు.. పెద్దలు సంపాదించి ఇచ్చింది తింటూ ఖాళీగా కూర్చుని..గంటల తరబడి చీరల గురించి ..నగల గురించి సొల్లు చెప్పుకొనే బదులు నీలాంటి ఆడవాళ్ళు ఆమె మీద రాళ్ళు వేసే బదులు ఆవిడకు యెదైనా దారి చూపించండి. అసలు నా దృష్టిలో ఆవిడ మీలో చాలా మంది కంటే పతివ్రతే..."
ఆవిడకు పెద్దగా పట్టలేదు...అది వేరే విషయం.
చాలా సార్లు మనం చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా పెద్ద విషయాల గురించి మాట్లాడతాము. ఎంతో మందికి ఇబ్బంది కలిగించే పని కొంత మంది వలన అవుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంటాం. నేను పైన చెప్పిన ట్రైన్ లోనే ఒక సారి ప్రయాణం మొదలుపెట్టాను. నేను కూర్చున్న కంపార్ట్మెంట్ అంతా ఒకే చోటికి వెళ్ళే ప్రయాణీకులతో నిండి ఉంది. అంతవరకూ ఇబ్బంది లేదు కానీ ట్రైన్ బయలుదేరక ముందే ఒకతను " హలో...మైక్ ..టెస్టింగ్" అంటూ మైక్ ఆన్ చేసాడు. నాకేదో అనుమానం తోస్తూనే ఉంది. అయినా నాకెందుకులే అనుకుంటూ పేపర్ లో దూరి పొయ్యాను. ట్రైన్ బయలు దేరింది. మైక్ పట్టుకున్న వేరే అతడు తెలుగు లాంటి భాషలో ఉపన్యాసం మొదలు పెట్టాడు. అది తెలుగే కానీ బాగా అలవాటు పడితే కాని దానిని అర్ధం చేసుకోవడం కష్టమే. ఆయన ఒక మతం గురించి ఉపన్యాసం మొదలుపెట్టాడు. భరించడం కష్టంగానే ఉంది. నాకైతే ఏ మతం పట్లా ప్రత్యేకించి ద్వేషం ..అభిమానం లేవు. కానీ ఒక పబ్లిక్ ప్లేస్ లో అనేక మతస్తుల మద్య ...ఒకే మతస్తుల గోల ఏంటి ..నా పక్కన కూర్చున్న అతడిని అడిగాను
" చూడు బాబూ మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?"
" దేవుని సేవకు..." క్లుప్తంగా చెప్పాడు.
" ఇది దేవుని సేవా..?"
అతడు కోపంగా చూసాడు.
నేను లేచి మైక్ పట్టుకున్న అతడి దగ్గరికి వెళ్లి సౌమ్యంగా చెప్పాను.
" మీరు మైక్ కట్టేయండి"
"మీరవరండీ ..అడగడానికి...ఇంట మంది లో మీ ఒక్కరికే డిస్టర్ బెంసా ..."
ముగింపుని అతడే కొని తెచ్చుకున్నాడు.
జనం అంతా అప్పటి వరకూ ఉగ్గ బెట్టుకుని చూస్తున్న వాళ్ళ కందరికీ ఈ సమాధానం కారం రాసి నట్లుగా అనిపించింది..
ఆ తరువాత వాళ్ళు మైక్ కట్టక తప్ప లేదు.
సమాజం లో మనం చేయగలిగింది మనం చేస్తే చాలు చాలా ఉపయోగం చేసినట్లే. అన్నదానాలు..ఇతరత్రాలు..పేపర్లో వేయించుకొనే దురద ఉన్న వాళ్లకి ...రాజకీయాల్లోకి వెళ్ళాలను కొనే బ్రోకర్ గాళ్ళకి పనికి వస్తాయి.
కొన్ని కొన్ని సహాయాలు ఎవరికి....... ఎందుకు......అనేది చేసే వాళ్లకు కూడా ఒక అంచనా ఉండదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు నేను గత కొద్ది కాలంగా మా ప్రాజెక్ట్ నడుస్తున్న ఏరియా లో జరుగుతున్న "పనికి ఆహార "పధకాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఉదయం పది గంటలకు పని లోకి వెళ్ళిన శ్రామికులు మధ్యాహ్నం తిరక్కుండానే ఇళ్ళకు వచ్చేస్తుంటారు. కనీసం ఇచ్చిన జీతానికి పని చేయించు కోలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ఈ పధకం పెట్టింది ఎందుకో అర్ధం కాదు. పైగా ఆ సీజన్ లో వ్యవసాయ పనులు కూడా బాగానే ఉంటాయి. రైతులకు పనివాళ్ళు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా కనబడుతాయి. ఒకటి పూర్తి శ్రమను వినియోగించుకోకుండానే వాళ్ళ కోసం ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నాం. అదే సమయం లో శ్రామికులు లేక వ్యవసాయ ఉత్పత్తి దెబ్బ తింటోంది. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే ఈ పనికి ఆహార పధకం స్కీం నడుస్తున్న రోజుల్లో వైన్ షాప్స్ ఫుల్ కలక్షన్లతో ఉంటాయి. అంటే మొత్తానికి మొత్తానికి ప్రజా ధనం ఎక్కడకు ప్రవహిస్తుందో అర్ధం అవుతుంది. కేవలం సంక్షేమ పధకాలకు జనాలు అలవాటు పడేలా చేస్తున్నారు. ఎవరైనా పూనుకొని ప్రభుత్వాలు అభివృద్ధి పధకాలకు యెంత ఖర్చు చేస్తున్నారు...సంక్షేమ పధకాలకు యెంత ఖర్చు పెడుతున్నాయి..లాంటి లెక్కలు తీసి ఈ విధంగా జరుగుతూ ఉంటే చివరికి నష్ట పోయే దెవరు? లాంటి విషయాలు ప్రజలకు అర్ధం అయ్యే విధంగా లెక్కలు తయారు చేస్తే బాగుంటుంది. అసలు ప్రతి సంవత్సరం ఎక్షైజ్ ఆదాయం ఎందుకిలా పెరిగిపోతుంది....ప్రజల ఆదాయ వనరులు పెద్దగా పెరగకుండా అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. చదువుకున్న వాళ్ళు..చదువుకుంటున్న వాళ్ళు ఇలాంటి విషయాల మీద ప్రజలను చైతన్య వంతులని చేస్తే వాళ్ళ వంతు కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించి నట్లవుతుంది అంతే గాని ఐ పీ ఎల్ మాచ్ స్టాటిస్టిక్స్ ..కాదు ఈనాడు కావలిసింది.

మనం సహాయం చేయడం వలన ఏదైనా సమస్య సంపూర్ణంగా సమసి పోతుందా లేదా అని కూడా చూసుకొంటూ ఉండాలి. ఉదాహరణకు ఒక మేన్ హోల్ చోక్ అయ్యి ఆ చెత్తంతా రోడ్ మీదకు పొర్లు తున్నప్పుడు కేవలం దానిని మాత్రం శుభ్రం చేస్తే లాభం ఉండదు. ఆ మేన్ హోల్ ఎందుకు చోక్ అయ్యిందో చూసి దానిని నిర్మూలించే వరకూ ఆ సమస్య పరిష్కారం కాదన్న వాస్తవాన్ని నీవు చాలా ముందుగానే గ్రహించడం చాలా అవసరం. లేదంటే నీ శ్రమ చాలా వేస్ట్ అవుతుంది. వీధి గూండాలుగా ఉన్న వాళ్ళు ,బ్రోకర్ గా ఉన్నవాళ్ళు ..కొంత ఖాళీ టైం ఉండి నెమ్మదిగా రాజకీయ వాదులుగా మారి పదవులు వెలగ పెట్టి అతి లగ్సరీ జీవితం అనుభవిస్తున్నప్పుడు మనకేమీ చీమ కుట్టినట్టుగా అనిపించదు. పేపర్లో స్విస్ బాంక్ ఖాతాలను చూసి ఆవేశం తెచ్చేసు కుంటాం. వాటికి వ్యతిరేకంగా ఏదైనా ర్యాలీ జరిగితే వెళ్ళం. వాటంతట అవే జరగాలని ఆశిస్తూ ఉంటాం. మన యొక్క ఉదాసీనత వలనే స్విస్ బాంక్ లోకి ఈ ధన ప్రవాహం జరిగిందనేది వాస్తవం కాదా..? అంటే పోరాటం మన ఉదాసీనత మీద కూడా చెయ్యాలి కాదా..కానీ ఇక్కడితో ఆగకండి. అసలు ఇంత ఉదాసీనత ఏర్పడటానికి వెనుక ఉన్న మన సాంస్క్రతిక ,తాత్విక మూలాలు ఏమిటి? ఒక్క సారి మన పురాణ గాధలు చూడండి. మనం చేసిన ప్రతి తప్పు పనినీ ఏదోలా సమర్ధించుకోనే అవకాశాలు కోకొల్లలు. మన తాత్విక మూలాలు అర్ధం చేసుకుని వ్యాఖ్యానించిన ఆనాటి మేధావులని విదేశీ తొత్తులుగా చూసాం. క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నుండి నేటి వరకూ ఉన్న ఆలోచనలన్నిటినీ మనం పొరలుగా మన దగ్గరే ఉంచేసుకుంటాం. అవసరమైనప్పుడు ఏ పొర మనకు వీలుగా ఉంటుందో ఆ పొర లోకి ఇమిడి పోతాం. పెళ్లి రోజు వచ్చిందనుకోండి. ఉదయాన్నే దేవుడి గుడికి వెళ్తాం. ఎందుకైనా మంచిదని ఎవరికీ కోపం తెప్పించ కుండా ఇద్దరు ముగ్గురి దేవుళ్ళ గుళ్ళకి వెళ్తాం. ఏ విషయం మీదా పరి పూర్ణమైన నమ్మకం ఉండదు. మాకు బంధువులైన కుటుంబాలు కొన్ని ఉన్నాయ్. వాటిలో ఆడవాళ్ళను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు రెండే పనులు చేస్తారు. ఒకటి పేకాట ఆడతారు. లేకుంటే సాయి బాబా భజనలు చేస్తారు. మధ్యలో మరే ఏక్టివిటీస్ ఉండవు. ఎన్ని పొరల అంతరం..... ప్రతి మనిషి లోనూ లేదా సమాజం లోనూ మెటీరియలిస్టిక్ , ఐడియలిస్టిక్ భావజాలం ఏదో కొంత శాతం కలిసే ఉంటాయి..కానీ ఆ విభజన రేఖ చాలా స్పష్టంగా కనబడుతుంది....కానీ ఇక్కడ ఈ పొరల మాయ వలన ఆ రేఖలో ఉన్న గజిబిజి మరెక్కడా ఉండదేమో..ఇదంతా ఎందుకు రాయవలసి వస్తుందంటే నీవు దేనినైనా గెంటే అవసరం ఉన్నప్పుడు నీ క్రింద నేల గట్టిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నీవు అప్లయ్ చేసిన ఫోర్స్ ఎటువైపు వెల్లుతున్నదనేది నీకే అర్ధం కాదు. ఉదాహరణకు నల్ల డబ్బు కి వ్యతిరేకంగా చాలా మంది ఉద్యమాలు మొదలుపెడుతున్నారు. నీకు సరైన దృక్పధం లేక పోతే ఒక సామాజిక కార్య కర్త వెనుక వెళ్ళడం మానేసి ....యోగా నేర్పడానికి ఒకే క్లాసు లో ముందు వరసకు వెనుక వరసకు వేరు వేరు రేట్లు పెట్టి ఇంకా రక రకాలుగా ఆనతి కాలంలో వేల కోట్ల రూపాయలు సంపాదించిన బాబా వెనుక వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇక్కడొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. శారీరక ఆరోగ్యానికి యోగా చెయ్యడం మంచిది. కానీ మొత్తమ్మీద ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. అది స్పష్టంగా ఉండే నీ తాత్విక దృక్పధం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనవసరమైన పొరలన్నీ తొలగించి..నీకు..నీ కుటంబానికి ... ప్రస్తుత సమాజం లో అధిక శాతం మందికి ఉపయోగ పడగలిగే భావజాలాన్ని పెంచే పొరలను మాత్రమే ఉంచుకొవాలి. పురాణాల ప్రభావం వలన మన హేతుబద్ద  అలోచన లొ కూడా కొన్ని కొన్ని సార్లు బ్లాక్స్ యేర్పడతాయి. చిన్న ఉదాహరణ చూద్దాం. సినిమా లలో ఒక హీరోయిన్ ను విలన్ టీజ్ చేస్తుంటే మనకు సహజంగానే అతడి మీద కోపం వస్తుంది.  కానీ అదే పనిని హీరో చేస్తే మనకు ఆ కోపం రాదు. యెందుకంటే  మనం మానసికంగా హీరో పక్షంలో ఉంటాం. అంటే ఒకే పనిని ఇరువురు వ్యక్తులు చేస్తే వారిరువురి మీదా మనకు ఒకే రక మైన ఫీలింగ్స్ రావడం లేదు. సమాజంలో కూడా యిది అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది. మనం ఒక విషయాన్ని ,సపోర్ట్   చేసేటప్పుదు కానీ ...వ్యతిరేకించేటప్పుదు కానీ యీ బ్లాక్స్ లేకుండా చూసు కోవడం చాలా ముఖ్యం.
అదే మాదిరిగా మనం హెల్ప్..అనో..సానుభూతి అనో మనం చేసే  కొన్ని అలోచనలు తరతరాల నుండీ స్త్రీ జాతికి శాపం  అయ్యి కూర్చుంటుంటే దానిని దిశ మర్చే విధంగా యెవరూ చూడడం లేదు. యేదో ఒక సాధారణ సినిమా ను తీసుకుందాం. దానిలో కధ ప్రకారం ఒక అమ్మాయి మీద యెవడో వెధవ  అఘాయిత్యం చేయబోతాడు. ఆ అమ్మాయి తనను రక్షించు కొనే ప్రయత్నం లో అతడి ప్రయత్నాన్ని తీవ్ర స్థాయి  లోనే ప్రతిఘటిస్తుంది. షరా మామ్మూలుగా హీరో రంగ ప్రవేశం చేసి వాడిని తన్ని తగిలేస్తాడు. ఆ అమ్మాయి  కృతజ్ఞతగా "నా మానాన్ని కాపాడావు..థాంక్స్ " లాంటి డైలాగ్స్ చెబుతుంది. మనం వినేసి ఆనందించేస్తాం. ఇక్కడ గమనించవలసిన విషయం యేమిటంటే ప్రతిఘటించే  ప్రయత్నంలో ఆ అమ్మాయి ఒళ్ళంతా గాయాలైనా పెద్దగా అఘాయిత్యం జరగలేదనే మనం భావిస్తాం.  కానీ దురదృష్ట వశాత్తూ ఆ ఒక్క శరీర   భాగం మీద అఘాయిత్యం జరగ్గానే సర్వస్వం కోల్పోయినట్లుగా ఆ అమ్మాయి..సమాజం....భావించేసి సహాయానికి కంకణం కట్టుకుని తయారైపోతారు. అసలు "శీలం"... "మానం" అనే పదాలకు అర్దం తీసిన వాళ్ళని వురి తీసినా తప్పు లేదని నా అభిప్రాయం. మానం అనేది ఒక వస్తువు గా చేసి కొల్పోతే తిరిగి పొందలేమన్న వికృత అలోచన మీద మరింత విస్తృత చర్చ జరిగితే బాగుంటుంది.